ఏపీ: జులైలో ఇంటర్, పదో తరగతి పరీక్షలు.. సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్న విద్యాశాఖ మంత్రి

ప్రచురణ

పరీక్షల నిర్వహణ విషయంలో అభ్యంతరాలున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.

అందుకు తగ్గట్టుగా వచ్చే నెలలో ఇంటర్ పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జులైలో పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయని ఆయన స్పష్టం చేశారు.

క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో పరీక్షలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

ఇంటర్ పరీక్షలు బహుశా జులై మొదటివారంలో జరగొచ్చని వెల్లడించారు.

జులై చివరి వారంలో టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఉందని అన్నారు.

జులైలో పరీక్షలు నిర్వహించలేకపోతే ఇక అవకాశం ఉండదని భావిస్తున్నామని మంత్రి అభిప్రాయపడ్డారు.

అయితే, తాము కచ్చితంగా జులైలోనే పరీక్షలు పెడతామని చెప్పడంలేదని, అవకాశం ఉందని మాత్రమే చెబుతున్నామని ఆయన వివరించారు.

పరీక్షలు రద్దు చేయడం ఎంతో సులభమైన పని అని, ఒక్క నిమిషంలో చేయగలమని తెలిపారు. కానీ తర్వాత పర్యవసానాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేరళ, బీహార్ రాష్ట్రాలు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాయని, చత్తీస్‌గఢ్ కూడా పరీక్షలు పెడుతోందని చెప్పారు.

సీఎం జగన్‌తో చర్చించి పరీక్షల ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

ఇంటర్‌ పరీక్షలకు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కావాల్సి ఉంది.

పరీక్షల షెడ్యూల్ ని 15 రోజుల ముందు ప్రకటించాలి.

దాంతో ఈ నెల 20 తర్వాత దానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందని అంచనా వేస్తున్నారు. ఆగస్టులో ఎంసెట్ పూర్తి చేసి, సెప్టెంబర్‌లో క్లాసులు ప్రారంభించేందుకు ఏపీ ఉన్నత విద్యాశాఖ ప్రణాళిక వేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)