ప్రయాణిస్తుండగా ఊడిన తెలంగాణ ఆర్టీసీ బస్సు చక్రాలు, తప్పిన పెను ముప్పు: ప్రెస్ రివ్యూ

ఊడిన బస్సు చక్రాలు

ఫొటో సోర్స్, UGC

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

తెలంగాణలో ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తుండగా దాని వెనుక చక్రాలు ఊడిపోయాయని ఈనాడు వార్తా కథనం ప్రచురించింది.

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో బుధవారం రెండు వేర్వేరు సంఘటనల్లో ఓ ఆర్టీసీ బస్సు, మరో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురయ్యాయి.

ఓ బస్సుకు వెనక చక్రాలు ఊడిపోగా.. మరోటి అదుపు తప్పి బోల్తాపడింది. రెండు ప్రమాదాల్లోనూ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు డిపోకు చెందిన బస్సు బుధవారం ఉదయం జగద్గిరిగుట్ట నుంచి భువనగిరి మీదుగా తొర్రూరుకు వెళ్తోంది.

మధ్యలో కాటెపల్లి సమీపంలోకి రాగానే బస్సు ఎడమవైపు వెనక ఉండే రెండు చక్రాలు ఊడిపోయాయి. ఆ సమయంలో 40 మందికి పైగా ప్రయాణికులు అందులో ఉన్నారు.

డ్రైవర్‌ అప్రమత్తమై బ్రేక్‌ వేయడంతో ఆగిపోయింది. ఎవరికీ గాయాలు కాలేదు. టైరు పంక్చర్‌ కావడంతో బస్సు చక్రాలు ఊడిపోయాయని డ్రైవర్‌ తెలిపారు.

బస్సు ఫిట్‌నెస్‌ లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు.

మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు కూడా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం శివారులో లారీనీ తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది.

అందులో ప్రయాణిస్తున్న 22 మంది సురక్షితంగా బయటపడ్డారని ఈనాడు వివరించింది.

విశాల్

ఫొటో సోర్స్, FB/Vishal

షూటింగులో విశాల్‌కు గాయం

ఒక సినిమా షూటింగులో నటుడు విశాల్‌ తీవ్రంగా గాయపడినట్లు ఆంధ్రజ్యోతి దినత్రిక కథనం ప్రచురించింది.

తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన త‌మిళ హీరో విశాల్ ఇప్పుడు త‌న 31వ సినిమా 'నాట్ ఎ కామ‌న్ మ్యాన్‌' షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది.

ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో విశాల్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.

ఈ స‌మ‌యంలో గోడ త‌గ‌ల‌డంతో విశాల్ వెన్నుకు బ‌ల‌మైన గాయమైంది. ప్ర‌స్తుతం వైద్యులు చికిత్స చేస్తున్నార‌ని, విశాల్ ఆరోగ్యంగానే ఉన్నార‌ని టీమ్ స‌భ్యులు తెలిపారు.

శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. విశాల్ సినిమా అంటే యాక్ష‌న్ స‌న్నివేశాలు భారీగా ఉంటాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో విశాల్ గాయ‌ప‌డ్డారు. మ‌రోసారి స‌మ‌న్వ‌య లోపం కార‌ణంగా గాయ‌ప‌డ్డారని ఆంధ్రజ్యోతి రాసింది.

పెరగనున్న ఏటీఎం చార్జీలు

ఫొటో సోర్స్, Getty Images

ఆగస్టు 1 నుంచి పెరగనున్న ఏటీఎం ఛార్జీలు

నిర్వహణ భారం కావడంతో ఏటీఎం ఛార్జీలు పెంచాలని బ్యాంకులు నిర్ణయించినట్లు సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.

ఆగస్టు 1 నుంచి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్(ఏటీఎం) చార్జీలు పెరగనున్నాయి.

ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారిందన్న బ్యాంక్ ఆందోళన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఇంటర్ చేంజ్ ఫీజ్ ను రూ.2 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది.

తాజాగా వచ్చే ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్ధికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు పెరగనుంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు 90 కోట్ల వరకు వాడుకలో ఉన్నాయి.

ఆర్‌బీఐ సవరించిన నిబంధనల ప్రకారం, ఖాతాదారులు తమ హోమ్ బ్యాంక్ ఏటీఎం నుంచి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు.

ఆ తర్వాత చేసే నగదు లావాదేవిపై ఇంటర్ ఛేంజ్ ఫీజ్ వర్తించనుంది. మెట్రో నగరాలలో మూడు, మెట్రోయేతర నగరాల్లో ఐదు ఉచిత లావాదేవీలు జరపవచ్చు.

2019 జూన్ లో ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన కమిటీ సూచనల ఆధారంగా ఈ మార్పులను చేశారని సాక్షి వివరించింది.

తెలంగాణ వర్షాలు

ఫొటో సోర్స్, TWITTER/HYDTP

తెలంగాణలో ఆగని వానలు

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిందని నమస్తే తెలంగాణ దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

రాష్ర్టాన్ని వాన వదలట్లేదు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం అర్ధరాత్రి వరకూ ముసురు కురుస్తూనే ఉన్నది. పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో చలి వణికిస్తున్నది.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం, వాతావరణంలో మార్పుల కారణంగా పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి.

రాష్ట్రలో రాగల మూడ్రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురువొచ్చని పేర్కొన్నది.

ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని తెలిపింది.

వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది.

మరోవైపు, తూర్పు- పశ్చిమ ద్రోణి బలహీపడింది. గురు, శుక్రవారాల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురువొచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

కొన్ని జిల్లాల్లో అతి భారీనుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. పలు జిల్లాల్లో ప్రమాదకరస్థాయిలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిందని పత్రిక వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)