మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్ స్థాయి నియంత్రణ చర్యలు.. కోవిడ్ కట్టడికి కీలక నిర్ణయం -Newsreel

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

మహారాష్ట్రలో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మహారాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో పాటు మరిన్ని నియంత్రణ చర్యల అమలుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆ రాష్ట్ర మంత్రి అస్లామ్ షేక్‌ చెప్పారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో జరిగిన కేబినెట్ మీటింగ్ అనంతరం ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

వారాంతపు కర్ఫ్యూ, లాక్‌డౌన్ శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటుందని చెప్పారు.

50 శాతం సిబ్బందితోనే కార్యాలయాలు పనిచేయాలని.. మాల్స్, బార్‌లు, అత్యవసర సేవలతో సంబంధం లేని దుకాణాలు అన్నీ మూసివేయాలని సూచించారు.

అత్యవసర సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పారు.

సోమవారం రాత్రి 8 గంటల నుంచి ఇవన్నీ అమలులోకి వస్తాయని ఆ రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు.

కాగా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో ముంబయిలోని వలస కార్మికులు తమతమ స్వస్థలాలకు తరలిపోతున్నారు.

గత ఏడాది అనుభవాల నేపథ్యంలో వారంతా వెళ్లిపోతున్నారని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

జోర్డాన్‌ మాజీ క్రౌన్‌ ప్రిన్స్‌: నన్ను 'గృహ నిర్బంధం'లో ఉంచారు.. రాజుపై వ్యతిరేకత పెరిగితే నేను బాధ్యుడిని కాదు

అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకు తనను అణచివేసే కుట్ర జరుగుతోందని, తనను నిర్బంధించారని జోర్డాన్‌ మాజీ క్రౌన్‌ ప్రిన్స్‌ హమ్జా బిన్‌ హుసేన్‌ ఆరోపించారు.

ప్రస్తుతం హుసేన్‌ గృహనిర్బంధంలో ఉన్నారంటూ, ఆయన మాట్లాడిన ఓ వీడియోను ఆయన లాయర్‌ బీబీసీకి పంపారు.

జోర్డాన్‌ రాజు అబ్దుల్లాకు హమ్జా బిన్‌ హుసేన్‌ సవతి సోదరుడు అవుతారు. దేశ నాయకత్వంలో అవినీతి, అక్రమాలు, అసమర్ధతలపై ఆయన ఇటీవల తరచూ ఆరోపణలు చేస్తున్నారు.

'భద్రతా' కారణాల పేరుతో దేశంలోని పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఈ వ్యవహారం బయటికి వచ్చింది.

ప్రిన్స్‌ హమ్జా బిన్‌ గృహ నిర్బంధంలో ఉన్నారన్న వార్తలను సైన్యం అంతకు ముందు ఖండించింది. అయితే దేశ భద్రతకు ముప్పుకలిగించే వ్యవహారాలను ఆపాలని హమ్జాకు మిలిటరీ సూచించింది.

కానీ తాను ఎలాంటి చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడలేదని హమ్జా అన్నారు.

వీడియోలో ఏముంది?

"జోర్డాన్‌ సైన్యంలోని చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ నన్ను కలిశారు. నేను బయటకు వెళ్లడానికి వీలు లేదని, ఎవరినీ కలవడానికి అనుమతి లేదని ఆయన నాకు చెప్పారు. నేను ఇప్పటి వరకు కలుసుకున్న వ్యక్తులతో, వెళ్లిన ప్రదేశాలలో, సోషల్‌ మీడియాలో నేను ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మాట్లాడానని ఆయన నాకు చెప్పారు" అని హమ్జా శనివారం నాడు విడుదల చేసిన వీడియోలో వివరించారు.

"నేను ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎలాంటి కుట్ర చేయలేదు. గత పదిహేను ఇరవై ఏళ్లుగా ప్రభుత్వ వర్గాల్లో అసమర్ధత, అవినీతి రాజ్యమేలుతోంది. ప్రభుత్వం మీద ప్రజలు విశ్వాసం కోల్పోతే దానికి నేను బాధ్యుడిని కాను" అని పేర్కొన్నారు.

ఇంకా నిర్బంధంలో ఎవరెవరు?

శనివారం హమ్జాతోపాటు గృహ నిర్బంధంలోకి వెళ్లిన వ్యక్తులలో రాజకుటుంబానికి చెందిన షరీఫ్‌ హసన్‌ జాయెద్‌, మాజీ ఆర్ధికమంత్రి బసీమ్‌ అవదల్లా కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)