మూఢ నమ్మకాలు: అతీతశక్తుల కోసం కన్నబిడ్డల్ని చంపేందుకు సిద్ధపడ్డారు - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

అతీతశక్తుల కోసం భర్తతో కలిసి కన్నబిడ్డల్నే చంపేసేందుకు ఓ వివాహిత ప్రయత్నించినట్లు ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

''తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా రంగంపాళ్యం రైల్‌నగర్‌కు చెందిన రామలింగం(42), రంజిత(32) దంపతులు. వీరికి కుమారులు దీపక్‌ (15), కిషాంత్‌ (6) ఉన్నారు. రామలింగం చీరల వ్యాపారం చేసేవారు. తర్వాత ఇందుమతి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెను కూడా అదే ప్రాంతంలో తీసుకొచ్చి వేరే ఇంట్లో ఉంచాడు.

ఇందుమతి స్నేహితురాలు ధనలక్ష్మి (38) అప్పుడప్పుడు వీరింటికి వచ్చి వెళ్తుండేది. ఈ క్రమంలో రంజితతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారి స్నేహాన్ని గమనిస్తూ వచ్చిన రామలింగం... మీరిద్దరు శివుడు, పార్వతిలా ఉన్నారని చెప్పేవాడు. కొన్నాళ్లకు తాము పెళ్లి చేసుకుంటామని రంజిత, ధనలక్ష్మి తెలపగా రామలింగం అంగీకరించాడు.

ఇంట్లోనే తన కుమారుల ఎదుటే వారికి వివాహం చేశాడు. అనంతరం అతీతశక్తులు వస్తాయనే నమ్మకంతో ధనలక్ష్మిని నాన్న అని, రామలింగాన్ని మామ అని పిలవాలని కుమారులను చిత్రహింసలకు గురిచేశారు. పాఠశాలకు వెళ్లనివ్వకుండా ఇంట్లో పనులన్నీ పిల్లలతోనే చేయించారు.

శానిటైజర్‌ తాగించడం, ఒంటికి కారం పూసి ఎండలో పడుకోబెట్టడం వంటి దారుణాలకు పాల్పడ్డారు. చివరికి వారిని నరబలి ఇచ్చేందుకు రామలింగం, రంజిత, ధనలక్ష్మి యత్నించారు. ఈ విషయం వారి మాటల ద్వారా గ్రహించిన పిల్లలు, వెంటనే తమ తాత ఇంటికి పారిపోయి జరిగిన విషయాన్ని చెప్పారు.

కేసు నమోదు చేసిన పోలీసులు... రంజిత, ధనలక్ష్మి, రామలింగంలను ప్రశ్నిస్తున్నారు''అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఉరి వేసుకొని చనిపోయిన జాతీయ స్విమ్మర్‌

కరోనాతో ఏడాదికి పైగా ఉద్యోగం లేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన జాతీయ క్రీడాకారిణి, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్నారని సాక్షి ఓ కథనం ప్రచురించింది.

''జాతీయ స్థాయి క్రీడాకారిణి జి.బి.శిల్ప బాలరాజు (41) స్విమ్మింగ్‌లో ఉత్తమ ప్రతిభ చూపినందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏకలవ్య అవార్డు పొందారు. శిల్ప బెంగళూరు జయనగరలో నివాసముంటూ ఒక ప్రైవేట్‌ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. కరోనా కారణంగా స్కూల్‌లో ఆమెతో సహా పలువురు టీచర్లను తొలగించారు.

పనిలోకి చేర్చుకోవాలని శిల్ప పలుమార్లు పాఠశాల యజమాన్యానికి లేఖ రాసినా వారు పట్టించుకోలేదు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిటికీకి తాడుతో ఆమె ఉరి వేసుకున్నారు.

క్రీడాకారిణిగా జాతీయ స్థాయికి ఎదిగినప్పటికీ పాఠశాలలో ఒక ఉద్యోగం సంపాదించలేక పోయానని సూసైడ్‌ నోట్‌లో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం శిల్ప తల్లి మరణించారు’’అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఐసీయూలో బండ్ల గణేష్‌

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి కోవిడ్‌ బారిన పడినట్లుగా తెలుస్తోందని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

‘‘కరోనా ఫస్ట్ వేవ్‌లో టాలీవుడ్‌ తరపు నుంచి ఫస్ట్‌ కరోనా పాజిటివ్‌కి గురైన వ్యక్తిగా అప్పట్లో బండ్ల గణేష్‌ పేరు వినిపించింది.

ఇటీవల 'వకీల్‌ సాబ్‌' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో యాక్టివ్‌గా కనిపించిన బండ్ల గణేష్‌ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

జ్వరంతో పాటు కోవిడ్‌కి చెందిన మరికొన్ని లక్షణాలతో ఆయన తీవ్రంగా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లుగా సమాచారం.

అయితే అధికారికంగా మాత్రం బండ్ల గణేష్‌ ఫ్యామిలీ సభ్యులెవరూ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.’’అని ఆ కథనంలో పేర్కొన్నారు.

సినీ నిర్మాత దిల్ రాజుకు కరోనా పాజిటివ్

పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా టీంలోని ఒక్కొక్కరు వరుసగా కరోనా బారినపడుతున్నారని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

‘‘హీరోయిన్‌ నివేదా థామస్ ఇప్పటికే కరోనా బారినపడి కోలుకుంటోంది. పవన్ కల్యాణ్ క్వారంటైన్‌లో గడుపుతున్నారు.

తాజాగా వకీల్ సాబ్ సినిమా నిర్మాత దిల్‌రాజు‌కు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లారు.

హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన వేడుకకు ఆయన హాజరు కాలేకపోయారు. దర్శకుడు వీఎన్ ఆదిత్యతోపాటు మరో ఇద్దరు నిర్మాతలు కూడా కరోనా బారినపడ్డారు’’అని ఆ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)