ప్రధానిగా మోదీకి ఉన్న పేరు 'హిందూ విరోధి' - సుబ్రణియన్ స్వామి
బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రణియన్ స్వామి ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ఆయన హిందూ వ్యతిరేకి అని అన్నారు.
"ప్రధానిగా మోదీ ట్రాక్ రికార్డు 'హిందూ విరోధి'. ఆయన బీజేపీ మ్యానిఫెస్టోను అమలు చేయడం లేదు. రామ మందిరం విషయంలో సుప్రీంకోర్టు తీర్పులో జాప్యం, రామసేతుకు ప్రాచీన వారసత్వ సంపద హోదా ఇవ్వకపోవడం, ఉత్తరాఖండ్లోని పురాతన దేవాలయాలను స్వాధీనం చేసుకోవడం, 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని రద్దు చేయకపోవడం... ఇవన్నీ మోదీ హిందూ-వ్యతిరేక విధానాలకు ఉదాహరణలు" అంటూ ట్వీట్ చేశారు.
సుబ్రణియన్ స్వామి తరచూ బీజేపీని, ప్రధానిని విమర్శిస్తూ ఉంటారు.
జ్ఞాన్వాపి మసీదుకు సంబంధించి, ముస్లింలు దేశ చట్టాన్ని గౌరవించాలని కూడా స్వామి అన్నారు.
"ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని ముస్లిం లీగ్ డిమాండ్ చేయడం వల్లే విభజన జరిగింది. తరువాత, భారత్లో ఉండిపోయిన ముస్లింలు భారత రాజ్యాంగానికి లోబడి ఉండేందుకు అంగీకరించారు. కాబట్టి జ్ఞాన్వాపి మసీదును హిందువులకు తిరిగి ఇచ్చేయాలని కోర్టు చెబితే, ముస్లింలు దాన్ని గౌరవించాలి" అంటూ ట్వీట్ చేశారు.