నరేంద్ర మోదీ: కోవిడ్‌పై పోరులో మీ జిల్లా విజయం సాధిస్తే దేశం గెలిచినట్లే - News Reel

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

కోవిడ్‌19ను పోరాటంలో క్షేత్ర స్థాయిలో జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. కరోనావైరస్‌పై పోరులో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.

మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే...

దేశంలోని వివిధ జిల్లాల్లో అనేక రకాల సమస్యలున్నాయి. అయితే మీ జిల్లాలో సమస్యలు మీకే బాగా తెలుస్తాయి. మీ జిల్లా ఆ సమస్యల నుంచి బయటపడితే, అది ఈ దేశం సాధించిన విజయమే అవుతుంది. మీ జిల్లా కోవిడ్‌19పై విజయం సాధిస్తే, ఈ దేశం కూడా విజయం సాధిస్తుంది.

స్థానికంగా కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేసుకోవడం, పరీక్షలను పెద్ద సంఖ్యలో చేయడం, ప్రజలకు సరైన, సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచడం... కరోనావైరస్‌పై పోరాటంలో ఇవే మన ఆయుధాలు.

గతంలో మనం వ్యవసాయ రంగంపై లాక్‌డౌన్‌ విధించలేదు. కానీ పొలాల్లో రైతులు భౌతిక దూరం పాటిస్తూ పనులు చేసుకోవడం చూసి ఆశ్చర్యపోయాను. పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకున్న రైతులు తమ పనితీరును దానికి అనుగుణంగా మార్చుకున్నారు. గ్రామాల సామర్థ్యం ఇదే.

కరోనాపై పోరులో మీరంతా కీలక పాత్ర పోషిస్తున్నారు. మీరే ఈ పోరాటంలో ఫీల్డ్‌ కమాండర్లు లాంటివారు.

కోవిడ్‌ వ్యాక్సీన్ల సరఫరాను భారీ స్థాయిలో పెంచడానికి నిరంతరం కృషిచేస్తున్నాం. వ్యాక్సినేషన్‌ పాలసీని, ప్రక్రియను ఆరోగ్య శాఖ మెరుగుపరిచే పనిలో ఉంది. రాష్ట్రాలకు 15 రోజుల ముందే ప్రణాళికను అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దీనివల్ల జిల్లాల్లోని ప్రజలకు వ్యాక్సీన్లు ఎప్పుడు అందుబాటులో ఉంటాయో, దానికి వారు ఎలా సిద్ధం కావాలో ముందే తెలుస్తుంది.

ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతుంటే, కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతోంది. కేసులు తగ్గుతున్నాయి కాబట్టి మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. సంవత్సర కాలంగా నేను ప్రతి సమావేశంలోనూ ఒకే మాట చెబుతున్నా... మన పోరాటం ప్రతి ప్రాణాన్ని కాపాడేందుకే అని.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)