తెలంగాణలో ప్రభుత్వ ఆఫీసులకు 'లాక్ ఓపెన్'... ఐటీ కారిడార్‌ పునః ప్రారంభం -ప్రెస్ రివ్యూ

ప్రచురణ

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలు ఇక యథావిధిగా కొనసాగనున్నాయని ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది. ‘‘లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన కార్యాలయాలన్నీ సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి.

అన్ని జోన్లలోనూ ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయి. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో ఉన్న కార్యాలయాల్లో వందశాతం ఉద్యోగులు హాజరవనున్నారు. రెడ్‌జోన్లలో 33 శాతం సిబ్బందితో మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయి.

రక్షణ, భద్రతా సర్వీసులు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ, పోలీస్‌, ఎక్సైజ్‌, కమర్షియల్‌ టాక్సులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, జైళ్లు, హోంగార్డులు, సివిల్‌ డిఫెన్స్‌, అగ్నిమాపక, అత్యవసర సేవలు, విపత్తుల నిర్వహణ, అనుబంధ సేవలు, ఎన్‌ఐసీ, కస్టమ్స్‌, ఎఫ్‌సీఐ, ఎన్‌సీసీ, ఎన్‌వైకే, పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ శాఖలు ఎలాంటి ఆంక్షలు లేకుండా పనిచేస్తాయి.

మరోవైపు హైదరాబాద్‌లో దాదాపు రెండు నెలల విరామం తర్వాత ఐటీ కారిడార్‌ కూడా తిరిగి ప్రారంభం కానుంది. సోమవారం నుంచి ఐటీ కంపెనీలు తెరుచుకోనున్నాయి.

పని ప్రదేశంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ, మూడో వంతు సిబ్బందితో కార్యకలాపాలు ప్రారంభించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఐటీ సంస్థలకు స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఐటీ రంగం కార్యకలాపాలకూ అనుమతి ఇచ్చింది. మొత్తం సిబ్బందిలో మూడో వంతు మంది కార్యాలయాలకు రావచ్చని, ఈ నెల 11 నుంచి కార్యకలాపాలు ప్రారంభించవచ్చని ఐటీ శాఖ కంపెనీలకు తెలియజేసింద’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

కేరళలో వలస కార్మికులు, పోలీసుల మధ్య ఘర్షణ

కేరళలో వలస కార్మికులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని ‘నమస్తే తెలంగాణ’ కథనం తెలిపింది. ఒరువతికొట్టాలో 700 మంది వలస కార్మికులు తమను సొంతూళ్లకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అయితే, పోలీసులు వలస కార్మికులను ఆందోళన విరమించాలని కోరారు. దీంతో కార్మికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.

ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

రోజు విడిచి రోజు స్కూలుకు.. కొత్త విధానానికి కసరత్తు

ఒక్కో విద్యార్థికి వారంలో కొద్దిరోజులు ప్రత్యక్ష బోధన, మరికొన్ని రోజులు ఆన్‌ లైన్, డిజిటల్‌ బోధన దిశగా కేంద్ర మానవ వనరుల శాఖ కసరత్తు చేస్తోందని ‘సాక్షి’ కథనం తెలిపింది.

‘‘లాక్‌డౌన్‌ ఎత్తివేశాక కూడా ఏడా ది వరకు భౌతికదూరం పాటించాల్సిందేనని వైద్య నిపుణుల అంచనా. అందుకు అనుగుణంగా కేంద్ర మానవ వనరుల అభి వృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) కసరత్తు ప్రారంభించింది.

లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే వేసవి సెలవుల తరువాత ప్రారంభమయ్యే పాఠశాల ల తరగతి గదుల్లో పాటించాల్సిన భౌతికదూరంపై సమగ్ర నివే దిక అందజేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌ సీఈఆర్‌టీ)ని ఆదేశించింది.

ఇప్పటికే ఉన్నత విద్యలో కనీసం 25% ఆన్‌లైన్‌ బోధన చేపట్టేలా కార్యాచరణ రూపొందించుకో వాలని యూజీసీ ఆదేశాలు జారీచేసింది.

ఈ నేపథ్యంలో పాఠశాల విద్యలోనూ చేయాల్సిన మార్పులపై ఎన్‌సీటీఈఆర్‌టీ నివేది కను రూపొందించి ఎంహెచ్‌ఆర్‌డీకి అందజేయనుంది.

మొదటి రోజు సగం మంది స్కూల్‌కు వస్తే.. రెండోరోజు ఆ విద్యార్థులు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్, డిజిటల్‌ పాఠాలు వింటారు.

రెండోరోజు స్కూ ల్‌కు వచ్చిన మిగతా సగం మంది విద్యార్థులు మూడో రోజు ఆన్‌లైన్, డిజిటల్‌ పాఠాలు వింటారు. ఇక రెండో రోజు ఇంట్లో ఉండి పాఠాలు విన్న విద్యార్థులు మూడోరోజు మళ్లీ స్కూల్‌కు వస్తారు.

ఇలా రోజు విడిచి రోజు ప్రత్యక్ష బోధన, ఆన్‌లైన్, డిజి టల్‌ బోధన చేపట్టేలా ఎన్‌సీఈఆర్‌టీ కసరత్తు చేస్తున్నట్లు తెలి సింది. తద్వారా రోజూ పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య సగానికి తగ్గుతుంద’’ని ఆ కథనంలో తెలిపారు.

40 నిమిషాల లిఫ్టులో నరకయాతన

హైదరాబాద్‌ మణికొండలో లిఫ్ట్‌లో చిక్కుకొని తండ్రీకూతురు నరకయాతన పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని ‘ఈనాడు’ కథనం తెలిపింది.

‘‘మే 7న ల్యాంకో హిల్స్‌ అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌ ఆకస్మాత్తుగా ఆగిపోవడంతో తండ్రీకూతురు అందులోనే చిక్కుకుపోయారు.

సాయం కోసం 40నిమిషాల పాటు కేకలు వేసినా ఎవరూ రాకపోవడంతో అతి కష్టం మీద తలుపులు తొలగించుకొని క్షేమంగా బయట పడ్డారు.

అనంతరం ల్యాంకో హిల్స్‌ అపార్ట్‌మెంట్‌ నిర్వాహకులు, సిబ్బందికి సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోకపోవడంతో తండ్రి శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన అపార్ట్‌మెంట్‌ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్‌ చేశారు’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)