You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ కలకలం.. మహారాష్ట్రలో తొలి కేసు గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుతున్నాయని అనుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్లు కలకలం రేపుతున్నాయి. కొత్తరకం వేరియంట్ ఎక్స్‌ఈ ఇప్పుడు భారత్‌లోనూ బయటపడింది. మరింత వేగంగా వ్యాపించే లక్షణం ఈ వేరియంట్‌కు ఉందని చెబుతున్నారు.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ and పృథ్వి రాజ్

  1. తాజా పరిణామాలు సంక్షిప్తంగా...

    • యుక్రెయిన్‌పై యుద్ధం చేసి, బుచా నగరంలో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు రష్యాపై అదనపు ఆంక్షలు విధించాలని అమెరికా భావిస్తోంది. రష్యా ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యులనూ లక్ష్యంగా చేసుకుంటోంది.
    • ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ మాట్లాడారు. భద్రతా మండలి నుంచి రష్యాను తొలగించి, దీనిని ప్రక్షాళన చేయాలని కోరారు. లేదంటే భద్రతా మండలిని రద్దు చేయాలని అన్నారు.
    • రష్యా తను ఎలాంటి యుద్ధనేరాలకూ పాల్పడలేదనే మాటను పునరుద్ఘాటించింది. బుచా నగరంలో రోడ్ల మీద మృతదేహాలు కనిపిస్తున్నాయనే వాదనను ఐరాసలో రష్యా రాయబారి పదే పదే తిరస్కరించారు.
    • రష్యా సైనికులు పౌరులను హత్య చేస్తున్నాయన్న ఆరోపణలతో అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈయూ సభ్య దేశమైన స్పెయిన్ రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించింది.
    • యుక్రెయిన్‌లోని తూర్పు డోన్బాస్ ప్రాంతంలో రష్యా రాబోయే కొన్ని వారాల్లో కొత్తగా సైనిక దాడి ప్రారంభించే అవకాశముందని నాటో సెక్రటరీ జనరల్ జెన్సెన్ స్టోలెన్‌బర్గ్ చెప్పారు.
    • యుక్రెయిన్‌లో యుద్ధం కారణంగా 71 లక్షల మందికి పైగా జనం నిర్వాసితులయ్యారు. రష్యా దండయాత్ర వల్ల మొత్తంగా కోటి మందికి పైగా జనం తమ ఇళ్లు వదిలి పారిపోయారు.
    • యూరోపియన్ కమిషన్, రష్యా మీద మరో విడత ఆంక్షలను ప్రతిపాదించింది. ఆ దేశం నుంచి బొగ్గు దిగుమతులపై నిషేధం విధించటం కూడా ఈ ఆంక్షల్లో ఉంది.
    • శ్రీలంకలో ఎమర్జెన్సీని ఎత్తేశారు. పెరిగిన ధరల నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుండటంతో అక్కడి ప్రభుత్వం అత్యయిక స్థితిని విధించింది.
    • భారతదేశంలో ఈ రోజు కూడా పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు 80 పైసలు చొప్పున పెరిగాయి. గత 16 రోజుల్లో పెట్రోలు ధర లీటరుకు రూ.10 పెరిగింది.
    • భారతదేశంలో మంగళవారం నాటికి కోవిడ్ వ్యాక్సీన్ల సంఖ్య 185 కోట్లు దాటిందని ప్రభుత్వం ప్రకటించింది.
    • భారతీయ జనతా పార్టీ బుధవారం 42వ స్థాపనా దినోత్సవాన్ని జరుపుకుంటోంది.
  2. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్!బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.