కరోనావైరస్: నాందేడ్ గురుద్వారాకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన 3,200 మంది, వెనక్కి తీసుకెళ్తున్న పంజాబ్ ప్రభుత్వం

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాకు వెళ్లి తిరిగి పంజాబ్ చేరుకున్న యాత్రికుల్లో 30 మందికి పైగా కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.

మార్చిలో పంజాబ్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్లిన దాదాపు 3,200 మంది యాత్రికులు, దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా నెల రోజులకు పైగా అక్కడే చిక్కుకుపోయారు.

నాందేడ్‌లోని గురుద్వారా హజూర్ సాహిబ్‌లో ప్రార్థనలు చేసేందుకు వారంతా వెళ్లారు. అక్కడే ఓ సత్రంలో ఉన్నారు.

కేంద్ర హోం శాఖ జోక్యం తర్వాత ప్రస్తుతం వారిని పంజాబ్‌కు తరలిస్తున్నారు.

కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారందరూ 21 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మంగళవారం ప్రకటించారు.

బస్సులు
ఫొటో క్యాప్షన్, బుధవారం రాత్రి నాందేడ్ నుంచి కొన్ని బస్సులు పంజాబ్‌లోని అమృత్ సర్ చేరుకున్నాయి

నాందేడ్ నుంచి తిరిగి వచ్చే యాత్రికులందరూ, రాజస్థాన్ నుంచి వచ్చే విద్యార్థులు, కార్మికులను సరిహద్దు వద్దే ఆపి 21 రోజుల పాటు ఇతర వ్యక్తులతో కలవకుండా చూస్తామని, వారిని ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు పంపుతాం అని ముఖ్యమంత్రి అన్నారు.

పంజాబ్‌లో ఇప్పటి వరకు 370కి పైగా కరోనా కేసులు నమోదు కాగా, 19 మంది చనిపోయారు. విదేశాల నుంచి వచ్చిన వారు, తబ్లీగీ జమాత్ యాత్రికుల, ఇప్పుడు నాందేడ్‌ నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల కారణంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

దాదాపు 3,200 మంది యాత్రికులు నాందేడ్ సాహిబ్‌లో చిక్కుకున్నారని పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది.

కరోనావైరస్ స్క్రీనింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రాలలో నాందేడ్ సాహిబ్ ఒకటి. వారంతా మార్చిలో అక్కడికి వెళ్లారు. దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు.

పంజాబ్‌లోని వివిధ గ్రామాలు, నగరాలకు చెందిన ఈ యాత్రికులు బృందాలుగా తిరిగి పంజాబ్ వెళ్తున్నారు.

పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశాల మేరకు, వారందరినీ తిరిగి స్వరాష్ట్రం తరలించేందుకు ఏప్రిల్ 25న పంజాబ్ ప్రభుత్వం 80 బస్సులను పంపింది.

ఇప్పటి వరకు పంజాబ్‌ నుంచి వచ్చిన యాత్రికులందరూ తిరిగి వెళ్లిపోయారని, దిల్లీ, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఇంకా తమ గురుద్వారా దగ్గర ఉన్న వసతి గృహంలో ఉండిపోయారని నాందేడ్ తఖ్త్ సంచ్‌ఖంద్ హజూర్ సాహిబ్ నిర్వాహకులు చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అందరూ సామాజిక దూరం పాటిస్తున్నారని తెలిపారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)