ఉల్లి సాగు చేసిన ఈ రైతుకు ఎంత ఆదాయం వచ్చిందంటే... :ప్రెస్‌రివ్యూ

ఉల్లిగడ్డలు

ఫొటో సోర్స్, AFP

ప్రచురణ

ఉల్లి ధరలు సామన్యుడిని బెంబేలెత్తిస్తున్నా, ఓ రైతును కోటిశ్వరుడిగా మార్చాయంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

కర్నాటకలో అప్పుల్లో ఉన్న రైతు ఉల్లి సాగు ద్వారా నెల తిరిగే లోపు కోటీశ్వరుడయ్యారు.

చిత్రదుర్గ జిల్లా దొడ్డసిద్దవ్వనహళ్లికి చెందిన మల్లికార్జున (42) కొన్నాళ్ల క్రితం ఉల్లి సాగు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అప్పటికే తనకు అప్పులున్నా, మరికొంత అప్పు చేసి రూ.15 లక్షల పెట్టుబడితో 20 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు.

ఆయనకు దాదాపు 240 టన్నుల ఉల్లి దిగుబడి వచ్చింది. అదే సమయంలో ఉల్లి ధర అమాంతం పెరిగిపోయింది.

క్వింటాలుకు రూ.7 వేలు చొప్పున విక్రయించగా.. రూ.1.68 కోట్ల ఆదాయం వచ్చింది.

చేసిన అప్పులన్నీ తీర్చేశానని, ఇల్లు కట్టుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నానని ఆయన చెబుతున్నారు.

అయితే, పంట సరిగ్గా పండకపోయినా, ఉల్లి ధరలు పడిపోయినా.. తాను అప్పుల ఊబిలో మరింతగా కూరుకుపోయేవాడినని అన్నారు.

నల్లమల

నల్లమలలో మళ్లీ యురేనియం సర్వే భయాలు

నల్లమల అభయారణ్యం మీదుగా విమానాలు తిరుగుతుండటంతో యురేనియం కోసం సర్వే జరుగుతోందని స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారంటూ వెలుగు దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

అక్టోబర్‌ 15, 25న నల్లమలపై విమానాలు చక్కర్లు కట్టాయి. మళ్లీ డిసెంబర్‌ 13 నుంచి నిత్యం విమానాలు తిరుగుతూ కనిపిస్తున్నాయి.

గతంలో యురేనియం సర్వేల పేరుతో గుర్తించిన ప్రాంతాలైన తిర్మలాపూర్‌, వటవర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతల బయలు, ఉడిమిళ్ల, పెట్రాల్‌చేను పంటపొలాలగుండా, అడవుల్లో అతితక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నాయి.

నల్లమల అభయారణ్యంపై విమానానాలు సంచరిస్తున్నాయని సోషల్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయని, దీనిపై అధికారికంగా తమకు ఎటువంటి సమాచారం లేదని జిల్లా అటవీశాఖ అధికారి జోజి చెప్పారు.

తెర వెనక ఏదో జరగుతున్నట్లు అనిపిస్తోందని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే మళ్లీ యురేనియానికి వ్యతిరేకంగా ఉద్యమించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడతామని యురేనియం వ్యతిరేక రాజకీయ జేఏసీ కన్వీనర్‌ కల్ముల నాసరయ్య అన్నారు.

నల్లమలలో యురేనియం అన్వేషణ కొనసాగదని చట్టసభల్లో తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసింది.

మద్యం

ఫొటో సోర్స్, Getty Images

ఏపీలో మద్యం దుకాణాలు తగ్గినా, ఆదాయం పెరిగింది

మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరుగుతూనే ఉందని ప్రజాశక్తి దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

ఏపీలో ఎక్సైజ్ ఆదాయం గత ఏడాది కన్నా రూ.500 కోట్లు పెరిగింది. పోయిన ఏడాది నవంబర్‌ వరకు దాదాపు రూ.13 వేల కోట్ల ఆదాయం లభించగా, ఈ ఏడాది ఆ మొత్తం రూ.13,572 కోట్లకు చేరింది. అంటే దాదాపు 3.86% పెరుగుదల.

గత ఏడాది నవంబర్‌ వరకు 2.54 కోట్ల లిక్కర్‌ కేసుల విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది నవంబర్‌ వరకు 2.04 కోట్ల కేసులు అమ్ముడయ్యాయి.

దశల వారీ మద్య నిషేధంలో భాగంగా మద్యం దుకాణాల సంఖ్యను ఏపీ ప్రభుత్వం తగ్గించింది. జనవరి నుంచి బార్ల సంఖ్యను కూడా తగ్గించనున్నట్లు ప్రకటించింది.

మద్యం వినియోగం తగ్గినా, ఖజానాకు వచ్చే ఆదాయం భారీగా పెరగడానికి ధరల పెరుగుదలే కారణం.

ఉప్పల్

ఫొటో సోర్స్, HMDA

ఉప్పల్ భగాయత్‌లో గజం భూమి గరిష్ఠంగా రూ.79,900

ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌లోని 45 ఫ్లాట్లకు ఆదివారం నిర్వహించిన ఈ-వేలం పోటాపోటీగా సాగినట్లు ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

భగాయత్ లేఅవుట్‌లోని 41 ఫ్లాట్ల (28,909 చదరపు గజాలు) విక్రయంతో హెచ్‌ఎండీఏకు రూ.185.21 కోట్ల ఆదాయం సమకూరింది.

చదరపు గజం ధర అత్యధికంగా రూ.79,900, అత్యల్పంగా రూ.30,200 పలికింది.

హెచ్‌ఎండీఏ కనీస ధర రూ.30 వేలుగా నిర్ణయించగా సగటున రూ. 46,769 ధర పలికింది.

ఫేజ్‌-1 లేఅవుట్‌లోని 58 ఫ్లాట్లకు శనివారం నిర్వహించిన ఈ-వేలంలో 52 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. రూ.155 కోట్ల ఆదాయం సమకూరింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)