'అమిత్ షా వస్తున్నారు, తలుపులు కిటికీలు మూసేయండి' - Newsreel

అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

అహ్మదాబాద్‌లోని వెజల్‌పూర్‌లో ఎత్తయిన భవనాలున్న ఒక సొసైటీలో "ఇళ్ల కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని" పోలీసులు విజ్ఞప్తి లాంటి ఆదేశాన్ని జారీ చేశారు.

హోం మంత్రి అమిత్ షా మూడురోజుల అహ్మదాబాద్ పర్యటన సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేశారు.

శనివారం అమిత్ షా అహ్మదాబాద్ చేరుకున్నారు. ఈ మూడు రోజులలో ఆయన పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. వీటిల్లో వెజల్‌పూల్ కమ్యునిటీ హాల్ ప్రారంభోత్సవం కూడా ఒకటి.

జూలై 11న అమిత్ షా ఈ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 వరకు చుట్టూ ఉన్న ఇళ్ల తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని జూలై 9న పోలీసులు నోటీసులు పంపించారు.

వారి ఆదేశాలను కచ్చితంగా పాటించాలని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినట్లు వెజల్‌పూర్ వాసులు చెబుతున్నారు.

ఇది ఆదేశం కాదు, అభ్యర్థన మాత్రమే అని పోలీసులు అంటున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కిటికీలు, తలుపులు మూసి ఉంచమన్నామని వారు చెబుతున్నారు.

"ఆ చుట్టుపక్కలంతా ఎత్తయిన భవనాలున్నాయి. అన్ని భవనాల ప్రవేశం వద్ద పోలీసులను ఉంచాం. కానీ, ప్రతీ ఇంటిపై తనిఖీ పెట్టడం సాధ్యం కాదు. ఎవరు వస్తున్నారు, పోతున్నారని చెక్ చేయడం పోలీసులకు కష్టమవుతుంది. ఆసమయంలో అందరూ తలుపులు, కిటికీలు మూసుకుని ఉంటే, ఎవరైనా ఒకరు తలుపు తెరవగానే దృష్టి వారిపైకి సులువుగా వెళుతుంది. వెంటనే తనిఖీ చేయవచ్చు. అందుకే అలా చెప్పాం" అని వెజల్‌పూర్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎల్‌డీ ఓడేదరా చెప్పారు.

ఇది ఒక విజ్ఞప్తి మాత్రమే, దీన్ని పాటించకపోతే ఎలాంటి చర్యలు తీసుకోమని పోలీసు అధికారులు తెలిపారు.

అయితే, శనివారం పోలీసులు ఇంటింటికి వెళ్లి, కచ్చితంగా వారి ఆదేశాలను పాటించాలని చెప్పారని, లేదంటే చర్యలు తీసుకుంటామని బెదిరించారని, ఇటీవల అహ్మదాబాద్‌లో వీవీఐపీ భద్రతల పేరిట ఈ రకమైన ఒత్తిడి మరింత పెరిగిందని స్థానికులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)