You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్ను పోతిరెడ్డిపాడుపై ఆగమనండి... కేంద్ర జలశక్తి మంత్రి ఆదేశం -ప్రెస్రివ్యూ:
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసిందని, శ్రీశైలం నుంచి నీటిని తరలించేందుకు ఇతర ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, దీనిని కేంద్రం అడ్డుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ ఇటీవల రాసిన లేఖపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందించారని ‘సాక్షి’ కథనం తెలిపింది.
‘‘సదరు లేఖ అందిందని, దాన్ని తమ శాఖ పరిశీలిస్తోందని పేర్కొంటూ శనివారం బండి సంజయ్కి కేంద్ర మంత్రి లేఖ రాశారు. వెంటనే సమావేశం ఏర్పాటుచేయాలని, ఆ ప్రాజెక్టుల డీపీఆర్లను సాంకేతికంగా పరిశీలించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను ఆదేశించినట్టు ఆ లేఖలో షెకావత్ పేర్కొన్నారు.
అలాగే ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014లో పేర్కొన్న కృష్ణా నదీ జలాల నిర్వహణ నియమాలకు అనుగుణంగా ఉన్నాయా అనేది తేలే వరకు ఈ ప్రాజెక్టుల విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్కు చెప్పాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
కృష్ణానది నీటి వినియోగానికి సంబంధించి రెండు రాష్ట్రాల చర్యలపై చర్చించేందుకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని తమ శాఖ అధికారులను ఆదేశించినట్టు వెల్లడించార’’ని కూడా ఆ కథనంలో తెలిపారు.
ఒకే అపార్ట్మెంట్లో 28 మందికి కరోనా పాజిటివ్
గ్రేటర్ హైదరాబాద్ పరిధి మాదన్నపేటలోని ఒకే అపార్ట్మెంట్లో 28 మంది కరోనా బారిన పడ్డారని ‘ఈనాడు’ కథనం తెలిపింది.
‘‘అపార్ట్మెంట్లో బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ శనివారం నాటికి ఆ సంఖ్య 28కి చేరింది. వీరిలో 11 నెలల చిన్నారి నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ ఉన్నారు.
ఒకేచోట ఇన్ని కేసులు నమోదవటం నగరంలో ఇదే తొలిసారి. అధికారుల యంత్రాంగం వైరస్ వ్యాప్తి కారణాలను గుర్తించే పనిలో పడింది.
గతంలో కంటెయిన్మెంట్ జోన్గా ప్రకటించిన మాదన్నపేట కొద్దిరోజుల క్రితమే సాధారణ స్థితికి వచ్చింది.
తాజాగా మరోసారి మహమ్మారి విజృంభించటం ఆందోళన కలిగిస్తోంది.మాదన్నపేటలోని ఓ ఐదంతస్తుల అపార్ట్మెంట్లో 15 కుటుంబాలు ఉంటున్నాయి.
వీరంతా ఐటీ, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులే. ఇంటి నుంచే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఓ కుటుంబంలోని చిన్నారికి ఏప్రిల్ చివరి వారంలో పుట్టినరోజు వేడుక నిర్వహించగా కొన్ని కుటుంబాలు పాల్గొన్నాయి.
ఆ చిన్నారి తండ్రి వారం క్రితం అనారోగ్యానికి గురయ్యారు. నమూనాలు పరీక్షించగా కరోనా పాజిటివ్గా తేలింది. మర్నాడు చిన్నారికీ సోకింది. అనంతరం ఒక్కొక్కరిలో లక్షణాలు బయటపడ్డాయి.
13 మందిలో వైరస్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అలా మొదట 15 మందికి నిర్ధారణ అయింది. తర్వాత మరో 13 మందికి లక్షణాలు కనిపించాయి. పరీక్షల్లో అందరిలో వైరస్ ఉన్నట్లు తేలింది. ఫలితంగా ఆపార్ట్మెంట్లో పాజిటివ్ కేసుల సంఖ్య 28కు చేరినట్టు వైద్యులు తెలిపారు. ఇంటికే పరిమితమైన ఇన్ని కుటుంబాలకు వైరస్ ఎలా సోకిందనే అంశంపై సమాచారం సేకరిస్తున్నారు.
వేడుకలో పాల్గొన్న బంధువులు, స్నేహితులకు నిత్యావసరాలను సరఫరా చేసిన వారి వివరాలు రాబడుతున్నారు.అపార్ట్మెంట్లో ఓ నిండు గర్భిణి ఉంది. వైద్యపరీక్షల్లో ఆమెకు నెగిటివ్ వచ్చింది. నేడో రేపో ప్రసవం. ఈ సమయంలో అండగా ఉంటారనుకున్న కుటుంబ సభ్యులందరినీ ఆసుపత్రికి తరలించడంతో ఆమె బాధ వర్ణనాతీతం. మరోవంక.. క్లిష్ట సమయంలో ఆమెను కంటిపాపలా చూసుకుంటామని వైద్యురాలు అయేషాబేగం భరోసా ఇచ్చార’’ని ఆ కథనంలో వెల్లడించారు.
భౌతికదూరం కోసం పరికరాన్ని ఆవిష్కరించిన దక్షిణ మధ్య రైల్వే
వైద్యులు, వైద్య సిబ్బందికి రోగులకు మధ్య భౌతికదూరం పాటించేలా దక్షిణ మధ్య రైల్వే ఒక వినూత్న పరికరాన్ని ఆవిష్కరించిందని ‘నమస్తే తెలంగాణ’ కథనం తెలిపింది.
‘‘సిబ్బంది ప్రత్యక్షంగా రోగుల వద్దకు వెళ్లకుండా సేవలు అందించేలా రూపొందించిన ఈ పరికరానికి రైల్ బోట్ (ఆర్-బోట్) అని నామకరణం చేశారు. సికింద్రాబాద్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్లో దీనిని ఉపయోగిస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ అదనపు డివిజనల్ మేనేజర్ హేమ్సింగ్ బానోత్ బృందం దీనిని రూపొందించింది. ఆర్-బోట్ ద్వారా రోగులకు మందులు, వైద్యపరికరాలు, ఆహారం అందజేయడానికి వీలుంటుంది.
రియట్ టైమ్ వీడియో కెమె రా కలిగిన ఆర్-బోట్... వైద్యులు, రోగుల మధ్య సంభాషణలను రికార్డు చేస్తుంది. మొబైల్యాప్కు అనుసంధానమై ఉండే ఈ పరికరం సెన్సార్ల ద్వారా రోగుల శరీర ఉష్ణోగ్రతలను గ్రహిస్తుంద’’ని వివరించారు.
మగవారు మాస్కులను ఇష్టపడరట... తాజా సర్వేలో వెల్లడి
కరోనా మహమ్మారి ఇంకా అదపులోకి రాని నేపథ్యంలో మాస్కులు అంశంపై జరిపిన ఓ సర్వేలో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయని ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.
‘‘మాస్కుల పట్ల ఆడవారి కంటే మగవారే ఎక్కువ అయిష్టత ప్రదర్సిస్తారని చెప్పిన సర్వే.. మాస్కులు లేకుండా బహిరంగా ప్రదేశాల్లో సంచరించే అవకాశం మగవారి విషయంలోనే అధికమని స్పష్టం చేసింది.
మాస్కులు అంటే బలహీనతకు చిహ్నమని వారు భావించడమే ఇందుకు కారణమట.
లండన్లోని మిడిల్సెక్స్ యూనివర్సిటీ, కాలిఫోర్నియాలోని మాథమెటికల్ సైన్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లు అమెరికాలోని పురుషులపై చేపట్టిన సర్వేలో ఈ విషయం బయటపడింది. కరోనా తమను ఏంచేయదని అధిక శాతం మంది పురుషులు భావించడమే కారణమని అధ్యయనకారులు చెబుతున్నారు.
ఇక మాస్కులు పెట్టుకోకపోవడమనేది ప్రాంతాల వారీగా మారుతుందని, మాస్కులు కచ్చితంగా ధరించాలనే నిబంధన లేని చోట్ల అధిక సంఖ్యలో మగవారు మాస్కులకు దూరంగా ఉంటారని సర్వేలో తేలింది.
కానీ శాస్త్రపరంగా చూస్తే.. ఆడవారి కంటే మగవారిలోనే కరోనా ప్రతికూలప్రభావం అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.
పురుషుల రక్తంలో ఉండే ఎంజైమ్ కారణంగా వైరస్, మగవాళ్లలో ప్రతికూల ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు’’ అని ఆ కథనంలో వివరించారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: అమెరికా ఎన్నడూ లేనంతగా భయపడుతోందా?
- ఎయిర్ ఇండియా పైలట్లు కరోనావైరస్ బారిన పడే ముప్పు ఎక్కువ ఉందా?
- ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ‘లాక్డౌన్’.. పంటను కోయలేరు, అమ్మలేరు..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్: మీరు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- కరోనావైరస్ ప్రభావంతో భారత్లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
- కరోనావైరస్: వుహాన్లో ప్రజలందరికీ 10 రోజుల్లో పరీక్షలు చేయడం చైనాకు సాధ్యమేనా?
- కరోనావైరస్: కోయంబేడు మార్కెట్ నుంచి కోనసీమకు... ‘ఏపీలోని 10 జిల్లాలకు దిగుమతి’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)