కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ఇవ్వలేమని సుప్రీం కోర్టుకు తెలిపిన మోదీ ప్రభుత్వం

ప్రచురణ

కోవిడ్-19తో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారాన్ని ఇవ్వలేమని సుప్రీం కోర్టుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక ఇబ్బందులే దీనికి కారణమని వివరించింది.

కరోనా సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.

కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందిస్తూ దాఖలుచేసిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది.

‘‘కోవిడ్ సంక్షోభంలో చిక్కుకున్న వారి కోసం కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీగా ఖర్చుపెడుతున్నాయి. ఇప్పటికే మా ఖజానాలపై చాలా భారం పడుతోంది’’ అని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.

‘‘కోవిడ్‌తో పెద్దయెత్తున మరణాలు సంభవించడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలతోపాటు దేశానికి ఇది తీర్చలేని లోటు.’’

‘‘ఇది ఒక విపత్తులాంటి సమయం. మన దేశంలో కరోనావైరస్ పెద్దయెత్తున విజృంభించింది. దీన్నుంచి ప్రజలను రక్షించేందుకు భిన్న చర్యలు, వ్యూహాలు అవసరం అవుతాయి. ఈ పరిస్థితులు మాకు సవాల్ విసురుతున్నాయి.’’

మొత్తం ఖర్చుపెట్టేయాలి

‘‘ఇంకా భారత్‌లో కరోనా ఉద్ధృతికి కళ్లెం పడలేదు. ఇది ఎప్పటికి ముగుస్తుందో చెప్పడం కూడా కష్టమే. ఈ ప్రభావాల నుంచి తట్టుకునేందుకు ఆరోగ్య వ్యవస్థలతోపాటు ఇతర సంరక్షణ వ్యవస్థలను మెరుపు వేగంతో అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. దీని కోసం లక్షల కోట్ల రూపాయలు అవసరం.’’

‘‘కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం.. ప్రజలు, ఆరోగ్య వ్యవస్థలను సన్నద్ధం చేయడం.. సంక్షోభ తీవ్రతను తగ్గించడం.. రికవరీ.. ఇలా భిన్న అంచెల్లో మనం సిద్ధం కావాల్సి ఉంటుంది. దీని కోసం పెద్దయెత్తున ఆర్థిక, సాంకేతిక వనరులు అవసరం అవుతాయి.’’

‘‘విపత్తు నిర్వహణ చట్టం కింద 12 రకాల విపత్తుల్లో మరణించినవారికి పరిహారం అందిస్తాం. ఈ నిధిని విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్ఎఫ్)నుంచి ఇస్తాం. 2021-22 సంవత్సరానికి అన్ని రాష్ట్రాల ఎస్‌డీఆర్‌ఎఫ్‌లు కలిపినా కేటాయింపులు రూ.22,184 కోట్లు మాత్రమే అవుతున్నాయి.’’

‘‘కోవిడ్-19‌తో మరణించిన వారి కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు ఇవ్వాలంటే మొత్తం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఖర్చుపెట్టాలి. అంతకంటే ఎక్కువే అవుతుంది కూడా.’’

కోవిడ్‌తో 3,85,000 మందికిపైగా మృతి

‘‘మొత్తం పరిహారానికే ఖర్చు పెట్టేస్తే, కరోనా నియంత్రణ చర్యలు, ఆరోగ్య వ్యవస్థల ఖర్చులకు నిధులు సరిపోవు. ఒకవేళ తుపానులు, వరదలు లాంటి విపత్తులు వచ్చి పడితే, మరింత కష్టం అవుతుంది’’అని ప్రమాణపత్రంలో కేంద్రం పేర్కొంది.

''కోవిడ్ మహమ్మారి వల్ల ఇప్పటివరకు 3,85,000 మందికిపైగా మరణించారు. ఈ మృతులు ఇంకా పెరిగే అవకాశం ఉంది''.

''ఇప్పటివరకు ఏ విపత్తుతోనూ ఇంతమంది మరణించలేదు''.

''మృతుల కుటుంబాలకు సాయం చేయాల్సిన అవసరాన్ని కేంద్రం గుర్తించింది. అయితే, కేవలం రూ.4 లక్షలు పరిహారం ఇస్తేనే ఆదుకున్నట్లు అని అనుకోవడం సరికాదు''.

''ఇలాంటి మహమ్మారులు విజృంభించినప్పుడు భిన్న అంచెల్లో మనం సిద్ధం కావాల్సి ఉంటుంది. బాధ్యతాయుతమైన, సుస్థిర విధానాలను మనం అనుసరించాలి. దీనిలో ఆరోగ్య వ్యవస్థలను సిద్ధం చేయడం, సామాజిక కార్యక్రమాలను ప్రవేశపెట్టడం, ఆర్థిక సంక్షోభం తీవ్రత తగ్గించేందుకు చర్యలు ఉంటాయి''.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)