ఇరాన్‌తో అమెరికా యుద్ధం ‘వ్యక్తిగత వైరం’ స్థాయికి చేరిందా, ట్రంప్ రహస్యంగా విమానం మారడం దేనికి సంకేతం?

ట్రంప్
ఫొటో క్యాప్షన్, ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి క్యాటరింగ్ ట్రక్‌లో ట్రంప్ తరలింపు
    • రచయిత, ఆంథోనీ జర్చర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

"అతను నన్ను చంపేలోపే నేను అతన్ని చంపేశా. వాళ్లు రెండుసార్లు ప్రయత్నించారు. కానీ ముందుగా నేనే అతన్ని అంతం చేశా"

ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యను ప్రారంభించిన మరుసటి రోజు ఏబీసీ కరస్పాండెంట్ జోనాథన్ కార్ల్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య ఇది.

అమెరికా అనుమతి, సమన్వయంతో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో అయతొల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు కీలక ఇరానియన్ నేతలు హతమయ్యారు. గతంలో తనను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బెదిరింపులు, కుట్రలు పన్నిందంటూ ట్రంప్ ఆ దాడిని నేరుగా ఈ హత్యకు ముడిపెట్టారు.

ఆ తర్వాతి ఆరు నెలలుగా సాగుతున్న యుద్ధంలో ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలను మళ్లీ చేయకపోయినప్పటికీ, రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ మాటలలో ఇదే అభిప్రాయం ప్రతిధ్వనించింది.

"ఇరాన్ ట్రంప్‌ను చంపేందుకు ప్రయత్నించింది. కానీ అధ్యక్షుడు ట్రంప్ చివరికి పైచేయి సాధించారు" అని ఆయన మార్చిలో అన్నారు. అమెరికా దాడుల్లో హతమైన ఓ ఇరానియన్ వ్యక్తి ఈ హత్యా దళానికి నాయకత్వం వహించారని చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యక్తి పేరును మాత్రం హెగ్‌సెత్ వెల్లడించ లేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఎందుకు రహస్యంగా వ్యవహరించారు...

ఈ వ్యాఖ్యలు ఈ యుద్ధానికి ఉన్న వ్యక్తిగత కోణాన్ని సూచిస్తున్నాయి. అలాగే ట్రంప్ భద్రతకు ఇరాన్ ఇప్పటికీ కలిగిస్తున్న ముప్పు గురించి అధ్యక్షుడు, ఆయన భద్రతా బృందం ఆందోళనలను కూడా సూచిస్తున్నాయి.

గత నెలలో తుర్కియేలో జరిగిన నేటో సదస్సు నుంచి తిరిగి వస్తున్న తన ప్రయాణంలో ట్రంప్ రహస్యంగా మరో విమానాన్ని ఎంచుకున్నారనే విషయం ఈ వారం వెలుగులోకి రావడంతో ఆ ఆందోళనలు మరింత స్పష్టంగా బయటపడ్డాయి. మీడియాను, వైట్‌హౌస్ సిబ్బందిలో ఎక్కువ మందిని ఎయిర్ ఫోర్స్ వన్ 747 విమానంలో బయలుదేరేలా చేసి, తాను కూడా అదే విమానంలో ఉన్నట్టుగా ట్రంప్ మభ్యపెట్టారు.

ఇదొక తెలివైన ఉపాయం. ఇందులో భాగంగా అధ్యక్షుడిని విమానాల వద్దకు తీసుకెళ్లడానికి, అక్కడి నుంచి తీసుకురావడానికి క్యాటరింగ్ ట్రక్కును కూడా ఉపయోగించారు. ఎయిర్ ఫోర్స్ వన్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేసే ముప్పు ఉందని అమెరికా అధికారులు విశ్వసించిన నమ్మకమైన నిఘా సమాచారానికి ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకున్నారు.

ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ట్రంప్ ప్రతిష్ఠకు ప్రతికూలమా?

ఈ ముప్పు గురించి వైట్‌హౌస్ చాలా తక్కువ వివరాలు వెల్లడించింది. అయినా, ట్రంప్‌కు ఇరాన్‌తో ఉన్న ఘర్షణపూరిత సంబంధాల చరిత్రలో ఇదో ముఖ్యమైన ఘటన.

అయితే, యుద్ధ ప్రాంతంలో లేదా దానికి సమీపంలో అధ్యక్షుడు ప్రయాణించే సందర్భాల్లో ఇలాంటి చర్యలు కొత్తేమీకాదని ప్రభుత్వ భద్రతా నిపుణులు చెబుతున్నారు.

గతంలో పనిచేసిన అధ్యక్షులు అప్గానిస్తాన్, ఇరాక్, యుక్రెయిన్ వంటి ప్రాంతాలకు రహస్యంగా ప్రయాణించారు. కానీ తమ ప్రయాణం గురించి మీడియా సంస్థలకు కనీసం ముందస్తు సమాచారమైనా లేకుండా ఎప్పుడూ వెళ్లలేదు. అయితే ఆ ప్రయాణం పూర్తయ్యే వరకు దానిని వెల్లడించబోమని మీడియా సంస్థలు అంగీకరించేవి.

ఇరాన్ నుంచి కనిపిస్తున్న ముప్పు నుంచి తప్పించుకోవడానికి ట్రంప్ క్యాటరింగ్ ట్రక్కులో దాక్కుని వెళ్లిన దృశ్యం, తన బలాన్ని పదేపదే చాటుకున్న అధ్యక్షుడికి అంత శోభస్కరం కాదు. ఎందుకంటే, నెలల తరబడి సాగిన యుద్ధం తర్వాత ఇరాన్ సైనికంగా బలహీనపడిందని ఆయన పదేపదే చెబుతూ వచ్చారు.

అంకారాలో ట్రంప్ తన విమానాన్ని రహస్యంగా మార్చిన సీక్రెట్ సర్వీస్ ఆపరేషన్ విషయం బయటకు రావడానికి నెలకు పైగా పట్టింది. దానిని అలా కొన్నాళ్లపాటు రహస్యంగా ఉంచడం ప్రపంచానికి తానో శక్తిమంతమైన నాయకుడినంటూ ట్రంప్ నిర్మించుకున్న ప్రతిష్ఠనకు భంగం కలగకుండా ఉండటానికి అయ్యిండొచ్చు.

అయితే ఈ ఘటన ఒక విషయాన్ని చెప్పకనే చెబుతోంది. దాదాపు ముగిసిపోయిందని అధ్యక్షుడు చెబుతున్న ఘర్షణలో, ఓడిపోయిందని ఆయన భావించిన ప్రత్యర్థి దేశం... ఇప్పటికీ అమెరికా ప్రయోజనాలకు ముప్పుగా కనిపిస్తోంది.

అమెరికా, డోనల్డ్ ట్రంప్

ఇరాన్ బెదిరింపులు కొత్తవి కావు

అయితే, ట్రంప్‌పై ఇరాన్ నుంచి వస్తున్న బెదిరింపులు కొత్తవి కావు.

ట్రంప్ తన మొదటి అధ్యక్ష పదవీకాలంలో, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ నాయకుడు ఖాసీమ్ సులేమానీని క్షిపణి దాడితో హతమార్చమని ట్రంప్ ఆదేశించిన తరువాత, ట్రంప్‌పైనా, ఆయన ప్రభుత్వంలోని సీనియర్ నేతలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ నాయకత్వం ప్రతినపూనింది.

ఒక సందర్భంలో, ఫ్లోరిడాలో ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్నప్పుడు ఆయనను లక్ష్యంగా చేసుకున్న డ్రోన్‌ను చూపించే ఇరానియన్ పెయింటింగ్‌ ఒకటి బయటకు వచ్చింది.

ఈ బెదిరింపులు కేవలం మాటలకే పరిమితం కాలేదని కనిపిస్తోంది.

ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్‌ను లక్ష్యంగా చేసుకునే ఒక పథకం బయటపడిన తరువాత, 2022లో బైడెన్ ప్రభుత్వం అమెరికా పౌరులను ఎవరినీ లక్ష్యంగా చేసుకోవద్దని ఇరాన్‌ను హెచ్చరించింది.

అలాగే, 2024 జూలైలో, ట్రంప్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్తానీ వ్యక్తి అసిఫ్ మర్చెంట్‌ను అధికారులు అరెస్టు చేశారు. ఆయనకు ఐఆర్‌జీసీతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలుగు నెలల తర్వాత, మరోసారి ట్రంప్ హత్య కుట్రకు సంబంధించి అఫ్గాన్ పౌరుడు ఫర్హాద్ షకేరీపై అభియోగాలు మోపారు.

మర్చెంట్‌ను దోషిగా నిర్థరిస్తూ 2026 మార్చిలో తీర్పు వెలువడింది. అయితే, ఐఆర్‌జీసీ అధికారి ఆదేశాల మేరకు ఆయన వ్యవహరించారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్న షకేరీ మాత్రం ఇప్పటికీ పరారీలో ఉన్నారు.

ఈ ప్రయత్నాలన్నీ ప్రణాళిక దశలోనే విఫలమైనప్పటికీ, వైట్‌హౌస్‌కు తిరిగి రావడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన ఎదుర్కొన్న భౌతిక ముప్పులు ఎంత స్పష్టంగా ఉన్నాయో మాత్రం అర్థమైంది.

పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో 2024 జూలైలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఒక వ్యక్తి తుపాకితో కాల్పులు జరపడంతో ట్రంప్ రక్తమోడారు. రెండు నెలల తర్వాత, ఫ్లోరిడాలో ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న ప్రాంతానికి సమీపంలోని చెట్లలో దాక్కున్న ఒక సాయుధ వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గుర్తించి అరెస్టు చేశారు.

అయితే, ట్రంప్ తరచూ తాను 'హత్యకు లక్ష్యంగా' మారడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి జోకులు కూడా వేస్తుంటారు.

"అధ్యక్షుడిగా ఉండటం ఎంత ప్రమాదకరమో ఎవరూ నాకు చెప్పలేదు. చెప్పి ఉంటే, బహుశా నేను పోటీ చేసేవాడిని కాదు" అని ట్రంప్ అన్నట్లు వైట్‌హౌస్ అధికారి ఒకరు గుర్తుచేసుకున్నారు. "ఆయన ఇలాంటి వ్యాఖ్యలు సరదాగా చేస్తారు, కానీ దాని వెనుక వాస్తవం ఉంది" అని ఆ అధికారి అన్నారు.

ఇరాన్ అణు పరిశోధనా కేంద్రాలపై 2025లో ట్రంప్ జరిపిన బాంబు దాడులు, అలాగే ఈ ఏడాది విస్తృతంగా సాగిన బాంబు దాడుల కార్యక్రమం, నౌకా దిగ్బంధనం ఇవన్నీ ట్రంప్‌పై ఇరాన్ నుంచి మరోసారి బెదిరింపులు రావడానికి దారితీశాయి. దీనికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యక్షుడు కూడా నేరుగా హెచ్చరిక చేశారు.

జూలైలో ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాస్తూ, ఇరాన్ తనను "హత్య చేస్తానని లేదా హత్యాయత్నం చేస్తానని’’ బెదిరించిందని అన్నారు. ఇరాన్ ప్రభుత్వం ఆ బెదిరింపును అమలు చేస్తే, "1,000 క్షిపణులు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌పై గురిపెట్టి ఉన్నాయి. వెంటనే వేలాది క్షిపణులు వాటిని అనుసరిస్తాయి" అన్నారు.

ఇరాన్‌కు అధ్యక్షుడు పంపిన సందేశం సూటిగా ఉంది. ఇటీవలి కాలంలో ఆయనపై వచ్చిన అనేక బెదిరింపులు కూడా అంతే స్పష్టంగా ఉన్నాయి.

కిల్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌లో అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక ర్యాలీలు జరిగినప్పుడల్లా తరచూ ట్రంప్‌ను చంపాలనే బ్యానర్లు కనిపిస్తుంటాయి.

తుర్కియే నుంచి ట్రంప్ బయలుదేరడానికి ఒక రోజు ముందు జరిగిన ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నవారు కిల్ ట్రంప్ అని రాసి ఉన్న ఒక బ్యానర్‌ను ప్రదర్శించారు. ఆ తర్వాతి వారంలో, తెహ్రాన్‌లోని ఒక కూడలి వద్ద ఉన్న ఒక భవనంపై అమెరికా అధ్యక్షుడు నల్లటి శవపేటికలో పడుకుని ఉన్నట్లు చూపించే ఒక పెద్ద పెయింటింగ్ కనిపించింది. దాని కింద ‘‘వి విల్ కిల్ ట్రంప్" " బ్లడ్ ఫర్ బ్లడ్’’ అని రాసి ఉంది.

ట్రంప్‌పై గతంలో జరిగినట్లు చెప్పిన ఏ కుట్రలోనూ తమ ప్రమేయం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే, ఖమేనీ మరణం, అలాగే అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ పౌరులు మరణించినట్లు వచ్చిన వార్తల తర్వాత వెలువడిన సందేశం మాత్రం స్పష్టంగా ఉంది.

ఇరానియన్లు చెబుతున్నది ఏంటంటే, యుద్ధం ఇంకా చాలా దూరం సాగాల్సి ఉంది. ప్రతీకారం తీర్చుకోవడానికి ట్రంప్ కూడా ఒక లక్ష్యమే.

తుర్కియే నుంచి అమెరికాకు తిరిగి వస్తున్న ప్రయాణంలోని చివరి దశలో, ట్రంప్, ఆయనతో ప్రయాణిస్తున్న మీడియా బృందం మళ్లీ ఒకే విమానంలో చేరిన తర్వాత, అధ్యక్షుడు విలేఖరులతో మాట్లాడేందుకు ప్రెస్ క్యాబిన్‌కు వచ్చారు.

అసాధారణంగా సాగిన ఈ ప్రయాణం గురించి వారు ప్రశ్నించారు. అందులో భాగంగా, విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో దాని కిటికీ తెరలను మూసి ఉంచాలని సీక్రెట్ సర్వీస్ ఎందుకు ఆదేశించింది అని కూడా ఆయన్ను అడిగారు విలేఖరులు.

"వారి లిస్టులో నేను మొదటి స్థానంలో ఉన్నానని నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటా" అని ఆయన వారితో అన్నారు.

"కానీ నేను పోతే, మీరు కూడా పోతారు కదా?" అన్నారాయన.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)