You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విశాఖ-గూగుల్ డేటా సెంటర్: ‘అభివృద్ధి చిహ్నం’గా ప్రభుత్వం చెబుతున్న ఈ ప్రాజెక్టులో ఏం జరుగుతోంది?- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 9 నిమిషాలు
విశాఖపట్నంలో గూగుల్ సంస్థ సుమారు రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న డేటా సెంటర్ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి చిహ్నంగా చెబుతోంది.
కానీ అదే ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, పర్యావరణం, నీటి వినియోగం, ఉద్యోగాలు, అనుమతుల ప్రక్రియ, పారదర్శకతపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కీలకమైన ఈ అంశాలను పరిశీలిస్తూ బీబీసీ చేసిన గ్రౌండ్ రిపోర్ట్ ఇది.
గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టులో గూగుల్, అదానీ, ఎయిర్ టెల్ ఏం చేస్తున్నాయి?
అసలు దీని చుట్టూ వివాదాలు ఏంటి ? వీటి గురించి ప్రశ్నించినప్పుడు ఇందులో భాగస్వాములైన సంస్థలు ఏం చెబుతున్నాయి?
గూగుల్, అదానీ, ఎయిర్ టెల్...
పేరుకి 'గూగుల్ డేటా సెంటర్' అయినా ఈ ప్రాజెక్టులో గూగుల్, అదానీ, ఎయిర్టెల్ భాగస్వాములు. అయితే ఈ మూడు సంస్థల పాత్రలు వేర్వేరు.
రైడెన్ ఇన్ఫోటెక్ ద్వారా టెక్నాలజీ, ఏఐ కంప్యూటింగ్, సర్వర్ల బాధ్యతలు గూగుల్ చూస్తోంది. డేటా సెంటర్ క్యాంపస్, భవనాలు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను అదానీ ఇన్ఫ్రా నిర్మిస్తోంది. నెక్స్టా నెట్వర్క్ కనెక్టివిటీ, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ను ఎయిర్టెల్ అందిస్తోంది.
ఈ మూడు సంస్థలకు కావలసిన భూమి కేటాయింపు, అనుమతులు, ప్రోత్సాహకాలు, రోడ్లు, విద్యుత్, నీరు మౌలిక వసతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రాజెక్టు అమలుకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా సమన్వయం చేస్తోంది.
డేటా సెంటర్ స్థలాల్లో ఏం జరుగుతోందంటే...
బీబీసీ బృందం గూగుల్ డేటా సెంటర్ కోసం భూమిని కేటాయించిన విశాఖలోని తర్లువాడ, అడవివరం...అనకాపల్లి జిల్లాలోని భూమిని కేటాయించిన తర్లువాడ, అడవివరం, రాంబిల్లి ప్రాంతాల్లో పర్యటించింది.
ఈ ప్రాంతాల్లో గూగుల్కు చెందిన రైడెన్ ఇన్ఫోటెక్, అదానీ ఇన్ఫ్రా భాగస్వామ్యంలోని ఏఐ డేటా సెంటర్ హబ్ కోసం మొత్తం 601.4 ఎకరాలు (2026లో సవరించిన కేటాయింపు ప్రకారం) కేటాయించారు. ఇందులో తర్లువాడలో 266.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, రాంబిల్లిలో 174.8 ఎకరాలు కేటాయించారు.
ప్రస్తుతం తర్లువాడ, రాంబిల్లిలో మట్టి పనులు జరుగుతున్నాయి. భారీ వాహనాల్లో మట్టి తరలింపు, భూమిని చదును చేయడం కనిపిస్తోంది. ఇక అడవివరంలోని సింహాచలం సమీపంలోని కొండ వద్ద కొంత డీఫారెస్టేషన్ చేసిన కొండ కనిపిస్తోంది.
ఈ మూడు చోట్లకు వెళ్లిన వారికి ముందుగా తాళాలు వేసిన గేట్లు, ఎవరు మీరంటూ ప్రశ్నించే వర్కర్లు లేదా గార్డులు తారసపడుతున్నారు. తర్లువాడ ప్రాజెక్టు ప్రాంతంలో నిత్యం పోలీసులు భద్రతావిధులు నిర్వహిస్తున్నారు.
మట్టిపనులు చేసే సిబ్బంది, కాపలా ఉన్న పోలీసులు డేటా సెంటర్ మట్టి పనులు జరిగే వైపు ఎవరైనా వస్తే వారిని ప్రశ్నిస్తున్నారు. అలాగే స్థానికులు పొలాలకు వెళ్లే మార్గాలను కూడా మళ్లిస్తున్నారు.
"మేం ఇంతక ముందు మా పొలాలకు ఈ దారిలో వెళ్లేవాళ్లం. ఇప్పుడు మమ్మల్ని ఈ కంపెనీ వాళ్లు వెళ్లనివ్వడం లేదు. పక్కదారుల్లో వెళ్తున్నాం. ఈ ప్రాజెక్టు కడుతున్న చోట మా భూములున్నాయి. ఇంకా డబ్బులు కూడా మాకు రావాల్సి ఉంది" అని తర్లువాడకు చెందిన కృష్ణమ్మ బీబీసీతో చెప్పారు.
విశాఖ డేటా సెంటర్ ఎన్ని ఉద్యోగాలిస్తుందంటే...
డేటా సెంటర్ ద్వారా ఐటీ పెట్టుబడులు పెరుగుతాయని విశాఖ ఏఐ హబ్గా ఎదుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. డేటా సెంటర్తో ఉపాధి అవకాశాలు పెద్ద సంఖ్యలో ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఉద్యోగాల సంఖ్యపై మాత్రం విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
"డేటా సెంటర్ల వల్ల వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని హామీ ఇవ్వడం సరైంది కాదు. ప్రత్యక్షంగా దాదాపు వెయ్యి ఉద్యోగాల వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ప్రారంభంలో అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తారు. తర్వాత స్థానికులకు అవకాశాలు పెరిగే అవకాశం ఉంది" అని విశాఖలో ఓ ఐటీ పరిశ్రమ యజమాని నరేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ఒక గిగావాట్ డేటా సెంటర్కు సగటున 500 ఉద్యోగాలే వస్తాయని, అవి కూడా ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి మాత్రమే దక్కుతాయని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అన్నారు. భారీ రాయితీలు ఇచ్చినా ఉద్యోగాలపై స్పష్టమైన హామీ లేదని ఆయన విమర్శించారు.
అంటే ప్రాజెక్టు పెట్టుబడి లక్షల కోట్లలో ఉన్నా, ప్రత్యక్ష ఉద్యోగాల సంఖ్యపై మాత్రం ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు.
పరిహారం...నిరీక్షణ
ఈ ప్రాజెక్టులో భూసేకరణ వివాదాస్పద అంశంగా మారింది.
తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం సేకరించిన భూముల్లో 160.31 ఎకరాలు దళితులకు ఇచ్చిన పట్టా భూములు ఉన్నాయి. వీరి వద్ద నుంచి భూసేకరణ చేసి...ఎకరానికి 40 లక్షల రూపాయలు, 20సెంట్ల భూమి, ఒక షాప్ తో పాటు కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ప్యాకేజ్ ప్రకటించారు. అయితే భూములిచ్చినవారిలో కొందరు మాత్రం తమకు సాంకేతిక కారణాలు చూపిస్తూ పరిహారం సొమ్ము ఇవ్వలేదని ఆరోపించారు.
సర్వే నంబర్లలో తప్పిదాల కారణంగా తమ భూముల పరిహారం వ్యవహారం పెండింగ్లో ఉన్నట్లు అధికారులు చెప్పారనని సందల అప్పారావు అనే స్థానికుడు బీబీసీతో చెప్పారు.
ఉద్యోగాల హామీల కంటే తమ భూములే తిరిగి కావాలని మరో రైతు కృష్ణమ్మ అన్నారు. ఇచ్చిన పరిహార సొమ్ము ఖర్చైపోయిందని...గతంలో భూముల ద్వారా వచ్చే జీవనోపాధి కోల్పోయామని ఆమె ఆవేదన చెందారు.
పర్యావరణంపై ఆందోళనలు
డేటా సెంటర్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం సింహాచలం కొండ, ముడసర్లోవ రిజర్వాయర్, కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ల సమీపంలో ఉండటంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకే ప్రాజెక్టైన గూగుల్ డేటా సెంటర్ని పర్యావరణ అనుమతులు సులభంగా పొందేందుకు రాంబిల్లి, తర్లువాడ, అడవివరంలో వేర్వేరు ప్రాజెక్టులుగా చూపిస్తున్నారని, వాస్తవానికి ఈ మూడు యూనిట్లు ఒకే ప్రాజెక్టులో భాగమని పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ బీబీసీతో అన్నారు.
15 బిలియన్ డాలర్ల ప్రాజెక్టు మొత్తం ప్రాంత భౌగోళిక స్వరూపాన్నే మార్చే అవకాశం ఉందని, అయినా ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రజలకు అందుబాటులో లేదని మానవ హక్కుల వేదికకు చెందిన వీఎస్ కృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాంబిల్లిలో పరిస్థితి ఎలా ఉంది?
ఒకప్పుడు వందలాది ఎకరాల కొబ్బరి తోటలున్న చోట...ఇప్పుడు భారీ లారీలు, బుల్డోజర్లు తిరుగుతూ మట్టిని తవ్వుతూ...దానిని తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి రాంబిల్లిలో.
గూగుల్ డేటా సెంటర్కు భూములు ఇవ్వడం వల్ల వాటి చుట్టుపక్కల గ్రామాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.
డేటా సెంటరుకి దగ్గరలో ఉన్న సమీప గ్రామాలను తరలించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల సమస్యలు, భవిష్యత్ ఉపాధిపై ఈ కంపెనీ తమకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
"డేటా కంపెనీలో కనీసం మాకు సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతి చిన్న పనికి బయట నుంచే మనుషులని పట్టుకొస్తున్నారు. స్థానికులకు కూలీ పని కూడా ఇవ్వడం లేదు" అని చిట్టిబాబు అనే స్థానికుడు చెప్పారు.
నీటి వినియోగంపై చర్చ
డేటా సెంటర్కు అవసరమైన నీటి సరఫరాపై కూడా చర్చ కొనసాగుతోంది. డేటా సెంటర్లోని సర్వర్లను కూల్గా ఉంచడానికి చాలా నీళ్లు కావాలి. ఏఐతో నడిచే డేటా సెంటర్లు 2027నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.7 ట్రిలియన్ గ్యాలన్ల నీటిని ఉపయోగిస్తాయని ఓ అధ్యయనం అంచనా వేసింది.
ఈ నేపథ్యంలోనే వైజాగ్ డేటా సెంటర్కు నీళ్లు ఎక్కడి నుంచి ఇస్తారనే చర్చ జరుగుతోంది.
పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత డేటా సెంటరుకి కావాలసిన నీటిని సులభంగా అందిస్తామని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. ఈ ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు ఇప్పటికే లభించాయని అన్నారు.
దీనిపై ఈఏఎస్ శర్మ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. డేటా సెంటర్ ఇటీవల వచ్చింది. పోలవరం నుంచి వచ్చే ప్రతి లీటరు నీటిని ఏయే పరిశ్రమకి, ఎంతెంత ఇవ్వాలో ఎప్పుడో లెక్కలేశారని...ఈ నేపథ్యంలో డేటా సెంటర్కి పోలవరం నీళ్లిస్తే...తాగు నీటితో పాటు పరిశ్రమల అవసరాల దృష్ట్యా నీటి కొరత ఏర్పడే అవకాశముందని ఆయన అన్నారు.
గ్రౌండ్ వాటర్ను వినియోగించకుండా సముద్ర జలాలను డీశాలినేషన్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి ఉపయోగించే ప్రణాళిక ఉంటే భూగర్భ జలాలపై ప్రభావం ఉండదని ఐటీ పరిశ్రమ యజమాని నరేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ప్రజలతో చర్చ జరిగిందా?
ప్రాజెక్టు విషయంలో అత్యధికంగా వినిపిస్తున్న ప్రశ్న ప్రజలతో ఎంత మేరకు సంప్రదింపులు జరిగాయన్నదే.
పారదర్శకంగా పబ్లిక్ కన్సల్టేషన్ నిర్వహించి పర్యావరణ అధ్యయనాలను బహిర్గతం చేయాలని పర్యావరణ కార్యకర్త దీక్ష... బీబీసీతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు.
"మా ఊరి నుంచి ఇన్ని భూములు తీసుకున్నారు, కానీ మా ఊరికి ఏం లాభం? ఏమైనా ఉద్యోగాలు వస్తాయా? అసలు ఇక్కడ ఏం కంపెనీ పెడుతున్నారనే విషయాలను స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, అధికారులుగానీ మాతో మాట్లాడిందే లేదు. మేం మీడియాలో చూసి ఇక్కడ ఏ కంపెనీ వస్తుందో, అదేం చేస్తుందో తెలుసుకుంటున్నాం" అని తర్లువాడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి సాయి తరుణ్ బీబీసీతో అన్నారు.
పరిహారం సొమ్ము కోసం...
డేటా సెంటర్ ప్రభావం తర్లువాడ గ్రామంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు తర్లువాడ గ్రామం ఎక్కడుందో తెలియని పరిస్థితి నుంచి అందరూ ఈ గ్రామం గురించి మాట్లాడుకునేటట్టు డేటా సెంటర్ చేసింది. మరో వైపు డేటా సెంటరుకు భూములిచ్చిన రైతులకు అందిన పరిహారం సొమ్ము ఇప్పుడు దొంగల టార్గెట్గా మారిందని తర్లువాడ గ్రామస్థులు చెబుతున్నారు.
"మా ఊరిలో దొంగతనాలే జరిగేవి కావు. కానీ గూగుల్ కంపెనీకి భూములు ఇవ్వడం వల్ల వచ్చిన డబ్బులు కోసం ఈ మధ్య దొంగతనాలు పెరిగాయి. దీంతో రాత్రి సమయంలో ఏ చిన్న అలికిడైనా మాకు కంగారు వస్తుంది. సరిగా నిద్రపోలేకపోతున్నాం. నాకు ఇంకా డబ్బులు రాలేదు. కానీ వస్తే ఏమవుతుందా అని భయంగా ఉంది" అని తర్లువాడ గ్రామానికి చెందిన లక్ష్మీ బీబీసీతో అన్నారు.
''నాకు 65 సంవత్సరాలు. ఇప్పటివరకు మా ఊరిలో దొంగల ఊసే ఉండేది కాదు. ఇప్పుడు కొత్తగా దొంగల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ కంపెనీ వచ్చిన తర్వాత నుంచే ఇది మొదలైంది'' అని రైతు లక్ష్మణరావు బీబీసీకి చెప్పారు.
తర్లువాడ మాజీ సర్పంచ్ బీఆర్బీ నాయుడు మాత్రం ప్రాజెక్టు వల్ల ప్రాంత అభివృద్ధి వేగవంతమైందన్నారు. రోజూ కనీసం ఆరేడు రాష్ట్రాలకు చెందిన కార్లు తమ గ్రామంలో తిరుగుతున్నాయని చెప్పారు.
ఒక డేటా సెంటర్... రెండు జిల్లాలు... మూడు ప్రాంతాలు...
ఒకవైపు రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడితో విశాఖను ఏఐ కేంద్రంగా మార్చే ప్రయత్నం, మరోవైపు భూసేకరణ,
పర్యావరణం, నీటి వినియోగం, ఉద్యోగాలు, అనుమతుల ప్రక్రియ, పారదర్శకతపై ప్రశ్నలు.
ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం బీబీసీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థలను సంప్రదించేందుకు ప్రయత్నించింది. ప్రభుత్వంలోని ఐదు శాఖలను ఫోన్లు, ఈమెయిల్స్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేసింది.
గూగుల్ సంస్థకు కూడా జూన్ 24వ తేదీన మెయిల్ ద్వారా సందేహాలను ప్రశ్నలను పంపించింది. అయితే ఈ కథనం ప్రచురించే సమయానికి వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
సాధారణంగా సందేహాలకు సమాధానాల కోసం గూగుల్ను ఆశ్రయిస్తాం. కానీ ఈసారి ప్రశ్నలే గూగుల్ గురించి. .
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)