ఇండోనేసియా: అగ్నిపర్వతం నుంచి భారీ బూడిద మేఘం ఎగజిమ్మడంతో పరుగులు తీసిన ప్రజలు, ఒకరు మృతి, 41 మందికి గాయాలు

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

ఇండోనేసియాలోని జావా ద్వీపంలో అగ్నిపర్వతం బద్దలవడంతో ఒకరు మృతిచెందగా 41 మందికి కాలిన గాయాలయ్యాయి.

సెమేరు అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద భారీ మేఘంలా కమ్ముకొస్తుండగా ప్రజలు పరుగులు తీయడం ఆన్‌లైన్‌లో షేర్ అయిన వీడియోలలో కనిపించింది.

అగ్నిపర్వత ధూళి చుట్టుపక్కల గ్రామాలను కమ్మేసిందని.. దట్టమైన పొగ కారణంగా సూర్యరశ్మి కూడా లేక అంధకారం అలముకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

సుమారు 50 వేల అడుగులు(15 వేల మీటర్ల) ఎత్తు వరకు బూడిద మేఘం ఆవరిస్తుందని విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు.

స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట) అగ్నిపర్వతం బద్దలైందని అధికారులు వెల్లడించారు.

సెమేరు చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు.

ఈ ప్రాంతం నుంచి సమీప నగరం మలాంగ్‌ వెళ్లే దారిలోని వంతెన, రోడ్డు ధ్వంసమయ్యాయని స్థానిక అధికారి తారిక్ ఉల్ హక్ 'రాయిటర్స్' వార్తాసంస్థతో తెలిపారు.

అగ్నిపర్వతం నుంచి బూడిద దట్టమైన మబ్బులుగా ఎగసిపడి హిందూ మహాసముద్రం మీదుగా నైరుతి దిశగా కదులుతోందని ఆస్ట్రేలియాలోని డార్విన్‌లో ఉన్న 'వాల్కానిక్ యాష్ అడ్వైజరీ సెంటర్ (వీఏఏసీ)' తెలిపింది.

అగ్నిపర్వత బూడిద ఎక్కుడుంది... ఎటువైపు కదులుతోందనే సమాచారాన్ని వీఏఏసీ వైమానిక రంగానికి అందిస్తుంది.

15 మీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘం ఆవరిస్తే ఆ మార్గంలో వెళ్లాల్సిన విమానాలను దారి మళ్లించాల్సి ఉంటుందని.. చాలా విమానాలు 15 వేల మీటర్ల కంటే తక్కువ ఎత్తులో వెళ్తాయని వీఏఏసీకి చెందిన వాతావరణ నిపుణుడు క్యాంప్‌బెల్ 'బీబీసీ'తో చెప్పారు.

బూడిద మేఘంలోంచి కనుక విమానాలు ప్రయాణిస్తే వాటి ఇంజిన్‌లోని చల్లని భాగాలపై ఆ బూడిద పేరుకుని గట్టి పడి గాలి ప్రవాహానికి ఆటంకం కలిగించి ఇంజిన్ పనిచేయకుండా చేస్తుందని.. అది ఇంజిన్ విఫలం కావడానికి కూడా దారి తీయొచ్చని క్యాంప్‌బెల్ అన్నారు.

పైలట్లకు ఆకాశ మార్గం సరిగా కనిపించకపోవచ్చని, క్యాబిన్‌లోని ఆక్సిజన్ నాణ్యత కూడా తగ్గి ఆక్సిజన్ మాస్కులు వాడాల్సిన అవసరం రావచ్చని ఆయన హెచ్చరించారు.

సెమేరు అగ్నిపర్వతం తరచూ బూడిద వెదజల్లుతుందని... సాధారణంగా 4,300 మీటర్ల ఎత్తు వరకు బూడిద వెళ్తుందని.. కానీ, శనివారం నాటి విస్ఫోటంతో తీవ్రత మరింత పెరిగిందని క్యాంప్ బెల్ అన్నారు.

సెమేరు అగ్నిపర్వతం సముద్ర మట్టానికి 3,676 మీటర్ల ఎత్తులో ఉంది. గత ఏడాది డిసెంబరులోనూ ఇది బద్దలైంది. దాంతో అప్పట్లో వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.

ఇండోనేసియాలో ఉన్న 130 యాక్టివ్ వాల్కనోలలో ఇది కూడా ఒకటి.

ఇండోనేసియా ఖండ ఫలకాలు కలిసే పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఉంది... అందువల్ల ఇక్కడ తరచూ భూకంపాలు రావడంతో పాటు అగ్నిపర్వతాలూ విస్ఫోటమవుతుంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)