యుక్రెయిన్లో రష్యా మారణహోమానికి
పాల్పడిందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్స్కీ ఆరోపించారు.
రష్యా, యుక్రెయిన్పై దాడికి పాల్పడిన
తర్వాత తొలిసారి ఆయన ఐక్యరాజ్యసమితిని ఉద్దేశించి ప్రసంగించారు. రష్యా బలగాలు పౌరులను
చంపాయని, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డాయని అన్నారు.
రష్యా బలగాలు చేసిన అకృత్యాలు
అన్నింటినీ ఆయన ఏకరువు పెట్టారు.
ట్రాన్స్లేటర్ల సహాయంతో జెలియెన్స్కీ
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మాట్లాడారు. బుచా నగరంలో వారు పాల్పడని నేరమంటూ లేదని
చెప్పారు.
బుచాలోని వీధుల్లో, ఇళ్లలో ప్రజల్ని
కాల్చి చంపారు. బావుల్లోకి నెట్టివేశారు. రోడ్లమీద ట్యాంకులతో తొక్కించారు. ఇదంతా
రష్యా సైనికులు కేవలం ఆనందం కోసమే చేశారు.
రష్యా చర్యలు, ఇస్లామిక్ స్టేట్
తీవ్రవాద గ్రూపు చర్యలను తలపిస్తున్నాయని అన్నారు.
భద్రతా మండలి అందించే భద్రత ఏది? శాంతి
ఎక్కడ? ఐక్యరాజ్యసమితి అందించే హామీలు ఏవి? అని ఆయన ప్రశ్నించారు.
‘‘యుక్రెయిన్లోని ఇతర ప్రాంతాల్లో
రష్యా మిలిటరీ పాల్పడిన యుద్ధ నేరాలను ఇంకా ప్రపంచం చూడలేదు. ప్రాంతం మారిపోయి
ఉండొచ్చు, కానీ క్రూరత్వం మాత్రం అదే. నేరాలు కూడా అవే. దీనికి రష్యా బాధ్యత
వహించాలి’’ అని అన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ అంతర్జాతీయ న్యాయస్థానంలో
విచారణకు హాజరు కావాల్సిందే అని డిమాండ్ చేశారు.
గత 41 రోజులుగా యుక్రెయిన్లో రష్యా
చేస్తోన్న అకృత్యాలకు బుచా ఒక ఉదాహరణ మాత్రమే అని చెప్పిన ఆయన అక్కడి భయంకర పరిస్థితులకు
సంబంధించిన వీడియోను భద్రతా మండలి సభ్యులకు చూపించారు.
‘‘ఒక నిమిషం పాటు సాగిన వీడియోలో మరణించిన,
దారుణమైన స్థితిలో ఉన్న యుక్రెయిన్ల దేహాలు కనిపించాయి. ఆ చిత్రాలు కలిచివేసే
విధంగా ఉన్నాయి’’ అని యూకే ప్రతినిధి డేమ్ బార్బరా వుడ్వర్డ్ అన్నారు.