మహారాష్ట్ర రాయగఢ్‌లో కూలిన భవనం... శిథిలాల కింద 80 - 90 మంది.. ఇద్దరు మృతి

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని మహాడ్‌లో సోమవారం సాయంత్రం ఒక ఐదంతస్తుల భవనం కూలిపోయింది.

ఈ భవనం శిథిలాల్లో 80 నుంచి 90 మంది చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.

ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది.

మహాడ్ దక్షిణ ముంబయికి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది.

శిథిలాల నుంచి ఇప్పటివరకూ 8 మందిని బయటకు తీశారు. వీరిలో ఇద్దరు చనిపోగా, మిగతావారికి చికిత్స అందిస్తున్నారు.

సహాయ చర్యల్లో నాలుగు బృందాలు ఉన్నాయని రాయగఢ్ జిల్లా యంత్రాంగం చెప్పింది.

రంగంలోకి ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు

మహాడ్‌కు మూడు బృందాలను పంపించామని ఎన్డీఆర్ఎఫ్ కూడా చెప్పిందని ఏఎన్ఐ పేర్కొంది.

పోలీసుల వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం 7 గంటలకు ఈ భవనం కుప్పకూలింది.

స్థానిక రిపోర్టుల ప్రకారం ఇది హాపుస్ సరస్సుకు దగ్గరగా ఉంది. ఇది దాదాపు పదేళ్ల పాతది.

ఈ భవనంలో 45 నుంచి 47 ప్లాట్‌లు ఉన్నాయి. అది ఊగిపోతుండడంతో అందులో ఉన్న కొందరు బయటికి పరుగులు తీశారు.

మహాడ్ ఒక పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ ప్రతి ఏటా వర్షం భారీగా కురుస్తుంటుంది.

2016లో ముంబయి-గోవా హైవేపై బ్రిటిష్ కాలం నాటి ఒక వంతెన కుప్పకూలింది. దానివల్ల చాలా నష్టం జరిగింది.

ఈ భవనం కూలిపోతున్నప్పుడు వచ్చిన భారీ శబ్దానికి భయపడిపోయామని స్థానికులు చెప్పారు.

ఆ తర్వాత పొగలు కనిపించడంతో చాలా మంది ఘటనాస్థలం వైపు పరిగెత్తారు.

భవనం శిథిలాల కింద చిక్కుకుపోయినవారి అరుపులు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు మీడియాకు చెప్పారు.

భవనం కూలిపోగానే, స్థానికులు సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. ఫైర్ బ్రిగేడ్‌కు సమాచారం అందించారు.

పరిస్థితిని సమీక్షించిన సీఎం ఉద్ధవ్

ఈ ప్రమాదంలో చిక్కుకున్న అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు అమిత్ షా ట్వీట్ చేశారు.

"మహాడ్‌లో భవనం కూలిన ఘటన చాలా విషాదకరం. ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌తో మాట్లాడాను. అవసరమైన సాయం అందించాలని ఆదేశించాను" అని అమిత్ షా చెప్పారు..

ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే కూడా స్థానిక ఎమ్మెల్యే భగత్ గోగావ్లే, జిల్లా కలెక్టర్ నిధి చౌధరితో ఈ ఘటనపై చర్చించారు.

ఆ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)