వైఎస్ జగన్: ఆంధ్రప్రదేశ్‌లో 10 లక్షల మార్క్ దాటిన కోవిడ్ టెస్టులు - ప్రెస్‌రివ్యూ

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ -19 టెస్టుల సంఖ్య 10లక్షల మార్క్‌ దాటినట్లు సాక్షి పత్రిక ఒక కథనాన్ని ప్రముఖంగా రాసింది.

జనాభా ప్రాతిపదికన చూస్తే రాష్ట్రంలో అత్యధిక టెస్టులు జరిగినట్లు ఈ కథనంలో పేర్కొంది. ఆదివారం ఉదయానికి టెస్టుల సంఖ్య 10,17,140కు చేరుకున్నట్లు పేర్కొంది.

మొదటి లక్షల టెస్టులకు 59 రోజులు పట్టగా, చివరి లక్షకు కేవలం నాలుగు రోజులే పట్టిందని ఈ కథనంలో వెల్లడించింది. ఎక్కువ టెస్టులు నిర్వహించడం, కంటైన్మెంట్ల గుర్తింపుతో వ్యాధి కట్టడికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలించిందని ఈ కథనంలో సాక్షి రాసింది.

కరోనావైరస్ రోగుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఆస్పత్రి దిల్లీలో ప్రారంభం

ఇరవై ఫుట్‌బాల్‌ మైదానాలంత వైశాల్యంలో పదివేల పడకలతో ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్‌-19 ఆసుపత్రిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ అనిల్ బైజల్‌ ప్రారంభించినట్లు ఆంధ్రజ్యోతితోపాటు పలు పత్రికలు కథనాలు రాశాయి.

వెయ్యి ఆక్సిజన్‌ వెంటిలేటర్ల సౌకర్యం ఉన్న ఈ ఆసుపత్రి ఢిల్లీలోని ఛత్తర్‌పూర్‌లో ఉన్న రాధాస్వామి సత్సంగ్‌ మైదానంలో ఏర్పాటు చేశారు. కేవలం పది రోజుల్లో సిద్ధమైన ఈ ఆసుపత్రిని లక్షణాలు లేని కరోనా బాధితులకు చికిత్సకు, స్వల్ప లక్షణాలున్న వారికి ఐసోలేషన్‌ సెంటర్‌గా ఉపయోగిస్తారు.

వ్యాధిగ్రస్తులు విసుగు పుట్టినప్పుడు చదువుకోడానికి ఓ గ్రంథాలయాన్ని కూడా ఇందులో ఏర్పాటు చేసినట్లు ఈ కథనాల్లో రాశారు.

జూమ్‌ యాప్‌కు త్వరలో ప్రత్యామ్నాయం - హైదరాబాద్‌లోనే రూపకల్పన

భద్రతా కారణాల దృష్ట్యా జూమ్‌ యాప్‌ వినియోగంపై కేంద్రం హోంశాఖ హెచ్చరికల నేపథ్యంలో స్వదేశీ జూమ్‌ తయారీకి సిద్దమైన స్టార్టప్‌ సంస్థలు ప్రత్యామ్నాయ యాప్‌ను దాదాపు సిద్ధం చేసినట్లు ఈనాడు ఒక కథనంలో పేర్కొంది.

యాప్‌ రూపకల్పనకు కేంద్ర సమాచార సాంకేతిక మండలి దరఖాస్తులు ఆహ్వానించగా అప్లికేషన్లు వెల్లువెత్తాయి. వచ్చిన దరఖాస్తుల్లో పన్నెండు సంస్థలను ప్రభుత్వం ఎంపిక చేసిందని, అందులో ప్రోటోటైప్ తయారీకి హైదరాబాద్‌ నగరానికి చెందిన మూడు స్టార్టప్‌ కంపెనీలు కూడా ఎంపికైనట్లు ఈ కథనంలో పేర్కొంది.

అయితే, తుది ఉత్పత్తికి మరో ఐదు కంపెనీలను కేంద్రం ఎంపిక చేయగా అందులో హైదరాబాద్‌కు చెందిన సంస్థలు ఉన్నాయని తెలిపింది. ఒకేసారి 500మంది ఈ యాప్‌ ద్వారా సమావేశం కావచ్చని కూడా ఈ రెండు కంపెనీల్లో ఓ సంస్థ వెల్లడించింది. ఈ రెండు సంస్థలు రూపొందించిన యాప్‌లలో ఏ యాప్‌ బెస్ట్‌ అన్నది జులై 28న కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది.

సర్కారు ఆన్‌లైన్‌ పాఠాలు-ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ సర్కారు

ప్రైవేటులో మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధులకు కూడా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది.

ఈ ఆలోచనను అమల్లోకి వస్తే విద్యార్ధులు ఇంట్లో కూర్చోనే టీ-శాట్‌, డీడీ ఛానళ్ల ద్వారా డిజిటల్‌ పాఠాలను నేర్చుకోవచ్చని ఈ కథనంలో పేర్కొంది. ఈ తరహాలో ఇప్పటికే మోడల్‌ స్కూళ్లలో క్లాసులు ప్రారంభమయ్యాయని, త్వరలోనే అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరింపజేసేందుకు అధికారులు విధివిధానాలు రూపొందిస్తున్నట్లు ఈ కథనం పేర్కొంది. 6 నుంచి 10 తరగతుల విద్యార్దులకు అందుబాటులో ఉండే ఈ క్లాసుల కోసం ముందుగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)