You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కేసీఆర్, ప్రశాంత్ కిశోర్ భేటీ: టీఆర్ఎస్ కోసం ఐపాక్ పనిచేస్తుందని చెప్పిన కేటీఆర్

అయితే, టీఆర్ఎస్ ఐపాక్‌తో మాత్రమే పనిచేస్తుందని, ప్రశాంత్ కిశోర్‌తో కాదని... ప్రశాంత్ కిశోర్, ఐపాక్ రెండూ ఇప్పుడు వేర్వేరని కేటీఆర్ చెప్పారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. లూహాన్స్క్ ప్రాంతంలో రష్యా దాడుల్లో ఎనిమిది మంది పౌరుల మృతి

    యుక్రెయిన్‌లోని తూర్పు లూహాన్స్క్ ప్రాంతంలో రష్యా చేస్తున్న షెల్లింగ్ కాల్పుల్లో ఎనిమిది మంది పౌరులు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారని ఆ ప్రాంత గవర్నర్ సెర్హీయ్ హాయ్‌దాయ్ చెప్పారు.

    హిర్స్కీ, జోలోటీ పట్టణాలపై శనివారం రష్యా జరిపిన బాంబుదాడుల్లో ఆరుగురు చనిపోయారని ఆయన టెలిగ్రామ్ పోస్ట్‌లో రాశారు.

    పొపాస్నా పట్టణంలో కొద్ది రోజుల కిందట రష్యా దాడుల్లో కూలిపోయిన ఒక ఇంటి శిథిలాల కింద ఇద్దరు మహిళల మృతదేహాలు లభించాయి.

    సెవెరోడోనెస్క్క్ నగరంలోని పోలీస్ స్టేషన్ కూడా ధ్వంసమైందని హాయ్‌దాయ్ తెలిపారు.

    ఇంతకుముందు.. యుక్రెయిన్ రాజధాని కీయెవ్ సహా ఆ దేశ ఉత్తర భూభాగాన్ని చుట్టుముట్టే ప్రయత్నంలో విఫలమైన రష్యా.. లూహాన్స్క్, దాని పొరుగు ప్రాంతమైన దోన్యస్క్‌లను స్వాధీనం చేసుకోవటంపై దృష్టి కేంద్రీకరిస్తామని ప్రకటించింది.

  2. మీ పిల్లలకు వేదగణితం నేర్పించండి: ‘మన్ కీ బాత్’లో మోదీ

    ‘‘తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు వేదగణితం నేర్పించాలని నేను కోరుతున్నా. దీనివల్ల వారి ఆత్మవిశ్వాసం పెరగటమే కాకుండా వారి మెదడు విశ్లేషణ శక్తి కూడా పెరుగుతుంది. గణితం అంటే పిల్లల్లో ఏదైనా భయముంటే అది కూడా పూర్తిగా తొలగిపోతుంది’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల ‘మన్ కీ బాత్’లో సూచించారు.

    ఈ కార్యక్రమం సందర్భంగా వేదగణితంలో ఆసక్తి ఉన్న కోల్‌కతాకు చెందిన గౌరవ్ టేక్రివాల్‌తో ప్రధాని మాట్లాడారు. ఆయనకు వేదగణితం మీద ఎలా ఆసక్తి కలిగిందని ప్రశ్నించారు.

    దీనికి గౌరవ్ బదులిస్తూ.. తను కాట్ పరీక్షలకు తయారవుతున్నపుడు తన తల్లి.. వేదగణితం అనే పేరున్న స్వామి భారతికృష్ణా తీర్థ్ జీ మహరాజ్ పుస్తకం ఒకటి తెచ్చి ఇచ్చారని, అందులో ఇచ్చిన 16 ఫార్ములాలతో గణితం చాలా సులవవుతుందని చెప్పారు.

    వేదగణితం ద్వారా అత్యంత కష్టమైన లెక్కలనైనా రెప్పపాటులో చేసేయవచ్చునని మోదీ పేర్కొన్నారు.

  3. హనుమాన్ చాలీసా ఎప్పుడు రాశారు.. దీని వెనుక చరిత్ర ఏమిటి?

  4. నకిలీ లోన్ యాప్‌లతో జాగ్రత్త: తెలంగాణ పోలీస్ హెచ్చరిక

    అవసారల్లో ఉన్నవారికి రుణాలు ఇస్తామంటూ ఆశపెట్టి, భారీ వడ్డీలు వసూలు చేయటమే కాకుండా వేధింపులకు పాల్పడే నకిలీ లోన్ యాప్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ప్రజలను హెచ్చరించింది.

    ఈమేరకు ఒక ట్వీట్ చేస్తూ.. లోన్ యాప్‌లకు యూజర్ల ఫోన్‌లో కాంటాక్టులను యాక్సెస్ చేయటానికి అనుమతివ్వటం వల్ల.. యాప్‌లకు సంబంధించిన వారు యూజర్ల బంధువులు, స్నేహితులకు కూడా ఫోన్లు చేసి లోన్ కట్టాలని వేధిస్తారని పోలీసులు వివరించారు.

    ఆర్‌బీఐ దృష్టిలో ఉన్న 137 ఫేక్ లోన్ యాప్‌ల జాబితాను ఈ ట్వీట్‌తో పాటు పోలీసులు షేర్ చేశారు. వీటితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

  5. ‘నిజమైన స్వాతంత్ర్యం’ కోసం ఇస్లామాబాద్‌కు పాదయాత్ర: ఇమ్రాన్ ఖాన్

    ‘నిజమైన స్వాతంత్ర్యం’ ఇస్లామాబాద్ నగరానికి పాదయాత్ర చేపట్టటానికి సిద్ధంగా ఉండాలని పార్టీ సంస్థలన్నిటికీ పిలుపునిచ్చినట్లు పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

    ఆయన శనివారం ఇస్లామాబాద్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అయితే ఇస్లామాబాద్ పాదయాత్ర ఎప్పుడు చేపట్టేదీ తేదీని వెల్లడించలేదు. త్వరలోనే ఈ యాత్ర చేపడతామని చెప్పారు.

    ఇప్పుడు తమ పార్టీ, సంస్థలు దేశ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం నిలబడకపోతే భావి తరాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన అన్నారు.

    దేశ ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని కూడా ఇమ్రాన్ డిమాండ్ చేశారు.

  6. అమిత్ షా.. దిల్లీని మత హింస నుంచి కాపాడలేకపోయారు: శరద్ పవార్

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. దిల్లీని మత హింస నుంచి కాపాడలేకపోయారని నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ విమర్శించారు.

    ఆయన శనివారం నాడు కొల్హాపూర్‌లో ఒక బహిరంగ సభలో మాట్లాడారు.

    ‘‘కొన్ని రోజుల కిందట దిల్లీ నగరం మత ఉద్రిక్తతలతో రగలిపోయింది. దిల్లీలో (ముఖ్యమంత్రి) అరవింద్ కేజ్రీవాల్ పాలన ఉన్నప్పటికీ అక్కడి పోలీసు విభాగం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కింద ఉంటుంది. నగరాన్ని మత హింస నుంచి కాపాడటంలో అమిత్ షా విఫలమయ్యారు’’ అని పవార్ పేర్కొన్నారు.

    ఇటీవల హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా దిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో మత హింస చోటుచేసుకుంది.

    ‘‘దిల్లీలో ఏమైనా జరిగితే ఆ సందేశం ప్రపంచానికి చేరుతుంది. దిల్లీలో అశాంతి నెలకొందని ప్రపంచానికి తెలుస్తుంది’’ అని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మత ఉద్రిక్తతలు సర్వసాధారణంగా మారాయని ఆయన విమర్శించారు.

    ప్రపంచంలో ఎవరైనా అగ్రనాయకుడు భారతదేశానికి వస్తే కేవలం గుజరాత్‌కు మాత్రమే ఎందుకు తీసుకెళుతున్నారని కూడా పవార్ ప్రశ్నించారు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్.. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి తన పర్యటన ప్రారంభించారు.

  7. దేశంలో 2,593 కొత్త కోవిడ్ కేసులు నమోదు

    భారతదేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 2,593 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల మరో 44 మంది చనిపోయారు.

    అంతకుముందు రోజు దేశంలో 2,527 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, 33 మంది చనిపోయారు.

    ఇప్పటివరకూ దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.30 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 5.22 లక్షలు దాటింది.

    ఇదిలావుంటే.. దేశ రాజధాని దిల్లీలో శనివారం నాడు కోవిడ్ 1,042 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 4.82 శాతానికి పెరిగింది.

    దీంతో రాజధానిలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించటం తప్పనిసరి అంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.

  8. ఒడెసా మీద క్షిపణి దాడుల్లో మూడు నెలల పాప సహా 8 మంది మృతి

    యుక్రెయిన్‌లోని ఒడెసా నగరం మీద రష్యా చేసిన క్షిపణి దాడిలో మూడు నెలల వయసున్న ఓ చిన్నారి సహా ఎనిమిది మంది పౌరులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

    ఈ దక్షిణాది రేవు నగరంలోని ఓ సైనిక స్థావరంతో పాటు, రెండు నివాస భవనాల మీద రెండు క్షిపణి దాడులు జరిగాయని యుక్రెయిన్ సైన్యం తెలిపింది.

    ఈ ప్రాంతంలో క్షిపణి దాడులు చేశామని రష్యా నిర్ధారించింది.

    ఒడెసా సమీపంలోని సైనిక వైమానిక స్థావరంలో యుక్రెయిన్ సదుపాయాల కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణశాఖ తెలిపిందని టాస్ వార్తా సంస్థ చెప్పింది.

    నివాస భవనాల మీద దాడి గురించి టాస్ ప్రస్తావించలేదు. అయితే.. పౌరలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నామన్న ఆరోపణను రష్యా ఇంతకుముందు నిరాకరించింది.

    ఒడిసాలో క్షిపణి దాడుల్లో చనిపోయిన తల్లీబిడ్డల ఫొటోలు, వీడియోలను పలువురు జర్నలిస్టులు, ఇతరులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

    ఆ తల్లి పేరు వలేరియా అని, ఆమె మూడు నెలల వయసు కూతురు పేరు కీరా అని యుక్రెయిన్ బీబీసీ జర్నలిస్ట్ మిరోస్లావా పెట్సా ట్విటర్‌లో వివరాలు పోస్ట్ చేశారు.

  9. మరియుపూల్‌లో మా సైనికులను చంపేస్తే రష్యాతో శాంతి చర్చలు ముగిసినట్లే: జెలియెన్‌స్కీ

    మరియుపూల్‌లోని అజోవస్తల్ ఉక్కు కర్మాగారంలో తలదాచుకుంటున్న యుక్రెయిన్ సైనికులను రష్యా కనుక హతమారిస్తే.. రష్యాతో శాంతి చర్చల నుంచి యుక్రెయిన్ ప్రతినిధులు వైదొలగుతారని ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ హెచ్చరించారు.

    ‘‘మరియుపూల్‌లో మా సైనికులను కనుక చంపేస్తే, ఎలాంటి చర్చల ప్రక్రియ నుంచైనా యుక్రెయిన్ వైదొలగుతుంది’’ అని ఆయన విలేకరులతో పేర్కొన్నారు.

    యుక్రెయిన్ మెరైన్లు, వివాదాస్పద అజోవ్ రెజిమెంట్ సభ్యులు, బోర్డర్ గార్డులు, పోలీసు అధికారులతో మరియుపూల్ రక్షణ బృందం తయారైంది. కొన్ని వారాలుగా రష్యా దాడిలో ఉన్న మరియూపూల్‌లో యుక్రెయిన్ సైనికులు కొద్ది మందే మిగిలి ఉన్నారు.

    వారు తలదాచుకుంటున్న ఉక్కు కర్మాగారంలో పౌరులు కూడా ఆశ్రయం పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    యుక్రెయిన్‌లో ఛాందస మితవాద బృందంగా మొదలై ఆ తర్వాత నేషనల్ గార్డులో చేర్చుకున్న అజోవ్ రెజిమెంట్ విడుదల చేసిన ఒక వీడియోలో.. మహిళలు, పిల్లలు ఒక గదిలో గుమిగూడి ఉండటం, తమ వద్ద ఆహారం, నీళ్లు నిండికున్నాయని, తమని అక్కడి నుంచి తరలించాలని వేడుకోవటం కనిపిస్తోంది.

    కీయెవ్‌లోని మెట్రోలో జెలియెన్‌స్కీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యాంశాలివీ...

    • అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లిన్కెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌లు ఆదివారం నాడు కీయెవ్‌లో పర్యటించనున్నట్లు జెలియెన్‌స్కీ తెలిపారు. అమెరికా ఇంకా దీనిని నిర్ధారించలేదు.
    • రష్యా ఆక్రమించిన ఖేర్సన్ నగరంలో స్వాతంత్ర్యంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించినా కూడా తాము రష్యాతో చర్చల నుంచి వైదొలగుతామన్నారు.
    • శాంతి చర్చల కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవటానికి తాను సిద్ధంగా ఉన్నానని జెలియెన్‌స్కీ చెప్పారు.
  10. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవండి.