You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

అదానీ - హిండెన్‌బర్గ్ కేసు: సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం

అదానీ – హిండెన్‌బర్గ్ అంశంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయటానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.

లైవ్ కవరేజీ

  1. మార్చిలో సిద్ధం కానున్న భారత మొదటి 22 స్మార్ట్ నగరాలు

    కొన్ని సంవత్సరాలుగా చర్చల్లో నిలిచిన స్మార్ట్ సిటీ పథకం ఇప్పుడు అంతిమ దశకు చేరుకుంది.

    భారత్‌లోని మొదటి 22 స్మార్ట్ నగరాలు వచ్చే నెలలో అంటే మార్చిలో సిద్ధం కానున్నాయని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

    మొత్తం 7,804 ప్రాజెక్టుల్లో 5246 ప్రాజెక్టులు పూర్తయ్యాయని ఫిబ్రవరి 6న పార్లమెంట్‌లో ప్రభుత్వం వెల్లడించింది.

    ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి దాదాపు 98 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రకటించింది.

    స్మార్ట్ నగరాల జాబితా: భోపాల్, ఇండోర్, ఆగ్రా, వారణాసి, భువనేశ్వర్, చెన్నై, కోయంబత్తూర్, ఈరోడ్, రాంచీ, సాలెమ్, సూరత్, ఉదయ్‌పూర్, విశాఖపట్నం, అహ్మదాబాద్, కాకినాడ, పుణే, వెల్లూర్, పీంపరీ, మధురై, అమరావతి, తిరుచిరాపల్లి, తంజావూరు.

    2015లో కేంద్ర ప్రభుత్వం, ‘స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్’ను ప్రవేశపెట్టింది. స్మార్ట్ సిటీ అనే పదానికి ఎలాంటి నిర్దిష్ట నిర్వచనం లేదని పేర్కొంది. కానీ, ఎంపిక చేసిన 100 నగరాల్లోని ప్రజలు జీవనాన్ని మెరుగుపరిచేందుకు నిధులు అందజేస్తామని హామీ ఇచ్చింది.

  2. బడ్జెట్ 2023: లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో వచ్చే మార్పులు ఏంటి, కొత్తగా పాలసీ తీసుకునే వాళ్లు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ పరంగా అనేక కీలకమైన విషయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది జీవిత బీమా పాలసీలకు జోడిచిన అదనపు పన్ను.

    కొత్త నియమం ప్రకారం, ఒక పాలసీ పరిమితి ముగిసే సమయానికి పాలసీదారుడు చెల్లించిన ప్రీమియం మొత్తం ఐదు లక్షలకు పైగా ఉంటే.. ఆ పాలసీ కాలపరిమితి దాటాక వచ్చిన మొత్తం ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది. 2023 ఏప్రిల్ 1 నుంచీ ఆరోగ్య బీమా తీసుకునేవారికి ఈ మార్పు వర్తిస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న పాలసీల నుంచీ వచ్చే మొత్తానికి ఈ నియమం వర్తించదు.

    ఈ కొత్త నియమం పాలసీదారులను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునే ముందు ఈ నియమం ఎలా పని చేస్తుందో ఒక ఉదాహరణ చూద్దాం.

  3. నేడు మహిళల ప్రీమియర్ లీగ్ వేలం.. అందరి కళ్లు స్మృతి, హర్మన్‌లపైనే..

    మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం నేడు ముంబయిలో జరుగనుంది.

    మార్చి 4 నుంచి 16 వరకు డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇదే డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్.

    డబ్ల్యూపీఎల్‌లో అయిదు జట్లు పాల్గొంటాయి.

    వేలం కోసం 1525 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. అందులో నుంచి 448 ఆటగాళ్లు వేలంలోకి వస్తారు.

    వేలంలో గరిష్టంగా 90 మంది ప్లేయర్లను లీగ్‌లు కొనుగోలు చేస్తాయి.

    ప్రతీ జట్టులో కనీసం 15, గరిష్టంగా 18 ప్లేయర్లు ఉండొచ్చు.

    ప్రతీ జట్టు ఆరుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇలా జరిగితే టోర్నీ మొత్తంలో 30 మంది విదేశీ ఆటగాళ్లు అందుబాటులోకి వస్తారు.

    టోర్నీలో మొత్తం 22 మ్యాచ్‌లు జరుగుతాయి.

    ప్రతీ జట్టు ఆటగాళ్ల కోసం గరిష్టంగా రూ. 12 కోట్లు ఖర్చు చేయవచ్చు.

    వేలంలో క్రికెటర్ల కనీస ధర రూ. 10 లక్షలతో మొదలవుతుంది.

    10 మంది భారత క్రికెటర్లు సహా అత్యధిక ధర పలికే ప్లేయర్లు 24 మంది ఉన్నారని క్రిక్ ఇన్ఫో పేర్కొంది.

    వేలంలో భారత క్రీడాకారులైన హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ, రేణుక సింగ్, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, పూజ, రిచా ఘోష్, స్నేహ్ రాణా, మేఘనా సింగ్‌లపై అందరి దృష్టి నిలిచింది.

    వేలంలో అతి పిన్న వయస్కులుగా షబ్నమ్, విన్నీ, సోనమ్ యాదవ్ నిలవగా 41 ఏళ్ల లతిక కుమారి ఈ లీగ్‌లో పాల్గొననున్న అతిపెద్ద వయస్కురాలు కానుంది.

  4. తుర్కియేలో మరోసారి భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదు

    తుర్కియేలో మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) వెల్లడించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    తుర్కియేలోని దక్షిణాది పట్టణమైన కహరమన్‌మారస్ ఈ భూకంపం సంభవించినట్లు తెలిపింది.

    కాగా తుర్కియే, సిరియాలలో ఇప్పటి వరకు భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 34 వేలకు చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారని కూడా ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.