రెండు సార్లు ప్రధాని కావడమంటే జీవితంలో అన్ని
సాధించినట్లేనని ఒక సీనియర్ ప్రతిపక్ష నేత తనతో అన్నారని ప్రధాని నరేంద్ర మోదీ
చెప్పుకొచ్చారు.
కానీ, దేశంలో వంద శాతం సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా
చూడటమే తన లక్ష్యమని ఆయన అన్నారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన మరొకసారి ప్రధాని
కావాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
గుజరాత్లో జరిగిన ఒక కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొని
మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఒక రోజు ఒక సీనియర్ నేత నన్ను కలిశారు. రాజకీయంగా ఆయన మమ్మల్ని
తరచూ వ్యతిరేకిస్తుంటారు. అయినా నేను ఆయనను గౌరవిస్తా.
ఇటీవల కొన్ని విషయాలు నచ్చక, ఆయన నన్ను కలవడానికి వచ్చారు.
ఈ దేశం నిన్ను రెండు సార్లు ప్రధానిని చేసిందని, అంతకంటే నీకు ఏం కావాలంటూ ఆయన
నన్ను అడిగారు.
ఒకరు రెండు సార్లు ప్రధాని కావడమంటే జీవితంలో అన్నీ సాధించినట్లే
అన్నది ఆయన ఉద్దేశం.’ అంటూ మోదీ చెప్పుకొచ్చారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్
పవార్ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్న తీరుతో అసంతృప్తికి గురైన ఎన్సీపీ నేత శరద్ పవార్ కొద్ది రోజుల కిందట మోదీని కలిశారు.
ఈ నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని
సంతరించుకున్నాయి.