వైఎస్ జగన్: కరోనా రానివాళ్లు ఎవ్వరూ ఉండరేమో.. ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభం - ప్రెస్‌ రివ్యూ

ప్రచురణ

భ‌విష్య‌త్‌లో కరోనా సోక‌నివారు ఎవరూ ఉండరేమోనని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించిన‌ట్లు ఈనాడు ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫెరెన్స్‌లో జ‌గ‌న్ మాట్లాడారు. కరోనావైరస్‌తో కలసి జీవించాలని ఆయన పునరుద్ఘాటించారు.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వైరస్‌ సోకగానే ఆసుపత్రికి వస్తే మరణాలు లేకుండా చూడగలమని, కానీ వారు భయంతో బయటకు చెప్పుకోలేక, చివరిదశలో ఆసుపత్రికి వస్తున్నారని. అలాంటి పరిస్థితుల్లో వారిని కాపాడటం కష్టమవుతోందని జగన్ చెప్పారు.

ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకునేలా, వారి ఆరోగ్యం గురించి వారే చెప్పేలా ప్రోత్సహించాలని, రోగ నిర్ధారణ పరీక్షలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని. దీని కోసం ఎవర్ని సంప్రదించాలి? పరీక్షలు ఎలా చేయించుకోవాలనే అంశంపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఆగస్టు 3వ తేదీ నుంచి పాఠశాలల్ని తిరిగి ప్రారంభిస్తామని జగన్ చెప్పారు.మ‌రోవైపు తెలంగాణలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జూన్ 8 నుంచి నిర్వ‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది.

ఒక్క రోజులోనే ల‌క్షకుపైగా క‌రోనావైర‌స్‌ ప‌రీక్ష‌లు

భార‌త్‌లో భారీగా క‌రోనావైర‌స్‌ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించిన‌ట్లు న‌మస్తే తెలంగాణ ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

సోమ‌వారం ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ల‌క్షా 8 వేల 233 శాంపిల్స్ టెస్ట్ చేసిన‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో మొత్తం క‌రోనా టెస్టుల సంఖ్య 24,25,742కు చేరింది.

ప్ర‌స్తుతం క‌రోనా పేషెంట్ల రివ‌క‌రీ రేటు 38.73గా ఉంద‌ని, ఇది రోజు రోజుకూ మెరుగుప‌డుతోంద‌ని చెప్పింది.

భార‌త్‌లో ల‌క్ష మంది జ‌నాభాకు 0.2 మ‌ర‌ణాలు సంభ‌విస్తుండ‌గా.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సంఖ్య 4.1గా ఉంది. బెల్జియంలో ల‌క్ష మంది జ‌నాభాకు 79.3 మ‌ర‌ణాలు సంభ‌వించ‌గా.. స్పెయిన్ లో 59.2, ఇట‌లీలో 52.8, యూకేలో 52.1, ఫ్రాన్స్ లో 41.9, స్వీడ‌న్ లో 36.1 నెథ‌ర్లాండ్స్ లో 33, అమెరికాలో 26.6 చొప్పున మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.

విజ‌య‌వాడ‌లో తల్లీ కొడుకుల ప్రాణం తీసిన టిక్‌టాక్‌

టిక్‌టాక్ చేయొద్ద‌ని భ‌ర్త‌ మంద‌లించ‌డంతో భార్య ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న విజయవాడలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో జ‌రిగిన‌ట్లు సాక్షి ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

తల్లి మృతిని జీర్ణించుకోలేకపోయిన కుమారుడు కూడా కొన్ని గంట‌ల్లోనే సైనెడ్ తాగి తనువుచాలించాడు.

ఇదివ‌ర‌కు కూడా త‌ర‌చూ టిక్‌టాక్ చేయ‌డంతో ఆమెను భ‌ర్త ప‌లుమార్లు మంద‌లించాడు. ఈ విష‌యంపై వారి కుటుంబంలో గొడ‌వ‌లు జ‌రిగాయి.

లాక్‌డౌక్‌ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో చాలామంది టిక్‌టాక్‌తో కాలక్షేపం చేస్తున్నారు.

క‌రోనా మాస్క్‌ల పేరుతో హైద‌రాబాద్‌లో రూ.50 వేలు టోక‌రా

మాస్కుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు.. హైద‌రాబాద్‌లోని ఓ వ్యాపారికి రూ.50వేలు టోకరా వేశారని వెలుగు దిన‌ప‌త్రిక ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

వివరాల్లోకి వెళితే.. డీడీ కాలనీకి చెందిన ఓ వ్యాపారి ఆన్‌లైన్‌లో ఎన్‌-95 మాస్కుల విక్రయ ప్రకటన చూసి.. అందులోని నంబర్‌కు ఫోన్‌ చేశారు.

తాము పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి ప్రాంతానికి చెందిన లోక్‌నాథ్‌ ఫ్యాషన్‌ అనే సంస్థకు చెందిన వారమని, రూ.200కు ఒక మాస్కు చొప్పున 500 మాస్కులు పంపించేందుకు సిద్ధమంటూ అవ‌త‌లివారు చెప్ప‌డంతో ఒప్పందం చేసుకున్నారు.

అడ్వాన్స్‌గా రూ.50వేలు వసూలు చేశారు. తరువాత మరో రూ. 30 వేలు కావాలంటూ డిమాండ్‌ చేశారు. అనంత‌రం వారు ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేశారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)