తాలిబన్ల ప్రతినిధి ఒకరు ఆదివారం వార్తా చానల్ అల్ జజీరాతో
మాట్లాడారు. అప్గానిస్తాన్లో యుద్ధం ముగిసిందని చెప్పారు.
తమ సంస్థ అంతర్జాతీయ సమాజంతో శాంతిపూర్వక సంబంధాలు కోరుకుంటోందని,
ఏ అంశంపైఅయినా చర్చలు జరిపేందుకు తాము
సిద్ధంగా ఉన్నామని అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబాన్ ప్రతినిధి మొహమ్మద్
నయీమ్ చెప్పారని రాయిటర్స్ తెలిపింది.
అఫ్గానిస్తాన్ అధ్యక్ష భవనంలో తాలిబాన్ ఫైటర్లు ఉన్న ఒక
వీడియోను అల్ జజీరా ప్రసారం చేసింది.
ఒంటరిగా జీవించాలని తాలిబాన్లు కోరుకోవడం లేదని మొహమ్మద్ నయీమ్ అన్నారు. అఫ్గానిస్తాన్లో ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటవుతుంది అనేదానిపై త్వరలోనే స్పష్టత ఇస్తామని ఆయన చెప్పారు.
షరియా చట్టం ప్రకారం మహిళలు, మైనారిటీల హక్కులను, భావ ప్రకటనా స్వేచ్ఛను తాము గౌరవిస్తామని ఆయన చెప్పారు.
‘అఫ్గానిస్తాన్ వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసునంతవరకూ, తాలిబాన్లు ఎవరి వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోకూడదు’ అనే విధానాన్ని తాము అనుసరిస్తామని మొహమ్మద్ నయీమ్ చెప్పారు.
"20 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత మేం చేరుకోవాలనుకున్న ఈ స్థాయికి చేరుకున్నాం. మేం మా స్వేచ్ఛ, మా ప్రజల స్వేచ్ఛ కోరుకుంటున్నాం. వేరే ఎవరినీ లక్ష్యంగా చేసుకోడానికి మేం మా భూభాగాన్ని ఉపయోగించుకోనివ్వం, ఎవరికీ హాని కలిగించం" అని ఆయన చెప్పారు.
విదేశీ దళాలు అఫ్గానిస్తాన్లో తమ విఫల అనుభవాలను పునరావృతం చేస్తాయని తాము అనుకోవడం లేదని ఆయన అన్నారు.