ఎల్ నినో: ఈ వాతావరణ ఉత్పాతంతో ఎండలు మండే ఏడాదిగా 2027 నిలవనుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బెన్ రిచ్, మార్క్ పాయింటింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
పసిఫిక్ మహాసముద్రంపై బలపడుతున్న ఎల్ నినో మరిచిపోలేని తీవ్ర వాతావరణ పరిస్థితిగా మారవచ్చని యూకే వాతావరణ శాఖ (మెట్ ఆఫీస్) హెచ్చరించింది.
ఈ శక్తిమంతమైన వాతావరణ ఉత్పాతం.. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను పెంచి, తీవ్ర వాతావరణ ముప్పునకు దారితీయవచ్చని పేర్కొంది. దీనికి మానవ ప్రేరిత వాతావరణ మార్పులు తోడవడంతో చరిత్రలోనే 2027వ సంవత్సరం.. అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఏడాదిగా నిలవనుందని మెట్ ఆఫీస్ హెచ్చరించింది.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ సరళి మారుతున్న దాఖలాలు పెరుగుతున్నాయి. భారత్లో రుతుపవన వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉండగా, అట్లాంటిక్ మహాసముద్రంలో తుపానుల ప్రభావం తగ్గింది.
యూకేలో భారీ వర్షాలు, తుపానులు వచ్చే ప్రమాదం ఉందని దీర్ఘకాలిక వాతావరణ అంచనాలు చూపుతున్నాయి.
"ఇలాంటి పరిణామం ఎన్నడూ చోటుచేసుకోలేదు అని మనం గమనించాలి" అని యూకే మెట్ ఆఫీస్లో దీర్ఘకాలిక అంచనాల విభాగాధిపతి ప్రొఫెసర్ ఆడమ్ స్కెయిఫ్ చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
ఎల్ నినో అంటే ?
ఎల్ నినో.. సహజంగా ఏర్పడే ఒక వాతావరణ సరళి. ప్రతి 2 నుంచి 7 ఏళ్లకు ఒకసారి సంభవించే ఈ వాతావరణ మార్పు ప్రభావం దాదాపు ఏడాది పాటు ఉంటుంది.
సూర్యుడి కిరణాలు భూమధ్యరేఖపై అధికంగా పడటం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి.
సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు నుంచి పడమరవైపు వీచే గాలులు (ట్రేడ్ విండ్స్) బలహీనపడటం లేదా బలపడటం ద్వారా వెచ్చని సముద్రపు జలాలను తూర్పుదిశగా తరలిస్తాయి.
సముద్రం నుంచి వాతావరణంలోకి వేడి విడుదల కావడం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వర్షాలు పడే విధానంలోనూ మార్పులు చోటుచేసుకుంటాయి.
పసిఫిక్లోని కీలక ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సగటు కన్నా 0.5 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే శాస్త్రవేత్తలు దానిని ఎల్ నినోగా ప్రకటిస్తారు.
ప్రస్తుత లెక్కల ప్రకారం ఇప్పుడు అక్కడ సగటు కన్నా 2 డిగ్రీల సెల్సియస్ పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది చివరినాటికి ఎల్ నినో గరిష్ఠస్థాయికి చేరుకునే సమయానికి అది 3 డిగ్రీల సెల్సియస్కు కూడా చేరుకోవచ్చని మెట్ కార్యాలయం తాజా అంచనాలు సూచిస్తున్నాయి.
లోతైన సముద్రజలాల్లో ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాలలో 100 మీటర్ల (330 అడుగులు) లోతులో సాధారణం కంటే దాదాపు 8 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎల్నినోను మరింత తీవ్రతరం చేయవచ్చు. ఈ వెచ్చని నీరు ఒక రిజర్వాయర్గా పనిచేస్తూ ఎల్ నినో బలోపేతం కావడానికి అవసరమైన ఉష్ణశక్తిని అందించవచ్చు.
"1950 నుంచి ఇలా ఎప్పుడూ జరగలేదు. 19వ శతాబ్దం నుంచి రికార్డులను పరిశీలించినా ఇదే శక్తిమంతమైంది. ఎల్ నినో బలపడేందుకు ఇంకా చాలా నెలల సమయం ఉంది. కాబట్టి ఇది రికార్డులు నమోదు చేయగలదని బలంగా నమ్ముతున్నాం." అని అమెరికా రీసెర్చ్ గ్రూప్ బెర్క్లే ఎర్త్ క్లైమేట్ సైంటిస్ట్ డా. జేకే హౌస్ఫాదర్ చెబుతున్నారు.
మరికొన్ని ఇతర వాతావరణ సంస్థలు మెట్ ఆఫీస్ లెక్కల కన్నా బలమైన ప్రభావాన్ని అంచనా వేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సగటు కన్నా 4 డిగ్రీలు పైనే ఉండొచ్చని చెబుతున్నాయి.
గత 500 లేదా 1000 ఏళ్లలోనూ ఇదే అత్యంత బలమైన ఎల్ నినోగా నిలిచే అవకాశముందని హౌస్ఫాదర్ అన్నారు. అంతకన్నా ముందు ఏం జరిగిందో గణించడం కష్టమే కాబట్టి ఈ మేరకు అంచనాకు వచ్చారు.

"ఇదే అత్యంత బలమైన ఎల్ నినో"
సముద్రంలో ఉష్ణోగ్రతల విస్తరణలో మార్పులు రావడం, గాలి ప్రవాహాల్లో తేడాలు రావడం ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో అనేక మార్పులు తీసుకొస్తాయి.
ఏ రెండు ఎల్ నినో ఘటనలు ఒకే రకంగా ఉండవు. వాతావరణంపై దాని ప్రభావం మారుతూ ఉంటుంది. ఆ మార్పును సూచించే నిదర్శనాలు ఉండనే ఉన్నాయి.
ఉదాహరణకు ఎల్ నినో సంవత్సరాలలో దక్షిణాసియాలో నైరుతి రుతుపవనాలు తక్కువ వర్షపాతాన్ని అందిస్తాయి. 2026లో ఇప్పటివరకు వర్షాలు సాధారణం కంటే తక్కువే నమోదయ్యాయి.
గాలి ప్రవాహంలో వచ్చే మార్పులతో కరీబియన్, ట్రాపికల్ అట్లాంటిక్ ప్రాంతాల్లో తుపానుల ప్రభావం తగ్గనుంది.
ఇప్పటివరకు ఈ సీజన్లో కేవలం మూడు తుపానులను మాత్రమే ప్రత్యేకించి గుర్తించారు.
ఇక ట్రాపికల్ పసిఫిక్కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎల్ నినో ప్రభావం అమితంగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో కరవులు, కార్చిచ్చులు.. పెరు, ఈక్వెడార్, దక్షిణ యూఎస్లో వరదలు సంభవించే ప్రమాదం ఉంది.
ఎల్ నినో సమయంలో సముద్రం నుంచి అధిక మొత్తంలో వాతావరణంలోకి వేడి విడుదల అవుతుంది.
దీనివల్ల ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల స్థాయి పెరుగుతుందని మెట్ ఆఫీస్ క్లైమేట్ సైంటిస్ట్ డాక్టర్ నిక్ డన్స్టోన్ అన్నారు. శీతాకాలం తర్వాత ఈ ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పారు.
కాబట్టి, 2024ను మించి 2027 అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసే ఏడాదిగా రికార్డు సృష్టించనుందని డాక్టర్ నిక్ వెల్లడించారు.
ఇప్పటికే ఆహార భద్రత కొరవడిన దేశాల్లోని కోట్లాది ప్రజల జీవితాలను ఎల్ నినో మరింత ఛిద్రం చేయగలదని ఆగస్టు తొలినాళ్లలో ఐరాసకు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
































