ఉత్తర్‌ ప్రదేశ్: దొంగలనే దోచుకున్న పోలీసులు.. ఎస్ఐ సహా నలుగురు అరెస్ట్

పోలీసులు

ఫొటో సోర్స్, Firozabad Police

    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో దొంగల నుంచి డబ్బులు తీసుకుని వారు పరారయ్యేందుకు సహకరించిన నలుగురు పోలీసులను అరెస్టు చేశారు.

‘‘నేరస్థులతో చేతులు కలుపుతున్న కొందరు పోలీసులకు ఇలాంటి కఠినమైన చర్యలతో గట్టి సందేశం పంపినట్లు అవుతుంది’’అని ఫిరోజాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పీ) అశోక్ కుమార్ తెలిపారు.

‘‘పోలీసులే నేరాలకు పాల్పడితే, చాలా తప్పుడు సందేశం ప్రజల్లోకి వెళ్తుంది. ఈ నెల మొదట్లోనూ నలుగురు పోలీసులపై మేం చర్యలు తీసుకున్నాం. వారు లిక్కర్ మాఫియాతో చేతులు కలిపినందుకు జైలుకు పంపించాం’’అని అశోక్ తెలిపారు.

‘‘పోలీసులపై చర్యలు తీసుకోవడం మీద పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి చర్యల వల్ల మిగతా పోలీసులు కూడా అప్రమత్తం అవుతారు’’అని జర్నలిస్టు ముఖేశ్ బఘేల్ అన్నారు.

రాజేశ్

ఫొటో సోర్స్, Firozabad Police

ఫొటో క్యాప్షన్, చోరీ కేసులో అరెస్టైన రాజేశ్

అసలు ఏం జరిగింది?

అక్టోబరు 15న రసూల్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆటోలో రూ.లక్షా పదివేలు చోరీకి గురయ్యాయి. డ్రైవర్ సీటును కట్‌చేసి దొంగలు ఆ డబ్బులను ఎత్తుకెళ్లారు.

బాధితుడు గౌరవ్ ఆ విషయాన్ని గుర్తించి రసూల్‌పుర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతర విచారణలో దొంగలు డబ్బుల్ని ఎలా దోచుకున్నారో పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయినట్లు పోలీసులు గుర్తించారు.

‘‘ఆ ఘటనకు సంబంధించి పక్కాగా సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఆటో నుంచి ఇద్దరు దొంగలు డబ్బుల్ని దోచుకుంటూ ఆ వీడియోలో కనిపిస్తున్నారు. వెంటనే జిల్లా మొత్తాన్నీ మేం అప్రమత్తం చేశాం. అన్ని చెక్‌పోస్టులకూ వారి ఫోటోలను పంపించాం’’అని అశోక్ కుమార్ తెలిపారు.

అక్టోబరు 18న ఇద్దరు దొంగలు పోలీసులకు దొరికారు.

‘‘డబ్బులు ఎక్కడున్నాయ్? అని దొంగల్ని అడిగినప్పుడు.. పోలీసులే తీసేసుకున్నారు అని వారు చెప్పారు’’అని అశోక్ వివరించారు.

‘‘సరిహద్దు పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ సునీల్ అతడి బృందం దొంగల దగ్గర డబ్బులు తీసుకుని వారు సాఫీగా జిల్లా దాటేందుకు సహకరించారు. డబ్బుల్ని తీసుకొని వారి కారులోనే దొంగల్ని ఎక్కించుకున్నారు.’’

‘‘దొంగల దగ్గర డబ్బులు తీసుకున్న పోలీసు బృందం మొత్తాన్ని అరెస్టు చేసి జైలుకు తరలించాం. వారి దగ్గర నుంచి డబ్బులను కూడా రికవరీ చేశాం’’.

బాలకృష్ణ

ఫొటో సోర్స్, Firozabad Police

ఫొటో క్యాప్షన్, చోరీ కేసులో అరెస్టైన బాలకృష్ణ

ఒక ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుళ్లు..

దొంగల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నవారిలో ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక పోలీసు జీపు డ్రైవర్ ఉన్నారు.

ఇలాంటి ఘటనలతో పోలీసుల ప్రతిష్ఠ మసకబారే అవకాశముందా? అని ప్రశ్నించినప్పుడు.. ‘‘పోలీసులపై ఉన్న చెడ్డ పేరును తొలగించేందుకు మనం కృషి చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసినంతవరకు తప్పు చేసిన పోలీసులపై తీసుకున్న చర్యలతో పోలీసులపై ఉన్న అభిప్రాయం మెరుగు అవుతుంది. లేదంటే పోలీసులు చేసే నేరాలను కప్పి పుచ్చేస్తారని అందరూ అంటుంటారు. మేం ఆ వాదన తప్పని ఈ కేసుతో నిరూపించాం. ఎవరు నేరం చేసినా, చర్యలు తీసుకుంటామని స్పష్టమైన సందేశం దీని ద్వారా పంపినట్లు అవుతుంది’’అని అశోక్ అన్నారు.

‘‘పోలీసుల పని నేరాలను అడ్డుకోవడం. అంతేకానీ నేరాలను చేయడం కాదు. ఇలాంటి కేసులు మళ్లీ వెలుగులోకి వస్తే, మరింత కఠినమైన చర్యలు తీసుకుంటాం’’అని అశోక్ కుమార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)