గాంధీ హాస్పిటల్‌ను సందర్శించిన సీఎం కేసీఆర్‌ - Newsreel

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

ప్రభుత్వ హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్స జరుగుతున్న తీరును పరిశీలించేందుకు, కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం గాంధీ హాస్పిటల్‌ను సందర్శించారు.

మధ్యాహ్నం గాంధీ హాస్పిటల్‌కు చేరుకున్న కేసీఆర్.. గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న ఐసీయూ, ఎమర్జెన్సీ, ఔట్‌ పేషెంట్ వార్డులతో పాటు అనేక జనరల్‌ వార్డుల్లో తిరుగుతూ, వారికి అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు.

బెడ్ల దగ్గరకు వెళ్లి పేషెంట్లతో మాట్లాడి, వారికి దైర్యం చెప్పారు. చికిత్స సరిగ్గా అందుతోందా, భోజనం బాగుంటోందా అని ప్రశ్నించారు. తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి వైద్యాధికారులకు ఆదేశాలిచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటళ్లలో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... గాంధీలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను కేసీఆర్ పరిశీలించారు.]

నిమిషానికి రెండు వేల లీటర్ల ఆక్సిజన్‌ను తయారు చేసే ఈ ఆక్సిజన్ ప్లాంట్‌ను ఇటీవలే గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు ఈ ప్లాంటు పనిచేసే విధానం, ఆక్సిజన్ స్వచ్ఛత గురించి కేసీఆర్‌కు వివరించారు.

అనంతరం, గాంధీలో వైద్య సేవలందిస్తున్న కాంట్రాక్టు నర్సులు, జూనియర్ డాక్టర్లతో మాట్లాడారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారని వారిని అభినందించారు. వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం యువ డాక్టర్లుగా వారి మీద ఉందని సీఎం అన్నారు.

మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీతో పాటు పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ సీఎం వెంట ఉన్నారు.

అరేబియా సముద్రం నుంచి 22 మృతదేహాలను తీరానికి చేర్చిన ఐఎన్ఎస్ కోచీ

ముంబయి తీరంలో మునిగిపోయిన పీ305 బార్జ్‌కి సంబంధించిన సిబ్బందిలో 22 మంది మృతదేహాలను తీరానికి తీసుకొచ్చారు.

ఇప్పటివరకు 186 మందిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఐఎన్ఎస్ కోచి, ఐఎన్ఎస్ కోల్‌కతా, ఐఎన్ఎస్ తేజ్, ఐఎన్ఎస్ బెత్వా, ఐఎన్ఎప్ బియాస్ నౌకలు, పీ9ఐ హెలికాప్టర్ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

పీ305 బార్జ్ మీద పనిచేస్తున్న 186 మందిని ఐఎన్ఎస్ కోచి బుధవారం ఉదయం ముంబయి తీరానికి చేర్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా పీ305లో 261 మంది ఉన్నారని, అందరినీ సురక్షితంగా తీరానికి చేరుస్తామని అన్నారు.

ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడ్డాయని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఐఎన్ఎస్ కోచి కమాండర్

కెప్టెన్ సచిన్ సకీరా ఏఎన్ఐతో చెప్పారు.

గుజరాత్, కేంద్రపాలిత ప్రాంతం దమణ్‌లలోని కొన్ని ప్రాంతాలు తుపాను ధాటికి తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం పర్యటించనున్నారు.

ఊనా, దీవ్, జాఫరాబాద్, మహువా ప్రాంతాల్లో మోదీ ఏరియల్ సర్వే చేపడతారని అధికారులు తెలిపారు.

విద్యుత్ లేకపోవడంతో తరుణ్ తేజ్‌పాల్‌ కేసులో తీర్పు వాయిదా

తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌పై లైంగిక వేధింపుల కేసులో తీర్పు మే 21కి వాయిదా పడింది.

గత రెండు, మూడు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో కేసుపై పనిచేయడానికి మరికొంత సమయం అవసరం అవుతుందని గోవాలోని మపుసా అదనపు సెషన్సు కోర్టు న్యాయమూర్తి బుధవారం తెలిపారు. మే 21న తుది తీర్పు వెల్లడిస్తానని వివరించారు.

2013లో గోవాలో తెహల్కా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తరుణ్ తనను వేధించారని ఆయనతో కలిసి పనిచేసిన మహిళా జర్నలిస్టు ఆరోపణలు చేశారు. అయితే వీటితో తనకు ఎలాంటి సంబంధమూలేదని ఆయన చెబుతూ వచ్చారు.

2012లో దిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం అనంతరం లైంగిక నేరాలపై పెద్ద చర్చలు నడుస్తున్న సమయంలో ఈ కేసు వెలుగులో కివచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)