సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ ఆఫీసు దగ్గరలో
ఒక భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో ఆరుగురు మరణించగా,
మరో నలుగురు గాయపడ్డారు. వారికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స
అందిస్తున్నారు.
ప్రమాదం జరిగిన భవనంలో కింద రెండు అంతస్తుల్లో
ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్, పై
అంతస్తుల్లో లాడ్జీ ఉన్నాయి.
సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో భవనంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలు ఏర్పడి మంటలు బైక్ షోరూంలో వ్యాపించాయి. బైక్ బ్యాటరీలు కూడా పేలి ఉండొచ్చని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు.
అక్కడి నుంచి మంటల కంటే ఎక్కువగా దట్టమైన పొగ వ్యాపించింది. పొగ పైన ఉన్న లాడ్జీకి వ్యాపించడంతో లాడ్జీలో ఉన్న వారికి ఊపిరి అందక ఎక్కడ వారు అక్కడ పడిపోయారు. కొందరు కిందకు దూకారు. ప్రస్తుతం అందర్నీ బయటకు తీసుకువచ్చారు. మంటలు అదుపులో ఉన్నాయి.
ప్రమాద సమయంలో కనీసం 23 మంది లాడ్జీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
అగ్నిమాపక, పోలీసు శాఖ అధికారులు వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని సహాయ కార్యక్రమాలు అందించారు. కొందర్ని కాపాడారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. క్రేన్ ఉపయోగించి కొందర్ని రక్షించే ప్రయత్నం చేశారు. స్థానికులు పెద్ద ఎత్తున సహాయం చేశారు.
‘‘ఇంకా ప్రమాద కారణాలు తెలీదు. షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేక బైకులు చార్జింగ్ పెట్టడం వల్లనా అని తెలీదు. 23 వరకూ రూమ్స్ ఉన్నాయి. మొదటి, రెండు అంతస్తుల్లో పొగ వ్యాపించింది. లాడ్జీలో వారు ఎక్కువగా వ్యాపారం పనులపై ఉత్తర భారతదేశం నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. నిద్రలో ఉండడం వల్ల ఊపిరి ఆడక, కారిడార్లో పొగ వల్ల ఏమీ కనిపించక, ఒక మహిళ సహా మొత్తం ఆరుగురు మరణించారు’’ అని నగర పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ మీడియాతో చెప్పారు.
మృతుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల వారు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఎక్కువ మంది 30-40 ఏళ్ల వయసున్న మధ్య వయస్కులే.