45 శాతం కుంచించుకుపోనున్న యుక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ
యుద్ధం వల్ల యుక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ 45 శాతం వరకు కుంచించుకు పోనుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
కరోనావైరస్ వ్యాప్తి సమయంలో తూర్పు యూరప్, మధ్య ఆసియాలపై పడిన ప్రభావం కంటే ఈ యుద్ధ ప్రభావమే ఆర్థిక వ్యవస్థలపై ఎక్కువగా ఉండే అవకాశముందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
మరోవైపు వరుసగా విధిస్తున్న ఆంక్షలతో రష్య ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలు కానున్నట్లు వెల్లడించింది.
యుద్ధం వల్ల చాలా మంది ప్రజలు యుక్రెయిన్ను వీడిపోతున్నారు. వ్యాపార సంస్థలను మూసివేశారు. రోడ్లు, పరిశ్రమలు, ప్రధాన వాణిజ్య సముదాయాలు ధ్వంసమయ్యాయి.
యుక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ మునుపటికి రావడానికి ఏళ్ల సమయం పడుతుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.
గోధుమ, పొద్దుతిరుగుడు పువ్వుల ఎగుమతుల్లో యుక్రెయిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, యుద్ధం వల్ల వీటి దిగుబడిపై ప్రభావం పడింది. దీంతో ప్రపంచంలో చాలా చోట్ల వీటి ధరలు పెరిగాయి.
ఆంక్షల వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ కూడా 11 శాతం కుంచించుకుపోనున్నట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.