తమన్నాకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ... హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిక - Press Review

ప్రచురణ

సినీ నటి తమన్నా భాటియాకు కోవిడ్-19 సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయిందని 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. తమన్నా ఓ వెబ్ సిరీస్ చిత్రీకరణ కోసం కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో ఉన్నారు. రెండు రోజుల కిందట కరోనావైరస్ లక్షణాలు కనిపించటంతో పరీక్ష చేయించుకున్నారు. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావటంతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

తమన్నాకు కరోనా సోకిందనే విషయం తెలియగానే ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపిస్తున్నారు.

తమన్నా తల్లిదండ్రులు సంతోష్ భాటియా, రజని భాటియాలకు ఆగస్టులో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ సమయంలో తమన్నా టెస్టు నెగెటివ్ వచ్చింది. ఆ విషయాన్ని ఆమే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు.

చిరు 'లూసిఫర్‌'కి ముహూర్తం ఫిక్స్‌..?

మెగాస్టార్‌ చిరంజీవి ఒకవైపు తన 152వ చిత్రం 'ఆచార్య' సినిమా షూటింగ్‌ను పూర్తి చేయలేదు కానీ తదుపరి చిత్రాలను వరుసగా లైన్‌లో పెడుతున్నారని ''ఆంధ్రజ్యోతి'' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. చిరు లిస్టులో మలయాళ చిత్రం 'లూసిఫర్‌', తమిళ చిత్రం 'వేదాళం' రీమేక్‌లున్నాయి. కోవిడ్‌ ప్రభావంతో ఆగిన 'ఆచార్య' షూటింగ్‌ త్వరలోనే పునః ప్రారంభం కానుంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే మెగాస్టార్‌ 153వ చిత్రంగా 'లూసిఫర్‌' రీమేక్‌ తెరకెక్కనుందట.

సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు వచ్చే ఏడాదిలో 'లూసిఫర్‌' రీమేక్‌ను లాంఛనంగా ప్రారంభిస్తారట. డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా రామ్‌చరణ్‌, ఎన్‌.వి.ప్రసాద్‌ కలిసి ఈ సినిమాను నిర్మిస్తారట.

రైటర్‌ ఆకుల శివ ఈ సినిమా స్క్రిప్ట్‌, డైలాగ్స్‌ను పూర్తి చేశారని, మెగాస్టార్‌ ఓకే చెప్పగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సినిమాను సెట్స్‌పైకి తీసుకెళతారట.

ఏడు నెలల విరామం తర్వాత.. ఆర్ఆర్ఆర్ మళ్లీ మొదలు

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'(రణం రౌద్రం రుధిరం).. చరిత్ర, ఫిక్షన్‌ అంశాల కలబోతగా తెరకెక్కుతోందని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా చిత్రీకరణ సోమవారం నుంచి హైదరాబాద్‌లో పునఃప్రారంభంకానున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్‌పై ప్రధాన ఘట్టాలను చిత్రీకరించేందుకు దర్శకుడు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ షెడ్యూల్‌ కోసం చిత్ర ప్రధాన తారాగణమంతా కొద్దిరోజులుగా సెల్ఫ్‌క్వారంటైన్‌లోకి వెళ్లారని చెబుతున్నారు. తగిన భద్రతా ప్రమాణాలతో షూటింగ్‌ను జరుపబోతున్నట్లు తెలిసింది. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్‌ ఆరంభం కాబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

దసరా కానుకగా ఎన్టీఆర్‌ పాత్ర తాలూకు టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అలియాభట్‌, ఓలివియామోరీస్‌ ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకానుంది.

వారికి అండర్‌వరల్డ్‌ డాన్‌లతో సంబంధాలు..!

శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో కోర్టు అనుమతితో నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిలను పరప్పన జైలులో ఐదు రోజుల పాటు విచారించిన ఈడీ అధికారులు ఆదివారం ముగించారని 'సాక్షి' ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. రాగిణి, సంజన ఆస్తులు, వారి సంపాదన తీరుపై ఈడీ అవగాహనకు వచ్చింది. సంజన బెయిల్‌ దొరికి బయటకు వచ్చినప్పటికీ విచారణ కోసం మళ్లీ అదుపులోకి తీసుకువాలని ఈడీ భావిస్తోంది.

రాగిణి, సంజనలను విచారించిన సీసీబీ అధికారులు.. రౌడీలు, అండర్‌వరల్డ్‌ డాన్‌లతో వారికి సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. బెంగళూరులో వారికి సహకారం అందించిన కొందరు రౌడీలపై నిఘా పెట్టారు.

డాలర్స్‌ కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో గంజాయి సేవిస్తున్న వరుణ్, వినోద్‌ అనే డ్రగ్‌ పెడ్లర్లను బెంగళూరు సంజయ్‌నగర పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. వారిని విచారించగా బెంగళూరులో జరిగే పార్టీలకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో నిందితులు వెల్లడించారని తెలిసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)