వరంగల్ పసిపాపపై అత్యాచారం కేసు: దోషికి ఉరిశిక్ష, 51 రోజుల్లోనే కోర్టు తీర్పు - ప్రెస్ రివ్యూ

ఉరి తాడు

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి వరంగల్ కోర్టు ఉరిశిక్ష విధించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్త ప్రచురించింది.

సంచలనం రేపిన ఈ కేసులో ఘటన జరిగిన 51 రోజులకే కోర్టు తీర్పు వెలువడింది.

దోషిగా తేలిన పోలేపాక ప్రవీణ్‌కు మరణశిక్ష విధిస్తూ వరంగల్‌ మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం తీర్పునిచ్చింది. మూడు జీవిత ఖైదులు, 20 ఏళ్ల చొప్పున మరో రెండు జైలు శిక్షలు కూడా విధించింది.

తీర్పు వెలువరించడానికి అరగంట ముందు దోషి ప్రవీణ్‌తో న్యాయాధికారి మాట్లాడారు. 'తొమ్మిది నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసినట్లు నీపై నమోదు చేసిన నేరం రుజువైంది. నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా?' అని ప్రశ్నించారు. దానికి జవాబుగా 'ఏమో సార్‌.. తాగిన మైకంలో ఏం చేశానో తెలియదు' అని ప్రవీణ్‌ చెప్పాడు.

తీర్పు చదివిన వెంటనే కోర్టు హాలులోని న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు, సామాన్య ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బాధిత చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఉద్వేగంతో కళ్లనీళ్లు పెట్టుకున్నారు.

దోషి ప్రవీణ్‌ మాత్రం ఎలాంటి హావభావాలూ లేకుండా ఉండిపోయాడు.

అనంతరం, గట్టి బందోబస్తు మధ్య ప్రవీణ్‌ను పోలీసులు వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు.

హోటల్‌ వర్కర్‌గా పనిచేసే పోలేపాక ప్రవీణ్‌ అనే వ్యక్తి ఈ ఏడాది జూన్‌ 19న అర్ధరాత్రి హన్మకొండలోని కుమార్‌పల్లిలో అమ్మ పొత్తిళ్లలో నిద్రిస్తున్న తొమ్మిది నెలల పాపను ఎత్తుకెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేశాడు. తీవ్ర గాయాలకు గురైన చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.

ఈ కేసులో దోషిని కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్రంలో చాలా చోట్ల ఆందోళన ప్రదర్శనలు జరిగాయి. పోలీస్‌ కమిషనర్‌ విశ్వనాథ్‌ రవీందర్‌ కేవలం 21 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

బందరు పోర్టు

బందరు పోర్టు ఒప్పందం రద్దు చేసిన ఏపీ

బందరు పోర్టు నిర్మాణానికి మచిలీపట్నం పోర్టు లిమిటెడ్‌ (ఎంపీపీఎల్‌)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసుకున్నట్లు ఈనాడు దినపత్రిక కథనం రాసింది.

లీజు ప్రాతిపదికన బందరు పోర్టు నిర్మాణానికి ఇచ్చిన 412.57 ఎకరాల్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాత్రి ఆరు పేజీల ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం బందరు పోర్టు ప్రధాన అభివృద్ధిదారు (లీడ్‌ ప్రమోటర్‌)గా నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ వ్యవహరిస్తోంది.

ఒప్పందాన్ని ఉల్లంఘించడం, ఉద్దేశపూర్వకంగానే పోర్టు నిర్మించకుండా జాప్యం చేయడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వానికి నష్టం చేకూర్చినందుకు ఎంపీపీఎల్‌ నుంచి నష్ట పరిహారం వసూలు చేసే హక్కు తమకుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

2008 అక్టోబరులోనే 412.57 ఎకరాలు అప్పగిస్తే ఇప్పటివరకు అక్కడ పోర్టు నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టలేదని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఇండియన్‌ కాంట్రాక్ట్‌ యాక్ట్‌, 1872 ప్రకారం ఎంపీపీఎల్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు, స్థలాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. నష్టపరిహారం కూడా కోరనున్నామని జీవోలో వెల్లడించింది.

తెలంగాణ

తెలంగాణలో బైక్ అంబులెన్స్‌లు

రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు సత్వర చికిత్స అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ రెస్పాండర్లను అందుబాటులోకి తెచ్చినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

అంబులెన్సులు వెళ్లలేని ప్రాంతాలకు, ఇరుకు మార్గాల్లోకి వెళ్లి అత్యవసర సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జీవీకే ఈఎంఆర్‌ఐ సంయుక్తంగా దేశంలోనే తొలిసారిగా బైక్ అంబులెన్సులను ప్రవేశపెట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా 50 ఫస్ట్ రెస్పాండర్ల(108 బైక్ అంబులెన్సు)ను ఏర్పాటు చేశారు.

తొలుత హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఇప్పుడు అన్ని జిల్లాలకు ఈ వాహనాలను సమకూర్చారు.

ఐటీడీఏ పరిధిలలో 10 వాహనాలను ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెంచాలని సర్కారు యోచిస్తోంది.

ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి ప్రాథమిక చికిత్స అందించేందుకు అవసరమైన మందులను, పరికరాలను బైకులోని బాక్సులో సిద్ధంగా ఉంచారు.

రోడ్డు ప్రమాదాలు, పాముకాటు, అగ్ని ప్రమాదాలు, నీటిలో మునగడం, గుండెనొప్పి, పక్షవాతం, బీపీ, షుగర్, విషం తీసుకోవడం, వడదెబ్బ, ఆత్మహత్యా యత్నం, గర్భిణులకు అత్యవసర వైద్యం అందిస్తున్నారు.

ఈ బైక్ అంబులెన్సుపై ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(ఈఎంటీ) అందుబాటులో ఉంటారు. ఈ వాహనంలోనే ఆక్సిజన్ సిలిండర్‌తోపాటు బీపీ, షుగర్, జ్వరానికి సంబంధించిన పరికరాలు, మందులు, విషపు పురుగు విరుగుడుకు మందులు నెబులైజర్, ఇంజక్షన్లు, టానిక్‌లు, ట్యాబ్లెట్లు ఉంటాయి.

పోలవరం వరద

ఏపీ ప్రాజెక్టుల్లోకి పోటెత్తుతున్న వరద

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని సాగునీటి ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం పోటెత్తుతున్నట్లు సాక్షి దినపత్రిక ఓ కథనం రాసింది.

నదీ పరివాహక ప్రాంతాల్లో బుధవారం రాత్రి భారీ వర్షాలు కురవడంతో గురువారం మధ్యాహ్నానికి గోదావరి ఒక్కసారిగా మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద 44.20 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు.

మధ్యాహ్నం 12 గంటలకు పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహం 13 లక్షల క్యూసెక్కులకు చేరింది. కాఫర్‌ డ్యామ్‌ వద్ద వరద నీటి మట్టం 28.15 అడుగులకు చేరింది.

వరద పోటుతో దిగువ లంక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. కోనసీమలోని వైనతేయ గోదావరి నదీతీరంలోని లంక గ్రామాలను వరద మళ్లీ ముంచెత్తింది. రాజోలు నియోజకవర్గంలో వరద తగ్గుతున్నట్టే తగ్గి మళ్లీ పెరగడంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేవీపట్నంలో వరదనీరు మరోసారి పెరిగింది.

కృష్ణా నదిలో ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి మరింత పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 877 అడుగుల్లో 173.06 టీఎంసీలకు చేరుకుంది. వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగితే.. శనివారం శ్రీశైలం జలాశయంలోని నాలుగు గేట్లను ఒక్కొక్కటి 10 అడుగుల మేర తెరిచి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.

శ్రీశైలం కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌కు.. హంద్రీ-నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ల ద్వారా 96,401 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇలానే కొనసాగితే మరో వారం రోజుల్లో సాగర్‌ జలాశయం నిండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)