శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని హరిపురం గ్రామంలో ఇద్దరు మహిళలపై ట్రాక్టర్ తో కంకర పోసిన ఘటన కలకలం సృష్టించింది.
వారిపై కంకరు పోసిన తర్వాత...ఆ కంకరులో ఉండిపోయిన మహిళలు మమ్మల్ని రక్షించడంటూ కేకలు వేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
మహిళలు ‘చచ్చిపోతున్నాం, కాపాడండి’ అంటూ వేడుకుంటుంటే... ‘చచ్చిపో పర్లేదు’ అనే వాయిస్ కూడా ఈ వీడియోలో వినిపిస్తోంది.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం గ్రామానికి చెందిన కొట్ర దాలమ్మ, ఆమె కుమార్తె మజ్జి సావిత్రికి...అదే కుటుంబానికి చెందిన కొట్రా ఆనందరావు, కొట్ర రామారావు అనే వ్యక్తుల మధ్య ఆస్తి వివాదం ఉంది.
ఈ వివాదంపై తాను కోర్టుకు కూడా వెళ్లినట్లు కొట్ర దాలమ్మ బీబీసీతో చెప్పారు. తమ స్థలం కొంత కబ్జాకు గురైందని దాలమ్మ అన్నారు.
“హరిపురంలో మాకు కొంత స్థలం ఉంది. కుటుంబ పంపకాల్లో మాకు అది వచ్చింది. అయితే మాకు పంపకాల్లో వచ్చిన స్థలంలో కొట్ర ఆనందరావు, రామారావులు పునాది తీశారు. దానిపై మేం ఆడగడానికి వెళ్లాం. వెళ్లగానే మాపై అక్కడ ఉన్న ట్రాక్టరు మట్టిని పోసేశారు. దానిలో మేం కురుకుపోయాం. కాపాడండి అని అరుస్తూంటే...పట్టించుకోలేదు. కొద్ది సేపటి తర్వాత ఊరి జనాలు వచ్చి పారలతో తవ్వి, మమ్మల్ని ఆ మట్టి నుంచి బటయకు తీశారు. మేం పోలీసులకు ఫిర్యాదు చేశాం” అని దాలమ్మ చెప్పారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఇంటి స్థలం కోసం పోరాటం చేస్తున్నామని కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రి చెప్పారు.
2019లో ఈ స్థలం కోసం నిరాహార కూడా చేశామని చెప్పారు.
తమకి హక్కులు కలిగి ఉన్న తమ భూమి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
ఈ వివాదం మొదలై ఏడళ్లు అయ్యిందని, ప్రస్తుతం వివాదంపై కోర్టులో కేసు ఉందని చెప్పారు.
“మా స్థలంలో పునాది తీశారు. పునాది తీసిన స్థలం విషయంలోనే కోర్టులో కేసు వేశాం. ఇప్పుడు అక్కడే నిర్మాణాలు చేపట్టారు. అందుకే ఆడగడానికి వెళ్తే మాపై కంకరు పోశారు. అలాగే చంపేస్తామని బెదిరిస్తున్నారు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి” అని మరో బాధితురాలు మజ్జి సావిత్రి చెప్పారు.
కోర్టు ఆర్డర్ కోసం చూస్తున్నాం: పోలీసులు
హరిపురంలోని ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల మధ్య ఈ స్థలవివాదం చోటు చేసుకుందని మందస పోలీస్ స్టేషన్ ఎస్ఐ వై. రవి కుమార్ బీబీసీతో చెప్పారు.
మహిళలు ఇద్దరు తమపై కంకరు పోసిన విషయంపై ఫిర్యాదు చేశారని చెప్పారు.
“దాలమ్మ, సావిత్రి ఇద్దరు కూడా వివాదమున్న స్థలంలో ఏదైనా నిర్మాణం చేపడుతన్నారనే విషయంలో చూసేందుకు వెళ్లామని, అక్కడికి వెళ్లగానే వారిపై ట్రాక్టరుతో కంకరుపోశారని ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఫిర్యాదు స్వీకరించి రీసిట్ కూడా అందించాం. అయితే ఈ కేసు కోర్టులో ఉన్నందుకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చాం. వారి ద్వారా కోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లి, కోర్టు ఆదేశం మేరకు చర్యలు తీసుకుంటాం” అని ఎస్పై రవికుమార్ చెప్పారు.
అలాగే కొట్ర రామారావు, ఆనందరావులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ వారి అందుబాటులోకి రాలేదు.