You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఏకే - 47 భారత్లోకి ఎప్పుడు వచ్చింది, ఇలాంటి ఆయుధాలను వాడేందుకు పోలీసులకు అనుమతి ఉందా
- రచయిత, చందన్ కుమార్ జజ్వాడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆయుధాల్లో కలాష్నికోవ్ రైఫిల్ ఏకే-47 ఒకటి. దీని ధర తక్కువగా ఉండటమే కాక, తయారీ, నిర్వహణ కూడా సులభం.
అందుకే ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని సాయుధ గ్రూపులతో పాటు అనేక దేశాల సైన్యాలూ దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 10 కోట్లకు పైగా ఏకే -47 రైఫిళ్లు అమ్ముడయ్యాయని భావిస్తున్నారు.
బిహార్లోని సివాన్ జిల్లాలో ఓ పోలీసు జవాన్ ఏకే-47 రైఫిల్తో గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన తర్వాత ఈ రైఫిల్ మళ్లీ వార్తల్లో నిలిచింది.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సివాన్ జిల్లాలో జులై 25న విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ఆ సమయంలో అక్కడున్న గుంపు వైపు బిహార్ పోలీస్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ ఒకరు ఏకే-47 రైఫిల్తో గాల్లోకి కాల్పులు జరిపారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గాల్లోకి కాల్పుల ఘటన తీవ్ర చర్చకు దారితీయడంతో కానిస్టేబుల్ అభిషేక్ పటేల్ను సస్పెండ్ చేశారు.
నిజానికి ఏకే-47ను అత్యంత ప్రత్యేకమైన ఆయుధంగా భావిస్తారు. సాధారణ ఆయుధాల్లా దీనిని ఉపయోగించరు. దీంతో సివిల్ పోలీసు సిబ్బంది ఏకే-47తో కాల్పులు జరపడం వివాదానికి కారణమైంది.
ఏకే-47తో కాల్పుల ఘటనపై సివాన్ జిల్లా కలెక్టర్ వివేక్ రంజన్ మైత్రేయ మాట్లాడుతూ "అలా చేయమని ఆయనకు ఎలాంటి ఆదేశాలు లేవు. గాల్లోకి కాల్పులు కూడా జరపకూడదు. ఇలాంటి ఆయుధాన్ని ప్రజల మధ్యకు తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఆయన అక్కడికి వేరే పనిపై వెళ్తూ.. ఆ పరిస్థితిలో చిక్కుకు పోయారు" అని చెప్పారు.
కానీ ఈ వివాదం అక్కడితో ముగియలేదు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో పాటు ఆయన పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా ఈ ఘటనపై ప్రశ్నలు లేవనెత్తారు.
ఈనేపథ్యంలో ఏకే-47 రైఫిల్ను వివిధ ఆపరేషన్లలో ఉపయోగించిన అనుభవం ఉన్న కొందరు అధికారులతో బీబీసీ మాట్లాడింది.
ఈ ఆయుధం ఎందుకు అంతగా ప్రాచుర్యం పొందిందో, భారత్లో ఎప్పటి నుంచి వినియోగంలోకి వచ్చింది? సివిల్ పోలీసు బలగాలు ఈ ఆయుధాన్ని ఉపయోగించడంపై ఏమైనా మార్గదర్శకాలు ఉన్నాయా? అనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది.
భద్రతా బలగాలకు మార్గదర్శకాలు
ఉత్తర ప్రదేశ్ పోలీసుశాఖలో అనేక కీలక పదవుల్లో పనిచేసి, కరడుగట్టిన నేరగాడు శ్రీప్రకాశ్శుక్లాను పట్టుకోవడానికి నియమించిన స్పెషల్ టాస్క్ఫోర్స్కు నేతృత్వం వహించిన మాజీ ఐపీఎస్ అధికారి అరుణ్ కుమార్ ఈ విషయంపై మాట్లాడారు.
"గుంపులు లేదా నిరసనలను అదుపు చేయడానికి వీలైనంత తక్కువ బలాన్ని మాత్రమే ఉపయోగించేలా పోలీసులు,భద్రతా బలగాలకు శిక్షణ ఇస్తారు. ఇలాంటి సందర్భాలలో ముందుగా హెచ్చరిక ఇవ్వాలనే నిబంధన ఉంది. తుపాకీని ఉపయోగించడం చివరి మార్గం" అని చెప్పారు.
"ముందుగా అక్కడి ప్రజలను వెళ్లిపోవాలని హెచ్చరిస్తారు. ఆ తర్వాత జల ఫిరంగులను ఉపయోగిస్తారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోతే బాష్పవాయువు ప్రయోగిస్తారు. చివరగా లాఠీచార్జ్ చేస్తారు"అని అరుణ్కుమార్ వివరించారు.
అయితే గుంపు హింసాత్మకంగా మారినా, దాడికి ప్రయత్నించినా, వారి వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందనిపించినా, ఆత్మరక్షణ కోసం గాల్లోకి కాల్పులు జరపవచ్చని చెప్పారు. గుంపును చెదరగొట్టడానికి తీసుకునే చివరి చర్య అదే అని ఆయన అన్నారు.
మరో మాజీ ఐపీఎస్ అధికారి రాజేష్ పాండే మాట్లాడుతూ "సివాన్లో జరిగినది సరైనది కాదు. నైతికంగా కూడా దాన్ని సమర్థించలేం. అక్కడి గుంపు ఆయుధాలతో లేదు. అలాంటి పరిస్థితిలో కాల్పులు జరపడం ఏ పోలీసుకైనా సమంజసం కాదు" అని చెప్పారు.
ఏకే-47 ఎందుకంత ప్రత్యేకం?
అవతోమత్ కలాష్నికోవ్' (ఏకే-47) రైఫిల్ను 1947లో రష్యాకు చెందిన మిఖాయిల్ కలాష్నికోవ్ రూపొందించారు.
ఈ రైఫిల్ ప్రపంచవ్యాప్తంగా భద్రతా బలగాలు, సాయుధ ముఠాలు విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి.
రాజేష్ పాండే మాట్లాడుతూ "2008-09లో ఐక్యరాజ్యసమితి శాంతి మిషన్లో భాగంగా కొసోవో వెళ్లాను. అక్కడ మాకు అనేక ఆధునిక ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. కానీ ఏకే-47కు మరొకటి సాటి లేదు. దీని దాడి సామర్థ్యం చాలా ఎక్కువ. ఉపయోగించడం కూడా చాలా సులభం. లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదిస్తుంది" అని చెప్పారు.
" రెండు,మూడువందల మీటర్ల దూరం నుంచైనా గురిచూసి లక్ష్యాన్ని తాకేలా దీంతో కాల్చితే ప్రాణాంతకంగా మారుతుంది. అయితే పాత చిన్న ఆయుధాల పరిధి 30 నుంచి 40 మీటర్ల వరకే ఉండేది" అని ఆయన వివరించారు.
అరుణ్ కుమార్ మాట్లాడుతూ "ఏకే-47లో కాల్పులు జరపడానికి రెండు విధానాలు ఉంటాయి. 'ఎస్' (సింగిల్) మోడ్లో ఉంచితే ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కినప్పుడు ఒక్క బుల్లెట్ మాత్రమే బయటకు వస్తుంది.
అదే 'ఆర్' (రిపీట్) మోడ్లో ఉంచితే ఒకసారి ట్రిగ్గర్ నొక్కగానే మొత్తం మ్యాగజైన్ ఖాళీ అవుతుంది'' అని తెలిపారు.
''ఆటోమేటిక్ మోడ్లో ఒకేసారి 30 బుల్లెట్ల వరకు కాల్చవచ్చు. ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో రెండు మ్యాగజైన్లను కలిపి ఉపయోగిస్తారు. అప్పుడు ఒక్కసారి కాల్పులు జరిపితే 60 బుల్లెట్లు బయటకు వస్తాయి" అని చెప్పారు.
రాజేష్ పాండే మాట్లాడుతూ "ఏకే-47 కాల్పుల శబ్దం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రైఫిల్ గురించి తెలిసినవారు శబ్దం విన్న వెంటనే అది ఏకే-47తో జరిపిన కాల్పులేనని చెప్పగలరు" అన్నారు.
"ప్రత్యేక ఆపరేషన్లలో ఒకేసారి ఎక్కువ సంఖ్యలో కాల్పులు జరపాల్సిన పరిస్థితులు వస్తాయి. ఉదాహరణకు యుద్ధం, ఉగ్ర దాడులు లేదా అపహరణ కేసుల్లో నేరస్థుల వద్ద కూడా ప్రాణాంతక ఆయుధాలు ఉన్నప్పుడు అలాంటి అవసరం ఏర్పడుతుంది" అని అరుణ్ కుమార్ చెప్పారు.
"శాంతి భద్రతల నిర్వహణలో మాత్రం 'ఆర్' మోడ్ను ఎప్పుడూ ఉపయోగించరు. మా శిక్షణలో 'ఒక బుల్లెట్ - ఒక శత్రువు' అనే సూత్రం ఉంటుంది. బుల్లెట్లను వృథా చేయకూడదు. సాధారణ పౌరులు శత్రువులు కాదు. అందుకే వారిపై ఈ విధంగా ఉపయోగించరు" అని ఆయన అన్నారు.
భారత్లోకి ఏకే-47 ఎప్పుడు వచ్చింది?
భారత్లో ఏకే-47 ప్రాచుర్యం పొందడం అఫ్గనిస్తాన్లో సోవియట్ యూనియన్ సైనిక జోక్యం చేసుకున్న కాలంతో ముడిపడి ఉందని వివరించారు రాజేష్ పాండే. 1970ల చివర్లో సోవియట్ సైన్యం ఏకే-47లతో అఫ్గనిస్తాన్లోకి ప్రవేశించింది.
పొరుగు దేశంలో ఈ ఆయుధం వినియోగంలోకి రావడంతో దాని ప్రభావాన్ని చూశాక భారత్లో కూడా ఇది ప్రాచుర్యం పొందింది.
తొలుత ఈ ఆయుధాన్ని భారత సైన్యం, పారామిలటరీ దళాలు, సరిహద్దు రాష్ట్రాల్లోని పోలీసులు, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అందించారు. తర్వాత నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో సాయుధ బృందాలను ఎదుర్కొనేందుకు కూడా పోలీసులకు ఏకే-47లు ఇచ్చారు.
"1980ల చివర్లో పంజాబ్ పోలీసులకు, ఈశాన్య రాష్ట్రాల పోలీసులకు ఈ ఆయుధాన్ని ఇచ్చారు. అనంతరం నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల పోలీసులకు, తర్వాత జమ్ముకశ్మీర్ పోలీసులకు కూడా అందించారు" అని రాజేష్ పాండే వివరించారు.
పంజాబ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాలకు అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నాయి. 1980లలో పంజాబ్ అత్యంత సున్నిత పరిస్థితులను ఎదుర్కొంది. ఆ తర్వాత కశ్మీర్లోనూ సాయుధ వేర్పాటువాద సంస్థలు చురుకుగా మారాయి.
దక్షిణ భారతంలో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ను పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన ఎస్టీఎఫ్కు కూడా ఏకే-47లు ఇచ్చారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని తరాయి ప్రాంతాల్లో సిక్కు తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర పోలీసులకు కూడా ఈ ఆయుధాలు అందించారు. అప్పట్లో ప్రకాశ్ సింగ్ డీజీపీగా ఉన్నారు" అని రాజేష్ పాండే తెలిపారు.
సంజయ్ దత్ కేసు
వ్యక్తిగతంగా కలాష్నికోవ్ రైఫిల్ను కలిగి ఉన్న ఘటనల్లో భారత్లో అత్యంత చర్చనీయమైనది సినీ నటుడు సంజయ్ దత్ కేసు.
ముంబయిలో 1993 మార్చి 12న జరిగిన వరుస బాంబు పేలుళ్లలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కేసు దర్యాప్తులో అరెస్టైన నిందితుల విచారణ ఆధారంగా 1993 ఏప్రిల్ 19న ముంబయి పోలీసులు సినీనటుడు సంజయ్ దత్ను అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై అరెస్టు చేశారు.
ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు ఒక ఏకే-56 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. 2006 నవంబర్ 28న 'ఆయుధ చట్టం' కింద సంజయ్ దత్ దోషిగా తేలినా, 'టాడా'కు సంబంధించిన అన్ని ఆరోపణల నుంచి ఆయనకు విముక్తి లభించింది.
"ఏకే-56 కూడా ఏకే-47 తరహా కలాష్నికోవ్ రైఫిలే. అది ఇంకొంత అధునాతన మోడల్" అని చెప్పారు.
"ఏకే-47ను కేవలం దాడులకే కాదు, బలప్రదర్శనకు, సంబరాలు జరుపుకోవడానికి ఉపయోగిస్తారు. మేం కొసోవోలో ఉన్నప్పుడు ఆ దేశం స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. అప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి కలాష్నికోవ్ రైఫిళ్లతో గాల్లోకి కాల్పులు జరుపుతూ సంబరాలు చేసుకున్నారు" అని ఆయన గుర్తుచేశారు.
పురులియా ఆయుధాల ఘటన
భారత్లో ఏకే-47లకు సంబంధించిన 1995 డిసెంబర్ 17వతేదీ రాత్రి ఓ ఘటన జరిగింది.
రష్యాకు చెందిన ఆంటోనోవ్ ఏఎన్-26 విమానం కరాచీ నుంచి ఢాకాకు బయలుదేరింది. అందులో ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు. మార్గమధ్యంలో వారణాసి బాబత్పూర్ విమానాశ్రయంలో ఇంధనం నింపుకొంది.
అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత పశ్చిమ బెంగాల్లోని పురులియా ఆకాశంలో పారాచూట్లకు కట్టిన మూడు భారీ చెక్క పెట్టెలను కిందికి జారవిడిచింది. వాటిలో వందలాది ఏకే-47 రైఫిళ్లు ఉన్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
తర్వాత జరిగిన దర్యాప్తులో, ఆ ఆయుధాల్లో కొన్ని బిహార్, ఉత్తరప్రదేశ్కు చెందిన నేరస్థుల చేతుల్లోకి వెళ్లినట్లు వెలుగులోకి వచ్చింది.
వారిలో ఉత్తరప్రదేశ్కు చెందిన కరుడుగట్టిన నేరగాడు శ్రీప్రకాశ్ శుక్లా కూడా ఉన్నాడు. అతడిని పట్టుకోవడానికి 1998లో ఎస్టీఎఫ్ను ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేక బృందానికీ ఏకే-47 రైఫిళ్లు అందించారు.
అరుణ్ కుమార్ మాట్లాడుతూ, "గతంలో పోలీసుల వద్ద 'త్రీ నాట్ త్రీ' రైఫిల్ ఉండేది. అది రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి ఆయుధం. అప్పట్లో సాధారణ ప్రజలు లేదా చిన్నస్థాయి నేరస్థుల వద్ద తుపాకులు ఉండేవి కావు. అప్పట్లో 'టెర్రరిజం' పెద్ద సమస్యగా ఉండేది కాదు.
కాలక్రమేణా పరిస్థితులు మారడంతో ఎస్ఎల్ఆర్లు, ఇతర ఆధునిక ఆయుధాలను భద్రతా బలగాలకు అందించడం ప్రారంభమైందని ఆయన తెలిపారు.
మొదట ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించే సాయుధ దళాలు, పారామిలటరీ బలగాలకు ఏకే-47లను ఇచ్చారు. ఆ తర్వాత ప్రత్యేక అవసరాల కోసం సివిల్ పోలీసులకు కూడా ఈ ఆయుధాలను అందించడం ప్రారంభించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)