నేటి ముఖ్యాంశాలు
అంతర్జాతీయం
- నాటోలో చేరుతామని ఫిన్లాండ్ ప్రకటించింది. తమ దేశానికి సభ్యత్వం ఇవ్వాలని నాటోకు దరఖాస్తు పెట్టుకుంటామని ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సనా మారిన్, అధ్యక్షుడు సౌలి నినిస్తో ప్రకటించారు.
- ఫిన్లాండ్ నాటోలో చేరితే అది పొరపాటు అవుతుందని అంతకు ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు.
- ఫిన్లాండ్ ప్రకటనకు కొన్ని గంటల తరువాత, స్వీడన్ కూడా నాటోలో చేరుతామని ప్రకటించింది. స్వీడన్ నాటోలో చేరేందుకు మద్దతు ఇస్తామని ఆ దేశ అధికార పార్టీ ప్రకటించింది. అయితే, అణ్వాయుధాలు, నాటో స్థావరాలు తమ దేశంలో ఉండాలని కోరుకోవట్లేదని ఆ పార్టీ తెలిపింది.
- పాకిస్తాన్లో పెషావర్లోని సర్బంద్ ప్రాంతంలో సిక్కు వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
- ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు ఆండ్రూ సైమండ్స్ శనివారం రాత్రి ఓ కారు ప్రమాదంలో చనిపోయారు.
- అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఓ షాపింగ్ మాల్లో దుండగుడు జరిపిన తుపాకీ కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
జాతీయం
- థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ చరిత్ర సృష్టించింది. 14 సార్లు చాంపియన్ అయిన ఇండోనేసియాపై నెగ్గి, తొలిసారి ఈ చాంపియన్షిప్లో విజేతగా నిలిచింది.
- థామస్ కప్ గెలిచిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ భారత జట్టుకు కోటి రూపాయల నగదు బహుమతి నజరానాగా ప్రకటించారు.
- కాంగ్రెస్ పార్టీకి ప్రజలతో ఉన్న కనక్షన్ తెగిపోయిందని, దీన్ని అంగీకరించి, మళ్లీ సంబంధాలను పునరుద్ధరించుకోవాలని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 'నవ్ సంకల్ప్ శివిర్' ముగిసింది.
- త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీజేపీ త్రిపుర అధ్యక్షుడు మాణిక్ సాహా సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
- గత 24 గంటల్లో కొత్తగా 2487 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 13 మంది కోవిడ్తో చనిపోయారు. అయితే, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 17,692కు తగ్గింది.
స్థానికం
- కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తెలంగాణ రాష్ట్ర సమతి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు నిధుల కేటాయింపు విషయంలో అమిత్ షా పచ్చి అబద్దాలు ఆడారని విమర్శించారు.
- సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ పరిధిలో వాహనాల తనిఖీ చేస్తుండగా, ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ నుంచి ముంబైకి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్టు కోదాడ పట్టణ సీఐ నరసింహారావు బీబీసీకి తెలిపారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.