అమెరికా: నాష్విల్లే పాఠశాలలో మహిళ కాల్పులు.. ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు మృతి

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock
అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రం నాష్విల్లేలోని కావెనంట్ ప్రాథమిక పాఠశాలలో ఒక మహిళ జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. వీరిలో ముగ్గురు తొమ్మిదేళ్ల వయసున్న విద్యార్థులు. మిగతా ముగ్గురూ పాఠశాల సిబ్బంది. వారిలో ఒకరి వయసు 60 ఏళ్లు, ఇద్దరి వయసు 61 సంవత్సరాలు.
స్థానిక కాలమానం ప్రకారం మార్చి 27న కాల్పులు జరిగాయి.
కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. ఆ వ్యక్తి ట్రాన్స్జెండర్ పర్సన్ ఆడ్రీ హేల్గా గుర్తించారు.
ఆడ్రీ వయసు 28 ఏళ్లు. ఆడ్రీ ఈ పాఠశాల మాజీ విద్యార్థిని.
కావెనంట్ పాఠశాల ఒక ప్రైవేటు క్రైస్తవ పాఠశాల. ఇక్కడ మూడు నుంచి 12 ఏళ్ల వయసున్న విద్యార్థులు చదువుకొంటారు. ఏదో తెలియని తీవ్రమైన అసంతృప్తే బడిలో కాల్పులకు ఆడ్రీని పురిగొల్పి ఉండొచ్చని నాష్విల్లే పోలీసు చీఫ్ జాన్ డ్రేక్ ఎన్బీసీ న్యూస్తో చెప్పారు. ఆడ్రీ విచక్షణరహితంగా కాల్పులు సాగించారని తెలిపారు.
ఆడ్రీ వద్ద ఉన్న 'ప్రణాళిక'లో వివిధ ప్రదేశాలు ఉన్నాయని, వాటిలో కావెనంట్ స్కూల్ ఒకటని చెప్పారు. నాష్విల్లే మృతుల గౌరవార్థం అమెరికా పతాకాన్ని మార్చి చివరి వరకు సగం మేర అవనతం చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలతో అమెరికా ప్రభుత్వ భవనాలు, మైదానాలు, అమెరికా రాయబార కార్యాలయాల్లో అమెరికా పతాకం సగం ఎత్తులోనే కనిపిస్తుంది.
బైడెన్ ఆదేశాలు శుక్రవారం సూర్తాస్తమయం వరకు అమల్లో ఉంటాయి.
