ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ సన్నాహాలు - ప్రెస్‌ రివ్యూ

ప్రచురణ

తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో క్రీడా సముదాయాలు, స్టేడియాలకు అనుమతినివ్వడంతో ఐపీఎల్‌ నిర్వహణపై ఆశలు చిగురించాయని ఈనాడు దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఈ కథనం ప్రకారం.. ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐ పెద్దలు ఆయా రాష్ట్ర క్రికెట్‌ సంఘాలతో చర్చలు మొదలుపెట్టినట్లు సమాచారం.

జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు వర్షా కాలం కావడంతో అంతరాయం లేకుండా మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యం కాదు. సుమారు రెండు నెలలు సాగే ఐపీఎల్‌ను ఈ ఏడాదే ముగించాలంటే అక్టోబరు- నవంబరు సరైన సమయమని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి.

అయితే, అదే సమయంలో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ జరుగనుంది. పొట్టి కప్పు భవిష్యత్తుపై ఈనెల 28న జరిగే బోర్డు సమావేశంలో ఐసీసీ నిర్ణయం తీసుకోనుంది.

ప్రపంచకప్‌ వాయిదా పడితే అక్టోబరు- నవంబరులో ఐపీఎల్‌ నిర్వహణకు మార్గం సుగమం అవుతుందని బీసీసీఐ, ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి.

తిరుప‌తిలో లెగ్ శానిటైజర్లు, ఆల‌యాల్లో ఆన్‌లైన్ పూజ‌లు

కరోనావైర‌స్ క‌ల‌క‌లం నేపథ్యంలో తిరుప‌తిలో ‘లెగ్‌ ఆపరేటెడ్‌ శానిటైజింగ్‌’ యంత్రాలను ప్ర‌ధాన ఆలయం వద్ద టీటీడీ ఏర్పాటు చేసిందని ఆంధ్ర‌జ్యోతి ఒక క‌థనం ప్ర‌చురించింది.

ముఖ్యమైన ప్రదేశాల్లో వీటిని అమర్చేందుకు ఓ దాత సహకారంతో టీటీడీ అధికారులు 20 లెగ్‌ శానిటైజర్లను సిద్ధం చేశారు. అయితే, అలిపిరి, శ్రీవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన క్రిమిసంహార పిచికారి టన్నెల్‌ వినియోగాన్ని నిలిపివేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.

మ‌రోవైపు లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోనూ దర్శనాల నిలిపివేతను కొనసాగిస్తున్నట్టు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు.

భక్తుల కోరిక మేరకు వారి గోత్రనామాలపై ఆన్‌లైన్‌ విధానంలో ప్రత్యేక పూజలు (పరోక్ష విధానంలో) చేయించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు రేపు.. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ లేదు

రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఓ సంచలనం అవుతుందన్న నమ్మకం త‌న‌కు ఉంద‌ని క‌థానాయ‌కుడు ఎన్టీఆర్ చెప్పిన‌ట్లు సాక్షిలో ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

ట్విటర్‌ ద్వారా అభిమానులని ఉద్దేశించి జూ. ఎన్టీఆర్ ఓ లేఖని విడుదల చేశారు.

"మీ ఆనందం కోసం ఫస్ట్‌లుక్‌ లేదా టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం ఎంతగా కష్టపడిందనేది నాకు తెలుసు. కానీ ఒక ప్రచార చిత్రం మీ ముందుండాలంటే అన్ని సాంకేతిక విభాగాలు కలిసి శ్రమించాలి. అధికారిక ఆంక్షల వల్ల అది కుదరలేదు. ఈ విషయం అభిమానులను తీవ్ర నిరాశకి గురిచేసిందని నేను అర్థం చేసుకోగలను."

"ఏటా నా పుట్టినరోజున నాపై చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. ఈ ఏడాది మాత్రం ఇంటి పట్టునే ఉంటూ, అధికారుల సూచనల్ని పాటిస్తూ, భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని నా విన్నపం. ఈ విపత్తు వేళ అందరం కలిసి పోరాడితేనే సురక్షితంగా బయటపడతామని నమ్ముతున్నా" అని జూనియర్ ఎన్టీఆర్ వివ‌రించారు.‌.

ధూల్‌పేట‌‌లో నిశ్చితార్ధం-15 మందికి కరోనా పాజిటివ్

హైదరాబాద్‌లోని ధూల్‌పేట‌‌లో ఇటీవ‌ల జ‌రిగిన ఎంగేజ్మెంట్ 15 మందికి క‌రోనా సోకేలా చేసిందని వెలుగు దిన‌ప‌త్రిక ఓ క‌థ‌నం ప్ర‌చురించింది.

జుమ్మేరాత్‌బజార్ జుంగూర్ బస్తీలో నివసిస్తున్న ఓ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ (38) తండ్రి శ‌నివారం రోజు చనిపోయారు. దీంతో అధికారుల‌కు అనుమానం వ‌చ్చి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే.. అదిక‌రోనా మ‌ర‌ణం అని తేలింది.

వెంట‌నే మేనేజ‌ర్‌తోపాటు అత‌డి కుటుంబ స‌భ్యులు 30 మందిని కారంటైన్ కి త‌ర‌లించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వారిలో 15 మందికి క‌రోనా తేలింది.

మే 11న ధూల్‌పేట‌లో వీరి కుంటుంబంలోని ఒక‌రికి నిశ్చితార్థం జ‌రిగింది. ఈ కార్యక్రమానికి లాక్ డౌన్ నిబంధనలు, భౌతికదూరం సూచనలు పక్కనబెట్టి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరైనట్టు సమాచారం.

ఇప్పుడు వారందరి వివరాలు సేకరించి, క్వారంటైన్‌కు త‌ర‌లించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)