హైదరాబాద్‌ శివార్లలో చిరుత... గోల్కొండ సమీపంలో మాను పిల్లి కలకలం

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

లాక్ డౌన్ తర్వాత రోడ్లపై జన సంచారం తగ్గడంతో ఇటీవల కాలంలో నగర శివార్లలోని అడవుల్లో ఉన్న జంతువులు యథేచ్ఛగా రోడ్లపైకి రావడం మనం చూస్తూనే ఉన్నాం.

అయితే ఈసారి ఏకంగా జనావాసాలకు సమీపంలోకే వచ్చేసింది ఓ చిరుత. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌ పల్లి సమీపంలోని కాటేదాన్‌ అండర్ బ్రిడ్జిపై ఈ ఉదయం చిరుత కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

అయితే, అది కాలికి గాయమై కదల్లేని స్థితిలో కూర్చొని ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అటవీశాఖ అధికారులకు చెప్పడంతో కాసేపట్లో పోలీసులు, అటవీశాఖాధికారులు అక్కడకు చేరుకున్నారు.

చిరుత గాయపడినప్పటికీ దాడి చేసే అవకాశం ఉండటంతో పోలీసులు ముందు జాగ్రత్తగా రహదారిపై రాకపోకల్ని నియంత్రించారు. అటవీశాఖ, జూపార్క్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చిరుతను బంధించేందుకు ప్రయత్నించగా అది తప్పించుకొని దగ్గర్లో ఉన్న ఫంక్షన్ హాల్లోకి వెళ్లింది.

లారీ డ్రైవర్‌పై దాడి

ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ లారీ డ్రైవర్‌ను గాయపరచింది. బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ తరువాత చిరుత అక్కడ నుంచి పక్కనే ఉన్న బొప్పాయి తోటలోకి వెళ్లింది. డ్రోన్ కెమెరా సాయంతో అటవీశాఖాధికారులు అది ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు.

మత్తు మందు ఇచ్చి చిరుతను బంధిస్తామని ఆ తర్వాత జూపార్క్‌కు తరలించి కోలుకున్న తర్వాత అటవీ ప్రాంతంలో విడిచి పెడతామని అధికారులు చెప్పారు.

గోల్కొండ సమీపంలో మాను పిల్లి

మరోవైపు, గోల్కొండ సమీపంలో ఓ మాను పిల్లి స్థానికుల్ని భయాందోళనలకు గురి చేసింది. దానిని నల్ల చిరుత అనుకొని జనం కంగారు పడిపోయారు. వెంటనే సమీపంలోని అటవీశాఖకు సమాచారం ఇచ్చారు.

అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని అది నల్ల చిరుత కాదని, మాను పిల్లి (సివిట్ క్యాట్) అని తేల్చి, దానిని బంధించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

జూపార్క్‌‌కు తీసుకెళ్లి దాని ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాత ఏం చెయ్యాలన్నది నిర్ణయిస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) ఆర్.శోభ తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)