భారత జాతీయ
కాంగ్రెస్ పార్టీని దిగ్బంధించారని, పార్టీ ప్రధాన కార్యాలయాన్ని, పార్టీ
తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసాన్ని, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
నివాసాన్ని దిల్లీ పోలీసులు ముట్టడించారని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ చెప్పారు.
ఆయన బుధవారం ఒక
ట్వీట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టారు.
‘‘కక్షా రాజకీయాల వికృత రూపమిది. మేం తలవంచం. మా గొంతు నొక్కలేరు. అన్యాయాలకు,
మోదీ సర్కారు వైఫల్యాలకు వ్యతిరేకంగా మా గొంతు వినిపిస్తూనే ఉంటాం’’ అని
పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ నేత అభిషేక్ మనూ సింఘ్వీ దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘మీరు మమ్మల్ని అణచివేయటానికి ఎంతగా అయినా ప్రయత్నించవచ్చు. మా ప్రతిఘటనను మీరు చూస్తారు. పూర్తిగా ప్రజాస్వామిక ప్రతిస్పందనను ప్రపంచం చూస్తుంది. మిమ్మల్ని మేం ఎండగడుతూనే ఉంటాం’’ అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. ‘‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆహార ఉత్పత్తుల మీద జీఎస్టీ. ఈ మూడు అంశాలపై రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి నివాసాల ఎదుట నిరసన చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది’’ అని చెప్పారు.
‘‘మీరు మమ్మల్ని ఎంతగా అణచివేసినా సరే కాంగ్రెస్ పార్టీ ఈ మూడు అంశాలపై నిరసనను కొనసాగిస్తుంది’’ అని పేర్కొన్నారు.
నిరసనకారులు ఏఐసీసీ కార్యాలయం వద్ద, సోనియాగాంధీ నివాసం వద్ద నిరసనకారులు పెద్ద సంఖ్యలో గుమిగూడే అవకాశం ఉందంటూ స్పెషల్ బ్రాంచ్ నుంచి అందిన సమాచారంతో బుధవారం నాడు ఆయా ప్రాంతాల్లో దిల్లీ పోలీసులు బలగాలను మోహరించారు.