బిగ్‌బాస్-4: గంగవ్వ, దేవి, లాస్య, కరాటే కల్యాణి, హారిక సహా 16 మంది కంటెస్టెంట్లు - BBC Newsreel

గంగవ్వ, మోనాల్, లాస్య

ఫొటో సోర్స్, Twitter/starmaa

ఫొటో క్యాప్షన్, గంగవ్వ, మోనాల్, లాస్య
ప్రచురణ

బిగ్ బాస్ సీజన్ 4 మొదలైంది. ఈ రియాలిటీ షోకు వరుసగా రెండోసారి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

మాస్క్ ముఖానికి అవసరం, ఎంటర్‌టైన్‌మెంట్‌కు కాదు అనే ట్యాగ్ లైన్‌తో ఈ షోను ప్రారంభించారు.

ప్రారంభ కార్యక్రమంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ నాగార్జున బిగ్ బాస్ వ్యాఖ్యాతగానూ, ఆయన తండ్రిగా మరో పాత్రలోనూ కనిపించారు.

స్టార్ మా ఛానల్లో సోమవారం నుంచీ శుక్రవారం వరకూ రాత్రి 9.30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. శని, ఆదివారాల్లో వ్యాఖ్యాతగా నాగార్జున తెరపై కనిపిస్తారు.

బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంటున్నది వీరే..

యూట్యూబ్ స్టార్ గంగవ్వ, అఖిల్ సార్థక్, దివి, నోయల్ సీన్, కరాటే కల్యాణి, అమ్మ రాజశేఖర్, అరియానా గ్లోరీ, సయ్యద్ సొహేల్, హారిక, దేవి నాగవల్లి, మెహబూబ్ దిల్సే, సుజాత, అభిజిత్, లాస్య, సూర్య కిరణ్, మోనల్ గజ్జర్.

పోలీసుల కార్డన్ సెర్చ్

ఫొటో సోర్స్, @SHAUNINBRUM

ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఆదివారం చాలామంది కత్తిపోట్లకు గురయ్యారు. పోలీసులు దీన్ని తీవ్రమైన ఘటనగా ప్రకటించారు.

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 12.30 సమయం నుంచి వరుస కత్తిపోట్ల ఘటనలు చోటుచేసుకున్నట్లు వెస్ట్ మిడ్‌లాండ్ పోలీసులు తెలిపారు.

ఇప్పటివరకు అనేక మంది కత్తిపోట్లకు గురయ్యారని.. అయితే, వారిలో ఎంతమందికి తీవ్ర గాయాలయ్యాయో ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

కత్తిపోట్లకు గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు చెబుతున్నారు.

రెండు గ్రూపుల మధ్య ఘర్షణలో భాగంగా జరిగి ఉండొచ్చని.. కారణం ఏదైనా స్థానికుల్లో దీనివల్ల ఆందోళన మొదలైందని బీబీసీకి చెందిన నిక్ క్లిథరో చెప్పారు.

కాల్పులు వంటివేమీ జరగలేదని వెస్ట్ మిడ్‌లాండ్స్ మేయర్ ఆండీ స్ట్రీట్ చెప్పారు.

రియా చక్రవర్తి

ఫొటో సోర్స్, facebook/RheaChakrabortyOfficial

రియా అరెస్టుకు రంగం సిద్ధం

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ మృతి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌.సి.బి) విచారణకు హాజరయ్యేందుకు రియా చక్రవర్తి ముంబయిలోని ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. సుశాంత్‌కు డ్రగ్స్‌ ఇచ్చారని ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు తన క్లయింట్‌ రియా చక్రవర్తిని వేధించాలనుకుంటే అరెస్టుకు కూడా ఆమె సిద్దమేనని ఆమె తరఫు న్యాయవాది సతీశ్‌ మాన్‌షిండే అన్నారు.

ఒక వ్యక్తిని ప్రేమించడమే ఆమె తప్పయిందని, దానికి పరిణామాలు ఎదుర్కోవడానికి ఆమె సిద్ధంగా ఉన్నారని మాన్‌షిండే వ్యాఖ్యానించారు.

తాను నిర్దోషినని నమ్మడం వల్లే రియా చక్రవర్తి బిహార్‌ పోలీసులు, సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీ కేసులలో ఏ ఒక్కదానికి కూడా ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోలేదని, ఇదే ఆమె నిజాయితీకి నిదర్శనం అని మాన్‌షిండే అన్నారు.

వైరస్‌వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో మెల్‌బోర్న్ నగరంలో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని నిర్ణయించారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వైరస్‌వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో మెల్‌బోర్న్ నగరంలో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని నిర్ణయించారు

మెల్‌బోర్న్‌ నగరంలో లాక్‌డౌన్‌ మరో రెండు వారాలు పొడిగింపు

కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగించారు. సెప్టెంబర్‌ 13 నుంచి 28 వరకు ఈ కఠిన లాక్‌డౌన్‌ అమలవుతుందని, అక్టోబర్‌ మొదటివారం నుంచి నిబంధనలు సడలిస్తామని విక్టోరియా స్టేట్ ప్రీమియర్‌ డేనియల్ ఆండ్రూస్‌ ప్రకటించారు.

ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 26,000 కేసులు నమోదుకాగా, రెండోదశ వైరస్‌ వ్యాప్తికి మెల్‌బోర్న్‌ నగరం కేంద్రంగా మారింది. దీంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ కొనసాగింపుకు నిర్ణయం తీసుకుంది. 753 మరణాలతో మెల్‌బోర్న్‌ నగరం దేశంలోనే 90% మరణాలు నమోదైన రాష్ట్రంగా రికార్డులకెక్కింది.

ఒకవైపు వైరస్‌ ప్రభావం పెరుగుతుండగా, లాక్‌డౌన్‌ నిబంధనలను ఎత్తివేయాలంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారంనాడు 300మంది నిరసనకారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ వీధుల్లోకి వచ్చారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)