You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్, బూడిద భిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్లో చేరిక
కేటీఆర్ సమక్షంలో మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమ నాయకులు మళ్లీ సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు.
లైవ్ కవరేజీ
బ్రిటన్ ప్రధాని రేసులో పెన్నీ మార్డంట్.. బెన్ వాలెస్ పోటీ చేయట్లేదు
బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలెస్ ప్రధానమంత్రి రేసులో చేరేందుకు నిరాకరించారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎన్నికల బరిలోకి దిగితే ఆయనకు మద్దతిస్తానని చెప్పారు.
"డిఫెన్స్ సెక్రటరీగా ప్రజల భద్రత నా బాధ్యత. ఈ పదవిలో ఉంటూ నేను ప్రజలకు ఎక్కువ సేవలు అందించగలనని భావిస్తున్నాను. ఇందులోనే కొనసాగాలనుకంటున్నాను. కాబట్టి ప్రధానమంత్రి పదవికి పోటే చేయట్లేదు" అని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించినట్లు రాయిటర్స్ తెలిపింది.
ఇదిలా ఉండగా, హౌస్ ఆఫ్ కామన్స్ లీడర్ పెన్నీ మార్డంట్ కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
"నా సహోద్యోగుల సహకారం, ప్రోత్సాహంతో నేను కన్జర్వేటివ్ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీచేస్తున్నాను. దేశాన్ని ఏకం చేయడానికి, ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి, జాతీయ ప్రయోజనాల కోసం నేను ఈ పోటీలోకి దిగుతున్నాను" అని పెన్నీ మార్డంట్ అన్నారు.
బ్రిటన్: లిజ్ ట్రస్ స్థానంలో ప్రధాని రేసులో ఎవరెవరున్నారు?
ఇండోనేషియా: దగ్గు మందు, సిరప్ల వల్ల పిల్లల్లో తీవ్ర కిడ్నీ గాయాలు.. మరణిస్తున్న పిల్లల సంఖ్య 133కు చేరింది
ఇండోనేషియాలో తీవ్రమైన కిడ్నీ గాయాల (అక్యూట్ కిడ్నీ ఇంజురీస్) కారణంగా మరణించిన పిల్లల సంఖ్య 133కి పెరిగిందని అక్కడి ప్రభుత్వం తెలిపింది.
ఇండోనేషియాలో లభిస్తున్న దగ్గు మందులు, ఇతర సిరప్లలో తీవ్రమైన కిడ్నీ గాయాలకు కారణమయ్యే కలుషిత పదార్థాలు ఉన్నాయని తెలుపుతూ, బుధవారం ఆ దేశ ప్రభుత్వం అన్ని రకాల ద్రవ మందులు, సిరప్ల అమ్మకాలపై తాత్కాలిక నిషేధం విధించింది.
అయితే, ఆ మందులు దిగుమతి చేసుకున్నవా లేక స్థానికంగా తయారయినవా అనేది ఇంకా స్పష్టంగా తెలీదు. వీటి ప్రభావం అయిదేళ్లలోపు పిల్లలపై తీవ్రంగా ఉందని వెల్లడించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), స్థానిక ఆరోగ్య అధికారులు ఈ కేసులను పరిశీలిస్తున్నారు .
కొన్ని రోజుల క్రితం గాంబియాలో దాదాపు 70 మంది పిల్లల మరణాలకు భారతదేశంలో తయారైన దగ్గు మందు (కాఫ్ సిరప్) కారణమనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
సెక్స్ లేని వైవాహిక జీవితాలతో ఈ తరం సతమతం... ఎందుకిలా?
రాజ్మోహన్ గాంధీ: ‘ప్రధాని నరేంద్ర మోదీని కలిస్తే నేను చెప్పేది ఒకటే...'
అగ్ని ప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతం
అగ్ని సిరీస్లో భాగంగా కొత్తగా తయారు చేసిన అగ్ని ప్రైమ్ (అగ్ని-పి) క్షిపణిని భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది.
ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీప తీరం నుంచి ఉదయం 10:45 గంటలకు ఈ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ శాఖ అధికారులు చెప్పారు.
పరీక్ష సమయంలో ఈ క్షిపణి దానికి నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా సాధించిందని తెలిపారు.
అగ్ని ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం ఇది మూడో సారి. ఈ పరీక్ష ద్వారా క్షిపణి విశ్వసనీయత, కచ్చితత్వం రుజువైందని రక్షణ శాఖ అధికారులు అన్నారు.
అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రత్యేకతలు
డీఆర్డీవో ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది. ఇందులో రెండు ఇంజిన్లు ఉంటాయి. బరువు 11,000 కిలోలు. ఇది 1.5 నుంచి 3 టన్నుల వార్హెడ్ను మోసుకుపోగలదు. 1000 నుంచి 2000 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
ఈ క్షిపణిని రోడ్డు మార్గాన ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించవచ్చు. ఇందులో ఘన ఇంధనాన్ని వాడతారు.
టి20 ప్రపంచకప్: ఐర్లాండ్ అద్భుతం, టోర్నీ నుంచి మాజీ చాంపియన్ వెస్టిండీస్ అవుట్
టి20 ప్రపంచకప్ సూపర్-12 క్వాలిఫయింగ్ మ్యాచ్లో ఐర్లాండ్ జట్టు అద్భుతం చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ను ఓడించింది.
ఈ ఓటమితో వెస్టిండీస్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. రెండుసార్లు టి20 వరల్డ్ కప్ విజేత అయిన విండీస్ ఈసారి క్వాలిఫయింగ్ రౌండ్లోనే వెనుదిరిగింది.
మరోవైపు వెస్టిండీస్పై 9 వికెట్లతో ఘనవిజయం సాధించిన ఐర్లాండ్ ‘బి’ గ్రూపు నుంచి సూపర్-12 కు అర్హత సాధించింది.
మొదట వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ (48 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. గ్యారెత్ డెలానీ 3 వికెట్లు తీశారు.
అనంతరం ఐర్లాండ్ జట్టు 17.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 150 పరుగులు చేసి గెలిచింది.
పాల్ స్టిర్లింగ్ (48 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.
వికెట్ కీపర్ లార్సెన్ టకర్ (45 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ ఆండీ బల్బిర్నీ (37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు.
‘బీజేపీ’కి దాసోజు శ్రవణ్ రాజీనామా
మునుగోడు ఉప ఎన్నిక ముందు దాసోజు శ్రవణ్, బీజేపీ నుంచి తప్పుకున్నారు.
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి ఆయన లేఖ పంపించారు.
మునుగోడులో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందని లేఖలో పేర్కొన్నారు.
అనేక అశయాలతో బీజేపీలో చేరిన తనకు తక్కువ కాలంలోనే బీజేపీలోని దశాదిశ లేని నాయకత్వ ధోరణుల గురించి తెలిసిపోయిందని లేఖలో ప్రస్తావించారు.
పార్టీ తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది ఆగస్టులో శ్రవణ్, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. తాజాగా బీజేపీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు.
మురిగిపోయిన కరోనా వ్యాక్సీన్లు.. 10 కోట్ల డోసుల టీకాలను పారేసిన సీరమ్ సంస్థ
మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలేంటి? వీటితో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడం ఎలా?
మాగ్నస్ కార్ల్సన్పై టీనేజ్ ప్లేయర్ హాన్స్ నీమాన్ రూ. 828 కోట్ల పరువు నష్టం దావా, ఎల్సా మైష్మాన్, బీబీసీ న్యూస్
చెస్ ప్రపంచ చాంపియన్, నార్వే దిగ్గజ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్పై అమెరికా టీనేజ్ గ్రాండ్మాస్టర్ హాన్స్ నీమాన్ చట్టపర చర్యలకు పూనుకున్నారు.
తనపై చీటింగ్ ఆరోపణలు చేసినందుకు కార్ల్సన్తో పాటు చెస్. కామ్ వెబ్సైట్పై కనీసం రూ. 828 కోట్లు (100 మిలియన్ డాలర్లు) 19 ఏళ్ల నీమాన్ పరువునష్టం దావా వేశారు.
హాన్స్ నీమాన్ చీటింగ్ చేస్తూ చెస్ ఆడుతున్నాడంటూ కార్ల్సన్ చేసిన ఆరోపణలు చెస్ ప్రపంచాన్ని కుదిపేశాయి.
100కు పైగా ఆన్లైన్ గేమ్స్లో నీమాన్ చీటింగ్ చేసి ఉండొచ్చని చెస్. కామ్ వెబ్సైట్ నివేదిక ప్రచురించడంతో దానిపై కూడా నీమాన్ చర్యలకు దిగారు.
తన ప్రతిష్టను, జీవనోపాధిని నాశనం చేసేందుకు నిందితులు కుమ్మక్కయ్యారని నీమాన్ దావాలో పేర్కొన్నారు.
చెస్.కామ్తో కలిసి కార్ల్సన్ ఆన్లైన్ చెస్ కంపెనీ ‘ప్లే మాగ్నస్’... తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోందని నీమాన్ తన ఫైలింగ్లో ఆరోపించారు.
వారు చేసిన చీటింగ్ ఆరోపణలతో తన కెరీర్, పరువుతో పాటు తన ప్రొఫెషన్కు తీవ్ర నష్టం కలిగిందని పేర్కొంటూ పరిహారాన్ని డిమాండ్ చేశారు.
నీమాన్ ఆరోపణల్లో నిజం లేదని చెస్.కామ్ తరఫు లాయర్లు అన్నారు. ఆయన ఆరోపణలను కొట్టిపారేశారు.
దీనిపై స్పందించాల్సిందిగా కార్ల్సన్ను కోరగా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
లంపీ స్కిన్ వైరస్: ఈ పశువుల వ్యాధిపై ప్రచారం అవుతున్న వదంతులు ఏంటి? వాస్తవాలు ఏంటి?
హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ వస్త్రాల్లో కేదార్నాథ్లో మోదీ పూజలు
భారత ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్కు చేరుకొని అక్కడి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ దుస్తులను మోదీ ధరించారు. చంబాకు చెందిన ఒక మహిళ ప్రధాని కోసం ఈ దుస్తులను తయారు చేశారు. అక్కడ వీటిని ‘చోళా డోరా’ అని పిలుస్తారు.
నరేంద్ర మోదీ రెండు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్నారు. అక్కడ కొన్ని కొత్త ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. పలు ప్రాజెక్టులను పరిశీలించనున్నారు.
ప్రధాని పర్యటన నిమిత్తం కేదార్నాథ్, బద్రీనాథ్ దేవాలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గురు శంకరాచార్య సమాధిని కూడా ఆయన సందర్శిస్తారు.
దొంగగా పేరుమోసిన భర్తను మార్చి కుటుంబమంతా గౌరవంగా బతికేలా చేసిన మహిళా రైతు కథ..
పోలీస్ అమరవీరులకు సీఎం వైఎస్ జగన్ నివాళులు, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు.
విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో పాటుగా హోం శాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సహా పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా "అమరులు వారు" అనే పుస్తకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. రాష్ట్రానికిచెందిన అమరులైన 11 మంది పోలీసుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. పోలీస్ శాఖలో 6,511 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు.
1959 అక్టోబర్ 21న డీఎస్పీ కరమ్సింగ్ నేతృత్వంలో 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. అప్పటి నుంచి ఏటా అక్టోబర్ 21ని పోలీసు అమరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు.
జిరాఫీ తొక్కడంతో 16 నెలల పాప మృతి, పుంజా పిహ్లాని, బీబీసీ న్యూస్, జోహాన్నెస్బర్గ్
జిరాఫీ తొక్కడంతో ఒక పసిపాప మృత్యువాత పడింది. దక్షిణాఫ్రికాలోని ఒక కన్జర్వెన్సీలో బుధవారం ఈ ఘటన సంభవించింది.
ఆమె తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
క్వాజులు నటల్ ప్రావిన్సులోని విలాసవంతమైన కులేనీ గేమ్ పార్క్లో 16నెలల పాపతో ఆ మహిళ నివసిస్తున్నారు.
ఘటన వివరాలు పూర్తిగా తెలియరాలేదని, ఏం జరిగిందో తెలుసుకోవడానికి విచారణను మొదలుపెట్టినట్లు పోలీసులు, బీబీసీకి చెప్పారు.
‘‘పాపను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఆమె చనిపోయారు’’ అని పోలీస్ లెఫ్టినెంట్ నోబిల్ మడ్లాలా తెలిపారు.
జిరాఫీలు, మనుషులపై దాడి చేయడం అసాధారణం. దక్షిణాఫ్రికాలోని గేమ్ లాడ్జ్లలో జిరాఫీలు తిరుగుతుండటం సాధారణ విషయం.
సున్నితమైన విషయం కావడంతో దీనిపై మాట్లాడేందుకు ఆ సముదాయం మేనేజర్ ఒకరు ఇష్టపడలేదు.
అయితే, పర్యాటకులు నడిచేటప్పుడు, సైక్లింగ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న జంతువులతో స్నేహంగా ఉంటూ ఆనందించవచ్చని ఆ సముదాయం వెబ్సైట్లో పేర్కొన్నారు.
ఆసియా కప్ కోసం భారత్, పాక్కు వెళ్లడం గురించి రోజర్ బిన్నీ ఏమన్నారంటే...
వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ కోసం పాకిస్తాన్కు భారత జట్టు వెళ్తుందా? లేదా అనే విషయాన్ని భారత ప్రభుత్వం నిర్ణయిస్తుందని బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ చెప్పారు.
కర్ణాటక క్రికెట్ సంఘం ఆధ్యర్వంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బిన్నీ... వచ్చే ఏడాది భారత జట్టును పాక్కు పంపే అంశంపై బీసీసీఐ ఇంకా భారత ప్రభుత్వంతో చర్చించలేదని అన్నారు. అయితే, దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
‘‘ఇది బీసీసీఐ తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. దేశం నుంచి బయటకు వెళ్లి ఆడటానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మనం విదేశాలకు వెళ్లడమే కాదు, విదేశీ జట్లు భారత్లో పర్యటించాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే’’ అని రోజర్ బిన్నీ చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
‘‘మాకు ఆమోదం లభించగానే, ముందుకు సాగుతాం. పాక్ పర్యటన గురించి సొంతంగా నిర్ణయం తీసుకోలేం. దీనిపై ప్రభుత్వంపై ఆధారపడాల్సిందే. కానీ, ఇంకా దీని గురించి ప్రభుత్వంతో మాట్లాడలేదు’’ అని ఆయన అన్నారు.
వచ్చే ఏడాది సెప్టెంబర్లో జరుగనున్న ఆసియా కప్ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది.
బీబీసీ తెలుగు న్యూస్ లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అప్డేట్ల కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.