టాంజనియాలో చమురు ట్యాంకర్ పేలి 60 మంది మృతి

ఫొటో సోర్స్, Reuters
టాంజనియాలో చమురు ట్యాంకర్ పేలిన ఘటనలో 60 మందికిపైగా మృతిచెందారు. 70 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
మోరోగోరో ప్రాంతంలోని ప్రధాన రహదారిపై ఓ చమురు ట్యాంకర్ నుంచి చమురు తీసుకెళ్లేందుకు జనం పెద్దసంఖ్యలో చేరుకున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది.
దార్ ఎస్ సలామ్ ఓడరేవు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ప్రాంతం. ఈ ఓడరేవు నుంచి సరకులు, చమురు రవాణాకు ఇదే ప్రధాన మార్గం.
గాయపడినవారులో కొందరు చావుబతుకుల్లో ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు.
అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. చమురు దొంగిలించడానికి రానివారు కూడా పేలుడు సమయంలో సమీపంలో ఉండడంతో మరణించారని ప్రత్యక్ష సాక్షి డేనియల్ నొగాగో రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు.
మృతుల్లో ఎక్కువ మంది టాక్సీ డ్రైవర్లు, బైకు యజమానులేనని స్థానిక పోలీస్ చీఫ్ తాఫంగ్వా తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
ఆఫ్రికా దేశాలలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని.. ట్యాంకర్లు బోల్తాపడినప్పుడు కొందరు ప్రాణాలను లెక్కచేయకుండా అందులోని చమురు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక మీడియా ప్రతినిధులు చెబుతున్నారు.
గతవారం నైజీరియాలో ఇలాగే ఓ చమురు ట్యాంకర్ బోల్తాపడగా అందులోని ఆయిల్ కోసం వచ్చిన 45 మంది పేలుడు కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
నైజర్లో గత మే నెలలో 80 మంది ఇదే కారణంతో ప్రాణాలు కోల్పోయారు.
2010లో కాంగోలో ఇలాంటి ఓ ఘటనలో 292 మంది.. 2015లో దక్షిణ సూడాన్లో 203 మంది బోల్తాపడిన ట్యాంకర్ల నుంచి చమురు దొంగిలించే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
- టిక్టాక్ యాప్ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది?
- బిహార్, అస్సాం వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్లోని ఫొటోల్లో నిజమెంత
- ఆపరేషన్ కమల్: కర్ణాటకలో ముగిసింది, తర్వాత టార్గెట్ మధ్యప్రదేశ్, రాజస్థాన్?
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)

























