You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కజకిస్తాన్లో విమాన ప్రమాదం, 15 మంది మృతి, 60 మందికి గాయాలు
98 మందితో ప్రయాణిస్తున్న ఓ విమానం కజకిస్తాన్లో కూలిపోయిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
అల్మాటీ ఎయిర్పోర్ట్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం టేక్ ఆఫ్ అయిన బెక్ ఎయిర్ క్రాఫ్ట్ కాసేపటికే కూలిపోయింది.
అత్యవసర సహాయ సిబ్బంది ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. 15 మంది మరణించినట్లు ధృవీకరించారు. గాయపడినవారిని, ఇతరులను శిథిలాల నుంచి రక్షిస్తున్నారని అధికారులు తెలిపారు.
మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
కనీసం 60 మంది గాయపడ్డారని, వీరిలో పిల్లలు కూడా ఉన్నారని, వారిని ఆస్పత్రికి తరలించారని చెప్పారు.
ఈ విమానం కజకిస్తాన్లోని అతి పెద్ద నగరం అల్మాటీ నుంచి దేశ రాజధాని నూర్-సుల్తాన్ నగరానికి వెళ్తోంది.
ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియనప్పటికీ, ప్రమాదం జరిగిన ప్రదేశంలో దట్టమైన మంచు ఉందని ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న రాయిటర్స్ ప్రతినిధి తెలిపారు.
ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 95 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారని అల్మాటీ ఎయిర్ పోర్ట్ తెలిపింది.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.22 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కిందికి దిగిపోయిన విమానం ఓ కాంక్రీట్ గోడను గుద్దుకుని, ఓ రెండస్థుల భవనాన్ని ఓ వైపు ఢీకొట్టింది. విమానం కూలిన తర్వాత మంటలు చెలరేగలేదు.
సహాయక సిబ్బంది గాయపడినవారిని రక్షిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. వాటిలో... ఆంబులెన్స్ కోసం అరుస్తున్న ఓ మహిళ, ఓ భవనంలోకి దూసుకెళ్లిన విమానం కాక్పిట్ కనిపిస్తున్నాయి.
ప్రమాదానికి కారణాలను నిర్థరించడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటైంది.
ప్రమాదంపై దేశ అధ్యక్షుడు ఖాసిమ్-జొమార్ట్ తొకయేవ్ విచారం వ్యక్తం చేశారు.
వీఐపీ విమాన ప్రయాణాలకోసం బెక్ ఎయిర్ 1999లో ప్రారంభమైందని కంపెనీ వెబ్సైట్ చెబుతోంది. ప్రస్తుతం కజకిస్తాన్లో తక్కువ ధరలకు విమానాయానాన్ని అందించే సంస్థ ఇదేనని కంపెనీ అంటోంది.
విమానం 1.21 (జీఎంటీ) గంటలకు బయలుదేరిందని సిగ్నల్ వచ్చిందని, కానీ మాకు అందిన చివరి సిగ్నల్ కూడా అదేనని ఫ్లైట్రాడార్24 వెబ్సైట్ వెల్లడించింది.
ఈ నగరంలో విమాన ప్రమాదాలు జరగడం ఇదే తొలిసారి కాదు.
2013 జనవరి 29న కాక్షెటౌ నగరం నుంచి వస్తున్న విమానం అల్మాటీ సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనలో 20 మంది మరణించారు.
దానికి ఓ నెల క్రితం, 2012 డిసెంబర్ 26న కజకిస్తాన్ భద్రతా విభాగానికి చెందిన ఉన్నతాధికారులతో ప్రయాణిస్తున్న విమానం కూలిన ఘటనలో 27 మంది మరణించారు.
ఇవి కూడా చదవండి.
- ఏపీ క్యాబినెట్ సమావేశానికి భారీ భద్రత; అమరావతి నుంచి తరలిపోయేది సచివాలయం ఒక్కటేగా.. అంటున్న మంత్రి బొత్స
- విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కు కార్యనిర్వాహక రాజధానిగా మారేందుకు సన్నద్ధంగా ఉందా
- ఏపీకి రాజధాని విశాఖపట్నమా, అమరావతా.. ఒకటికి మించి రాజధానులున్న రాష్ట్రాల్లో వ్యవస్థలు ఎలా ఉన్నాయి
- మరణ శిక్షల్లో భారతదేశ రికార్డు ఏమిటి? - రియాలిటీ చెక్
- భూత వైద్యం: వైద్యులకు దెయ్యాలపై చదువు చెప్పనున్న బనారస్ హిందూ యూనివర్శిటీ
- దేశవ్యాప్తంగా NRC అమలు చేసేందుకు NPR తొలి అడుగా? - FACT CHECK
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)