కరోనావైరస్ - కర్నూలు: ఐసోలేషన్‌లో వరుడు, క్వారంటైన్‌లో వధువు‌, కంటైన్‌మెంట్‌ జోన్‌గా గ్రామం - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో నవ దంపతులు పెళ్లయిన రెండో రోజే ఒకరు క్వారంటైన్‌కు, మరొకరు ఐసోలేషన్‌కు వెళ్లాల్సి వచ్చిందని 'ఈనాడు' ఒక కథనాన్ని ఇచ్చింది.

ఆ కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా మర్రిమాను తండాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. పెళ్లికి ముందే కరోనా టెస్టుకు శాంపిల్స్‌ ఇచ్చిన ఆయన ఫలితాలు రాక ముందే వివాహం సిద్దపడ్డారు.

అయితే పెళ్లి రోజు రాత్రి జరిగిన రిసెప్షన్‌ సందర్బంగా ఆ యువకుడు అస్వస్థతకు గురయ్యారు. అదే సమయంలో అతనికి కోవిడ్‌-19 టెస్టు ఫలితాలు పాజిటివ్‌గా వచ్చినట్లు తేలింది.

అప్పటికే వధూవరులిద్దరు పత్తికొండకు కలిసి ప్రయాణం చేయడం, బంధువులతో కలిసి విందులో పాల్గొన్నట్లు తేలడంతో అధికారులు ఆ గ్రామం మొత్తాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు.

వరుడిని ఐసోలేషన్‌కు, వధువును క్వారంటైన్‌కు తరలించారు. పెళ్లి వేడుకలో పాల్గొన్నవారికి టెస్టులు సిఫారసు చేశారు.

మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వరా: సుమోటో కేసులో సుప్రీం కోర్టు సీరియస్‌

కోవిడ్‌-19 రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, ముఖ్యంగా దిల్లీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యనించిన విషయాన్ని 'ఆంధ్రజ్యోతి' ప్రముఖంగా ప్రచురించింది.

ఈ కథనం ప్రకారం, ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా రోగులకు చికిత్స, మృతదేహాల నిర్వహణ తీరుపై కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, అశ్వినీకుమార్‌ లేఖ, మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు, ఈ మేరకు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దిల్లీలో కరోనా చికిత్స వ్యవహారం దారుణంగా ఉందని, రోగుల బెడ్ల పక్కనే శవాలను ఉంచుతున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కోవిడ్‌ రోగులను పశువులకన్నా హీనంగా చూస్తున్నారని, ఒక మృతదేహం ఆసుపత్రి చెత్తకుప్పలో కనిపించడం దారుణమని సుప్రీం కోర్టు అన్నది. శవాలకు కనీస గౌరవంతో అంతిమ సంస్కారాలు జరగాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. దిల్లీతోపాటు కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

నిండు గర్భిణి - 10 కి.మీ. నడక

వైద్య సదుపాయం అందుబాటులో లేక ఓ నిండు గర్భిణి 10 కి.మీ.లు నడవాల్సి వచ్చిందని 'వెలుగు' పత్రిక రాసింది.

ఆ కథనం ప్రకారం.. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా రోళ్లగడ్డ గ్రామానికి చెందిన ఓ యువతికి పురిటి నొప్పులు రావడంతో బంధవులు 108 అంబులెన్స్‌ సర్వీసును సంప్రదించారు. అయితే మధ్యలో మల్లన్నవాగు ప్రవహిస్తుండటంతో 108 వాహనం రాలేదు. దీంతో ఆ యువతి నడుచుకుంటూ ఆ వాహనాన్ని చేరుకోవాల్సి వచ్చింది. రోళ్లగడ్డ గ్రామం నుంచి దాదాపు 10కి.మీ.లు నడుచుకుంటూ, మధ్యలో వాగును దాటి ఆమె అంబులెన్స్‌ను చేరుకుంది. ఖమ్మం ఆసుపత్రిలో ఆమె మగబిడ్డను ప్రసవించింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)