న్యుయార్క్లోని షాపింగ్ మాల్లో దుండగుడు ఉద్దేశపూర్వకంగా నల్లజాతీయులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడని నగర మేయర్ తెలిపారు.
బఫెలో సూపర్ మార్కెట్లో 10 మందిని కాల్చి చంపినట్లు అనుమానిస్తున్న వ్యక్తి కావాలనే నల్లజాతి జనాభా ఎక్కువగా ఉన్న చోటును ఎంచుకున్నాడని అధికారులు తెలిపారు.
అనుమానితుడు 18 ఏళ్ల పేటన్ జెండ్రాన్ ఈ దాడి చేయడానికి 320 కి.మీ కంటే ఎక్కువ దూరం డ్రైవ్ చేసుకుని వచ్చినట్టు చెప్పారు.
ఈ దాడిని జాతి వివక్షతో కూడిన హింసాత్మక చర్యగా పరిగణిస్తూ, ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
"సాధ్యమైనంత ఎక్కువమంది నల్లజాతీయుల ప్రాణాలు హరించాలనే" ఉద్దేశంతోనే దుండగుడు అక్కడకు చేరుకున్నాడని బఫెలో నగర మేయర్ బైరాన్ బ్రౌన్ తెలిపారు.
అధికారుల కళ్లుగప్పి అనుమానితుడు ఈ దాడిని ఎలా జరిపాడని విచారిస్తున్నారు.
జెండ్రాన్ గత జూన్లో తన హైస్కూల్లో కాల్పులు జరుపుతానని బెదిరించినట్టు ఒక అధికారి అసోసియేట్ ప్రెస్కు తెలిపారు. ఆ తరువాత, అతడికి మానసిక ఆరోగ్య పరీక్షలు జరిపారు.
జెండ్రాన్ రాసిన 180 పేజీల పత్రం ఒకటి వెలుగులోకొచ్చింది. అందులో తాను ఫాసిస్టునని, తెల్లజాతీయుల ఆధిపత్యాన్ని విశ్వసిస్తానని రాసుకున్నాడు.
దాడికి ముందురోజు నిందితుడు ఆ ప్రాంతాన్ని సర్వే చేశాడని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.
ఈలోగా, ఆన్లైన్లో అతివాద ధోరణులను ప్రేరేపించే కంటెంట్పై తమ కార్యాలయం దృష్టి సారిస్తుందని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ తెలిపారు.
"ఒక తెలివితక్కువ, మందబుద్ధి గల, విద్వేషాన్ని విషంలా ఎక్కించుకున్న వ్యక్తి చేసిన చర్య ఇది" అని ఆమె అన్నారు.
కాల్పులు జరిపిన 13 మందిలో 11 మంది నల్లజాతీయులని పోలీసులు తెలిపారు. వారిలో తన కొడుకు పుట్టినరోజుకు కప్కేక్స్ కొనడానికి వచ్చిన వ్యక్తి ఉన్నారు. అలాగే, ఆస్పత్రిలో తన భర్తను చూసి వచ్చాక షాపింగ్కు వచ్చిన ఒక మహిళ ఉన్నారు.