You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

అఫ్గానిస్తాన్: 'షరియా చట్టం ప్రకారమే మా పాలన ఉంటుంది, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండదు'

‘అఫ్గానిస్తాన్‌లో ఎలాంటి పాలన అందించాలనే విషయంలో మేం చర్చించుకోం. ఎందుకంటే షరియా చట్టం ప్రకారం పాలన సాగించాలనే విషయంలో మేమంతా స్పష్ఠంగా ఉన్నాం’ అని తాలిబాన్‌ల విధాన నిర్ణయాల గురించి సమాచారం పొందే స్థాయిలో ఉన్న నేత వహీదుల్లా హషీమీ రాయిటర్స్‌తో అన్నారు.

లైవ్ కవరేజీ

  1. తాలిబాన్ల కంటెంట్‌ను నిషేధించిన ఫేస్‌బుక్

    తాలిబాన్లకు సంబంధించిన అన్ని రకాల కంటెంట్‌లను నిషేధించినట్లు ఫేస్‌బుక్ ధృవీకరించింది.

    తాలిబాన్‌ను తీవ్రవాద సంస్థగా పరిగణిస్తున్నామని ఫేస్‌బుక్ తెలిపింది.

    కాబట్టి తమకు సంబంధించిన అన్ని ప్లాట్‌ఫామ్‌ల నుండి తాలిబాన్లకు మద్దతు ఇచ్చే మొత్తం కంటెంట్‌ని నిషేధిస్తున్నట్లు పేర్కొంది.

    తాలిబాన్లతో సంబంధం ఉన్న కంటెంట్‌ని పర్యవేక్షించి, తీసివేయడానికి అఫ్గాన్ నిపుణుల ప్రత్యేక బృందం పనిచేస్తుందని సంస్థ చెబుతోంది.

    ఈ విధానం ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌తో సహా తమకు చెందిన అన్ని ఇతర ప్లాట్‌ఫామ్‌లకు వర్తిస్తుందని ఫేస్‌బుక్ గట్టిగా చెప్పింది.

    అయితే, తాలిబాన్లు వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

    తమ యాప్‌లోని అకౌంట్‌లకు తాలిబాన్‌లతో సంబంధం ఉన్నట్టు తెలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఫేస్‌బుక్ బీబీసీకి తెలిపింది.

    ట్విటర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా తాలిబాన్ సంబంధిత కంటెంట్‌ని ఎలా అరికట్టాలనేదానిపై చర్చిస్తున్నాయి.

  2. అఫ్గాన్లను అడ్డుకోడానికి సరిహద్దులో గోడ కడుతున్న టర్కీ

    వేలాది మంది అఫ్గాన్ పౌరులు దేశం వదిలి పారిపోతున్న క్రమంలో ఇరాన్​తో ఉన్న సరిహద్దుల్లో గోడ కడుతున్నట్లు టర్కీ ప్రకటించింది.

    అఫ్గానిస్తాన్​ నుంచి శరణార్ధులు పోటెత్తే అవకాశం ఉండటంతో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది.

    దాదాపు 295 కిలోమీటర్ల మేర ముళ్ల తీగలు, కందకాలతో ఆ గోడను నిర్మించనున్నారని ఎఎఫ్​పీ పేర్కొంది.

    ‘మా పనుల్లో వేగం పెంచుతాం. సరిహద్దులు దాటలేనివనే అర్థాన్ని బలోపేతం చేస్తాం’అని టర్కీ రక్షణ మంత్రి హులుసీ అకర్ పేర్కొన్నారని హురియత్ డైలీ వెల్లడించింది.

    ‘ఇప్పటికే అందులో ఒక పెద్ద భాగాన్ని పూర్తి చేశాం. దాదాపు 150 కిలోమీటర్ల మేర కందకాలు తవ్వాం. సరిహద్దుల దగ్గర ఔట్ పోస్టులు, బేస్‌లను బలోపేతం చేస్తున్నాం’అని ఆయన చెప్పారు.

  3. అఫ్గానిస్తాన్ నుంచి వచ్చేవారికోసం భారత్ ప్రత్యేక వీసా

    అఫ్గానిస్తాన్‌లో మారిన పరిస్థితుల దృష్ట్యా వీసా నిబంధనల్లో వెంటనే కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చెప్పారని ఏఎన్ఐ తెలిపింది.

    భారత్ వచ్చేవారికి వెంటనే వీసా అందించగలిగేలా ‘ఈ-ఎమర్జెన్సీ X-Misc వీసా’ అనే ఒక ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

    “అఫ్గానిస్తాన్‌లోని హిందూ, సిక్కు సమాజ నేతలతో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. అక్కడ వారికి తగిన భద్రత కల్పించడం కూడా భారత ప్రాధాన్యాల్లో ఒకటి” అని అంతకు ముందు భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ అన్నారు.

    “అఫ్గానిస్తాన్ అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌తో చర్చించాను. కాబుల్ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు పునరుద్ధరించడం గురించి ఆయనతో మాట్లాడాను” అని ఆయన మరో ట్వీట్‌లో చెప్పారు.

    అఫ్గానిస్తాన్ గురించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం కాబోతోంది. అందులో భారత్ తన ఆందోళనలను పంచుకుంటుంది అని కూడా ఆయన చెప్పారు.

  4. మళ్లీ తెరుచుకున్న కాబుల్ విమానాశ్రయం

    విమానాలు ఎక్కడానికి అఫ్గాన్ పౌరులు, విదేశీ కార్మికులు తోసుకుంటున్న విషాద దృశ్యాలు కనిపించిన ఒక రోజు తర్వాత కాబూల్ విమానాశ్రయం తెరుచుకుంది.

    దౌత్య సిబ్బందిని, పౌరులను తరలించే విదేశీ సైనిక విమానాల రాకపోకలు విమానాశ్రయంలో ప్రారంభమయ్యాయి.

    సోమవారం వేలాది అఫ్గాన్ పౌరులు, విదేశీ కార్మికులు నిస్సహాయ స్థితిలో రాజధాని వదిలి పారిపోవాలని కాబుల్ విమానాశ్రయంలో గుమిగూడిన దృశ్యాలు కనిపించాయి.

    తెగించిన కొంతమంది రాజధాని నుంచి టేకాఫ్ అవుతున్న విమానాలకు వేలాడుతూ కూడా కనిపించారు. ఐదుగురు చనిపోయినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే వారు కాల్పుల్లో చనిపోయారా లేక తొక్కిసలాటలో చనిపోయారా అనేది స్పష్టంగా తెలీలేదు.

    అయితే విమానాశ్రయంలో ఈరోజు సోమవారంతో పోలిస్తే పరిస్థితి ప్రశాంతంగా ఉందని అధికారులు చెబుతున్నారు. “నిన్న ఇక్కడకు వచ్చిన చాలామంది ఇళ్లకు వెళ్లిపోయారు” అని ఒక భద్రతా అధికారి రాయిటర్స్‌కు చెప్పారు.

    అయితే, విమానాశ్రయం వైపు నుంచి అప్పుడప్పుడూ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నట్లు కొంతమంది తమకు చెప్పారని రాయిటర్స్ తెలిపింది. సోమవారం దాదాపు పూర్తిగా విమానాల రాకపోకలు రద్దు చేశారు.

    కాబుల్ విమానాశ్రయంలో ప్రస్తుతం విదేశీ సైనిక బలగాలు వెళ్లడానికి ఒక ఎగ్జిట్ పాయింట్ మాత్రమే తెరిచి ఉంచారు.

  5. కాబుల్ నుంచి వస్తూ జామ్‌నగర్‌లో దిగిన భారత ఆర్మీ విమానం

    అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్ నుంచి భారత అధికారులను తీసుకువస్తున్న విమానాన్ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో దించేశారు.

    భారత వైమానిక దళానికి చెందిన సీ17 విమానాన్ని జామ్‌నగర్‌లో దించేశారని కొన్ని వర్గాల ద్వారా తమకు సమాచారం అందిందని ఏఎన్ఐ చెప్పింది.

    ఈ విమానం కాబూల్ నుంచి భారత అధికారులను తీసుకొస్తోంది.

  6. అఫ్గాన్‌లో అమెరికా కొత్త మిషన్ ఇదే.. - బైడెన్

    అఫ్గానిస్తాన్ నుండి సైన్యాన్ని ఉపసంహరించుకునే తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పునరుద్ఘాటించారు.

    ఈ యుద్ధాన్ని తాను ఐదో అధ్యక్షుడికి అప్పగించనని చెప్పారు. 20 సంవత్సరాలు కొనసాగిన మిషన్ "జాతి నిర్మాణం" లేదా "ఏకీకృత, కేంద్ర ప్రజాస్వామ్యాన్ని సృష్టించడం" గురించి కాదని, అమెరికా గడ్డపై ఉగ్రవాద దాడులను నిరోధించడానికేనని ఆయన వెల్లడించారు.

    వైట్ హౌస్ నుంచి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో..

    అమెరికా మిషన్ ముందుకు కొనసాగుతుందని అధ్యక్షుడు బైడెన్ చెప్పారు.

    అమెరికా దాని మిత్రపక్షాలకు చెందిన పౌరులను అఫ్గానిస్తాన్ నుంచి తరలించేందుకు ఆరు వేల మంది సైనికులను పంపుతున్నట్లు ప్రకటించారు.

    అమెరికాకు మిత్రులుగా ఉన్న ఆఫ్గాన్ కూటమికి చెందిన వారినీ, బలహీన ఆఫ్గాన్లను కూడా దేశం దాటిస్తామని భరోసానిచ్చారు.

    ఈ దళాలు వాయుమార్గానికి భద్రత కల్పిస్తాయని, వాయు రవాణాను నియంత్రిస్తాయని బిడెన్ చెప్పారు.

    పౌర, సైనిక విమానాల ఆపరేషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తుంటారని వివరించారు.

    అఫ్గానిస్తాన్‌లో నివసిస్తున్న వేలాది మంది అమెరికన్ పౌరులను సురక్షితంగా తరలించడంలో సైనికులు సహాయపడతారని తెలిపారు.

    ఆపరేషన్ ‘మిత్ర దేశాల శరణార్థులు’ కింద ప్రమాదంలో ఉన్న అఫ్గాన్ పౌరులను ఎంపిక చేసి, కొంత మంది అర్హులను సైనిక సాయంతో అఫ్గానిస్తాన్ నుంచి తరలిస్తామని వెల్లడించారు.

  7. అఫ్గాన్‌ నుంచి భారత దౌత్య సిబ్బంది వెనక్కు

    ప్రస్తుత పరిస్థితుల్లో కాబుల్‌లోని భారతీయ అంబాసిడర్ సహా సిబ్బందిని ఇండియాకు తీసుకురావాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ ట్వీట్ చేశారు.

  8. కార్ల నిండా డబ్బుతో అఫ్గానిస్తాన్‌ను విడిచిన ఘనీ: రష్యా

    అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ నాలుగు కార్లు, ఓ హెలికాప్టర్ నిండా డబ్బుతో కాబుల్ నుంచి పారిపోయారని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ ఆర్ఐఏ పేర్కొంది.

    ఘనీ దేశాన్ని వదిలి వెళ్లిపోయిన చందంగానే ఇక్కడి ప్రభుత్వం పేకమేడలా కూలిపోయిందని రష్యా ఎంబసీ అధికార ప్రతినిధి నికిత ఇష్చెంకో వెల్లడించారని వార్తా సంస్థ తెలిపింది.

    'నాలుగు కార్లు డబ్బుతో నిండివున్నాయి. మిగిలిన డబ్బును హెలికాప్టర్లో తీసుకెళ్లాలని ప్రయత్నించారు. కానీ, పూర్తిగా అందులో ఉంచలేకపోయారు. కొంత మొత్తాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు' అని నికిత ఇష్చెంకో వెల్లడించారు.

    ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఇష్చెంకో చెప్పుకొచ్చారు.

    అయితే, ఎవరూ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.

    అఫ్గానిస్తాన్‌కు రష్యా అంబాసిడర్‌గా ఉన్న దిమిత్రీ ఝిర్నోవ్ ఓ స్థానిక రేడియో స్టేషన్‌తో మాట్లాడుతూ అష్రఫ్ ఘనీతో పోల్చితే తాలిబాన్ ఆధీనంలోనే కాబుల్ లో పరిస్థితి బాగుందని అభిప్రాయపడ్డారు.

    అమెరికాతో పెరుగుతున్న విద్వేషాల నడుమ రష్యా ఈ విమర్శలు చేసింది.

  9. అఫ్గానిస్తాన్ తాలిబాన్ల వశమైన తరువాత సోమవారం జరిగిన కీలక పరిణామాలు

    * అఫ్గాన్ ప్రజలు దేశం విడిచి వెళ్లేందుకు కాబుల్ ఎయిర్‌పోర్ట్‌కు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విమానాలకు వేలాడుతూ వెళ్లేందుకు కూడా సిద్ధపడి కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నట్లు వార్తా ఏజెన్సీలు వెల్లడించాయి.

    * దేశంలో శాంతి నెలకొల్పే ప్రయత్నాలలో భాగంగా మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తాలిబాన్లతో సంప్రదింపులు జరుపుతున్నారు.

    * అఫ్గానిస్తాన్ విమానం అనుమతి లేకుండా తమ గగనతలంలోకి రావడంతో ఉజ్బెకిస్తాన్ దాన్ని కూల్చివేసింది.

    * తాలిబాన్ ప్రభుత్వంతో స్నేహసంబంధాలు కోరుకుంటున్నట్లు చైనా ప్రకటించింది.

    * దేశాన్ని వీడాలనుకునే ప్రజలను వెళ్లనివ్వాలని 60కి పైగా దేశాలు తాలిబాన్లను కోరాయి.

    * అఫ్గాన్ ప్రజలను వదిలేయబోమని ఐరాస ప్రకటించింది. అఫ్గాన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు అన్ని దేశాలూ సిద్ధంగా ఉండాలని ఐరాస సూచించింది.

    * అఫ్గానిస్తాన్‌కు పొరుగు దేశంగా, ఆ దేశ ప్రజలకు మిత్ర దేశంగా భారత్ తాజా పరిస్థితుల పట్ల ఆందోళన చెందుతున్నట్లు ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి చెప్పారు.

  10. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితుల పట్ల భారత్ ఏమందంటే

    అఫ్గానిస్తాన్‌కు పొరుగు దేశంగా, ఆ దేశ ప్రజలకు మిత్ర దేశంగా భారత్ తాజా పరిస్థితుల పట్ల ఆందోళన చెందుతోందని ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి అన్నారు.

    ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అఫ్గానిస్తాన్‌లోని ఆడామగా, పిల్లలు అందరూ నిత్యం భయం నీడలో బతుకుతున్నారని ఆయన అన్నారు.

    త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు.

    అఫ్గానిస్తాన్‌కు భారత్ ఇటీవల కాలంలో ఎంతో సహాయం చేసిందని, అఫ్గానిస్తాన్‌లో ఐరాస చేపట్టే కార్యక్రమాలకు ఎప్పటిలా భారత్ సహకరిస్తుందని ఆయన చెప్పారు.

  11. అఫ్గానిస్తాన్‌ ప్రజలను వదిలేయలేం: ఐరాస సెక్రటరీ జనరల్

    ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తాలిబాన్‌లు సంయమనం పాటించాలని ఐరాస సెక్రటరీ జనరల్ అన్నారు.

    ఐరాస భద్రతా మండలిని ఉద్దేశించి మాట్లాడిన సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్.. ‘‘అఫ్గానిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనల గురించి విన్నాను.. అఫ్గానిస్తాన్ మహిళలు, బాలికలపై పెరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆందోళన చెందుతున్నాను’’ అన్నారు.

    ప్రపంచానికి తీవ్రవాదం నుంచి తలెత్తే ముప్పు నివారణకు, అఫ్గానిస్తాన్‌లో మానవ హక్కుల పరిరక్షణకు అన్ని సాధనాలను ఉపయోగించుకోవాలని ఆయన భద్రతామండలికి పిలుపునిచ్చారు.

    అఫ్గాన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు అన్ని దేశాలు తయారుగా ఉండాలన్నారు. అఫ్గాన్ ప్రజలను వదిలేయబోమని చెప్పారు.

  12. కాబుల్‌కు విమానాల రాకపోకలు ఆగిపోయాయి: పెంటగాన్

    కాబుల్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన, అక్కడికి రావాల్సిన అన్ని సైనిక, పౌర విమానాలు ఆగిపోయినట్లు పెంటగాన్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

    విమానాల రాకపోకలు ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది తెలియదని చెప్పారు.

    ప్రస్తుతం కాబుల్ విమానాశ్రయాన్ని అమెరికా బలగాలు రక్షిస్తున్నాయని పెంటగాన్ తెలిపింది.

    అమెరికా ప్రతిచర్యలలో ఇద్దరు సాయుధులు మరణించారని పెంటగాన్ ప్రకటించింది.

  13. అంతర్జాతీయ సమాజం స్పందించాలి: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

    అఫ్గానిస్తాన్‌లో తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని, మరిన్ని విషాదాలు జరగకుండా నివారించాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పిలుపునిచ్చింది.

    ‘‘అఫ్గానిస్తాన్‌లో మనం ఇప్పుడు చూస్తున్న విషాదాలను ముందే ఊహించి నివారించాల్సింది’’ అని ఆమ్నెస్టీ సెక్రటరీ జనరల్ ఆగ్నస్ కలామర్డ్ అన్నారు.

  14. అఫ్గానిస్తాన్ విమానాన్ని కూల్చేసిన ఉజ్బెకిస్తాన్ బలగాలు, అనుమతి లేకుండా చొరబడడం వల్లేనని స్పష్టం చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ

    అఫ్గానిస్తాన్‌కు చెందిన సైనిక విమానాన్ని తమ బలగాలు కూల్చివేశాయని ఉజ్బెకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    అఫ్గాన్ సైనిక విమానం అక్రమంగా తమ దేశ గగనతలంలోకి వచ్చిందని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని ఉజ్బెకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి బఖోరమ్ జుల్ఫికరోవ్ ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో చెప్పారు.

    అఫ్గాన్ సరిహద్దుల్లో ఉన్న ఉజ్బెకిస్తాన్ దక్షిణ రాష్ట్రం సుర్ఖోండర్యోలో ఆదివారం పొద్దుపోయాక ఆ విమానం కూలిపోయినట్లు తెలిపారు.

    విమానంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఎవరైనా బతికారా అనే విషయాలు జుల్ఫిఖరోవ్ వెల్లడించలేదు.

    అయితే, ఒకరు మాత్రం పారాచూట్‌తో దిగారని, గాయపడ్డారని తెలిపారు.

    మరోవైపు తమ దేశంలోకి చొరబడిన 84 మంది అఫ్గాన్ సైనికులను నిర్బంధించినట్లు ఉజ్బెకిస్తాన్ అధికారులు చెప్పారు.

  15. కాబుల్ వీధులు ఇప్పుడెలా ఉన్నాయంటే

    తాలిబాన్‌ల అధీనంలోని కాబుల్‌లో ప్రజల జీవనం ఎలా ఉందంటే తాలిబాన్‌లు అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌ను తమ అధీనంలోకి తీసుకున్న తరువాత అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో బీబీసీ వీడియో జర్నలిస్ట్ మాలిక్ ముదస్సిర్ వివరించారు.

    ఎటుచూసినా తాలిబాన్‌లే కనిపిస్తున్నారు. ట్రాఫిక్‌ను తాలిబాన్‌లే నియంత్రిస్తున్నారు.

    వారు కార్లను తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా పోలీస్, ఆర్మీకి సంబంధించిన వాహనాలను సోదా చేస్తూ వాటిని స్వాధీనం చేసుకుని తాము వాడుకుంటున్నారు.

    నగర ప్రధాన కేంద్రాలలో జన జీవనం సాధారణంగానే ఉంది. ట్రాఫిక్ మాత్రం బాగా తగ్గిపోయింది. ఒకటీఅరా తప్ప మిగతా దుకాణాలన్నీ మూసేసి ఉన్నాయి.

    తలకు స్కార్ఫ్, కోవిడ్ మాస్క్‌లు ధరించిన కొద్దిమంది మహిళలు కూడా వీధుల్లోకి రావడం కనిపించింది. తాలిబాన్‌లు వారినేమీ అనలేదు.

    నేను సెరెనా హోటల్‌లో ఉన్నాను. వీధుల్లో ఎక్కడా ఇంతకుముందులా సంగీతం వినిపించలేదు.

    నేనున్న హోటల్ ఇంతకుముందు మ్యూజిక్ ప్లే చేసేది కానీ తాలిబాన్‌లు ఆపించేశారు. ప్రజలు భయంభయంగా ఉన్నప్పటికీ కాబుల్‌లో నగర జీవనం ఎంతోకొంత కొనసాగుతోంది. అయితే, విమానశ్రయం వద్ద పరిస్థితులు మాత్రం భీతావహంగా ఉన్నాయి.

    ఎలాగైనా బయటపడాలని చాలామంది ప్రజలు ప్రయత్నిస్తున్నారు. కాబుల్ విమానశ్రయం ప్రధాన గేటు వద్దకు వెళ్లేసరికే అక్కడ పెద్ద ఎత్తున తాలిబాన్‌లు ఆయుధాలతో ఉంటున్నారు.

    జనం అక్కడికి రాగానే గాల్లోకి కాల్పులు జరుపుతూ తరిమేస్తున్నారు. అయినా, జనం మాత్రం ముళ్లకంచెలున్నా గోడలు దూకి లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

  16. అఫ్గానిస్తాన్: ప్రాణాలకు లెక్క చేయకుండా విమానాలకు వేలాడి వెళ్లేందుకు ప్రయత్నాలు

    కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికా మిలటరీ విమానం బయలుదేరడానికి సిద్ధమవుతున్నప్పుడు ప్రజలు దాన్ని పట్టుకుని, వేలాడుతూ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

    అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులకు ఆ వీడియోలు అద్దం పడుతున్నాయి.

    అమెరికా మిలటరీ విమానం టేకాఫ్ కోసం రన్‌వేపై వెళ్తుండగా వందల మంది దాని వెంట పరుగులు తీయడం, కొందరు విమానాన్ని పట్టుకుని వేలాడడం ఆ వీడియోలలో కనిపిస్తోంది.

    బీబీసీ ఈ వీడియోలను స్వయంగా ధ్రువీకరించలేదు.

    ఓ విమానానికి ఇలాగే వేలాడుతూ అది టేకాఫ్ అయిన తరువాత కింద పడి ఇద్దరు మరణించినట్లు కూడా చెబుతున్నారు. బీబీసీ దీన్ని ధ్రువీకరించలేదు.

  17. చైనా: ‘అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వంతో స్నేహసంబంధాలు కోరుకుంటున్నాం’

    అఫ్గానిస్తాన్ పాలనను తమ అధీనంలోకి తీసుకున్న తాలిబాన్‌లతో స్నేహసంబంధాలకు సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించిందని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ తెలిపింది.

    చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చ్యునింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘అఫ్గాన్ ప్రజలు తమ భవిష్యత్తును నిర్ణయించుకోవాలి. వారి హక్కులను చైనా గౌరవిస్తుంది. అఫ్గానిస్తాన్‌తో స్నేహపూర్వక, సహకార సంబంధాలు పెంపొందించుకునే దిశగా చైనా పనిచేస్తుంది’’ అన్నారు.

    అఫ్గానిస్తాన్‌లోని తమ రాయబార కార్యాలయాలను తెరిచే ఉంచాలని నిర్ణయించినట్లు చైనా ఇంతకుముందే ప్రకటించింది.

    తాలిబాన్ ప్రతినిధులు జులైలో చైనా వెళ్లి ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యీని కలిశారు.

    అఫ్గానిస్తాన్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం తమ విధానం కాదని చైనా చెప్పింది.

  18. ఏఏ దేశాలు తమ పౌరులను తరలిస్తున్నాయి

    అనేక పాశ్చాత్య దేశాలు అఫ్గానిస్తాన్‌లో ఉన్న తమ పౌరులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

    అఫ్గానిస్తాన్‌లో ఉన్న తమ పౌరులను, అఫ్గాన్ సహోద్యోగుల కుటుంబాలతో వచ్చిన తొలి విమానం ప్రేగ్‌లో ల్యాండ్ అయిందని చెక్ విదేశీ వ్యవహారాల మంత్రి ప్రకటించారు.

    అఫ్గానిస్తాన్‌లోని తమ పౌరులు, కొందరు అఫ్గాన్ ఉద్యోగులను తీసుకొచ్చేందుకు ఆదివారం సాయంత్రం నుంచి మిలటరీ విమానాలు వెళ్లివస్తున్నాయని జర్మనీ ప్రకటించింది.

    ఫ్రాన్స్, న్యూజీలాండ్ కూడా తమ పౌరులను అఫ్గానిస్తాన్ నుంచి స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పాయి.

  19. తాలిబాన్‌ల పాలనలో తొలి రోజు కాబుల్ ఎలా ఉందంటే, కాబుల్‌ వీధుల్లో సాయుధ తాలిబాన్‌లు

    కాబుల్‌లో నివసించే అఫ్గాన్ ప్రజలకు ఈ రోజు తాజా తాలిబాన్‌ల పాలనలో తొలి రోజు.

    ఆదివారం తాలిబాన్‌లు కాబుల్‌లో ప్రవేశించిన తరువాత అక్కడి ప్రభుత్వం కూలిపోయింది.

    అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం నుంచి కాబూల్ వీధుల్లో ఎటు చూసిన సాయుధ తాలిబాన్‌లే కనిపిస్తున్నారు.

    తాజా పరిస్థితులతో ఆందోళన చెందుతున్న ప్రజలు దేశం విడిచివెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

    పెద్ద సంఖ్యలో పౌరులు కాబుల్ విమానాశ్రయానికి పోటెత్తారు.

  20. కొత్త వీడియో విడుదల చేసిన తాలిబన్‌లు, అందులో ఏమన్నారంటే

    తాలిబాన్‌లు కాబూల్‌‌ను స్వాధీనం చేసుకుని, విజయం సాధించినట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత ఒక కొత్త వీడియో విడుదల చేశారు.

    అఫ్గానిస్తాన్ ప్రజల జీవితాలు మెరుగుపరిచే సమయం ఆసన్నమైందని ఆ వీడియోలో తాలిబాన్ నేత ముల్లా బరాదర్ చెప్పారు.

    “ఇక పరీక్షా సమయం ఆసన్నమైంది. మేం మొత్తం దేశంలో శాంతి స్థాపిస్తాం. జీవితాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాం” అని మిగతా తాలిబాన్ ఫైటర్లతో కూర్చున్న ముల్లా బరాదర్ ఆ వీడియోలో చెప్పారు.

    దేశంలో పరిస్థితి పూర్తిగా శాంతియుతంగా ఉందని, ఎక్కడా ఎలాంటి ఘర్షణలూ జరగడం లేదని తాలిబాన్ల ప్రతినిధి ఒకరు చెప్పారు.

    తమకు అందిన రిపోర్టుల ప్రకారం అంతా శాంతియుతంగా ఉందని ఆయన రాయిటర్స్‌కు చెప్పారు.