కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న అశోక్ గెహ్లాట్
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దాదాపు గంటన్నరపాటు దిల్లీలోని 10 జన్పథ్లో సమావేశమయ్యారు.
తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన రెండు రోజుల క్రితం జరిగిన పరిణామాల పట్ల సోనియాగాంధీకి క్షమాపణ చెప్పానని అన్నారు.
‘‘రెండు రోజుల క్రితం జరిగిన ఘటన మనందరినీ కలిచి వేసింది. ఇది నాకు ఎంత బాధ కలిగించిందో కేవలం నాకు మాత్రమే తెలుసు. నేను ముఖ్యమంత్రిగానే కొనసాగాలని అనుకుంటున్నానని, అందుకే ఇదంతా జరిగినట్లు దేశమంతటా ఒక ప్రచారం జరిగింది. నేను సోనియా గాంధీని క్షమాపణ కోరాను. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా నేను ఉంటానా? లేదా? అనే దాన్ని సోనియా గాంధీ, కాంగ్రెస్ నిర్ణయిస్తుంది’’ అని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ‘‘ఇలాంటి పరిస్థితుల మధ్య అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని నేను నిర్ణయించుకున్నా. ఇదే నా నిర్ణయం’’ అని ఆయన తెలిపారు.