చైనా అతిపెద్ద నగరం షాంఘై లాక్‌డౌన్: రెండేళ్లలో ఇదే తొలిసారి.. తొమ్మిది రోజులు కరోనా పరీక్షలు

కరోనా మహమ్మారి ప్రారంభమైన రెండేళ్ల కాలంలో చైనాలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో లాక్‌డౌన్ విధించడం ఇదే తొలిసారి. గత నెల రోజులుగా కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

లైవ్ కవరేజీ

రాజేశ్ పెదగాడి and ఆలమూరు సౌమ్య

  1. బైడెన్ ప్రసంగంపై పోలండ్ విదేశాంగ శాఖ స్పందన

    పోలండ్

    ఫొటో సోర్స్, EPA

    ఫొటో క్యాప్షన్, వార్సాలో మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలండ్ రాజధాని వార్సాలో ప్రసంగిస్తూ, పుతిన్ "ఇక అధికారంలో కొనసాగలేరు" అని అన్నారు.

    "ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశానికి అధ్యక్షుడు వార్సాకు వచ్చి ప్రసంగించారు. సూటిగా, స్పష్టంగా రష్యా దూకుడు గురించి మట్లాడారు" అని పోలండ్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూకాస్ జసీనా బీబీసీతో అన్నారు.

    "నియంతను మార్చేందుకు ఒక సమయం ఉంటుందని బైడెన్ రష్యన్లతో అన్నారు. ఇది (బైడెన్ ప్రసంగం) చాలా లోతైన, కదిలించిన అనుభవం. ప్రపంచ సమాజంలోకి పుతిన్‌ను తిరిగి ఆహ్వానించలేం. ఆయన మాటలు ఇక వినలేం. ఆయన నమ్మదగిన భాగస్వామి కారు" అని లూకాస్ అన్నారు.

    యుక్రెయిన్‌తో సరిహద్దులు పంచుకునే పోలండ్, ఈ సంక్షోభ సమయంలో యుక్రెయిన్‌కు కీలక సహాయం అందించింది. సుమారు 20 లక్షల మంది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చింది.

  2. కీయెవ్ వాసులకు అరుదైన వినోదాన్ని పంచిన యుక్రెయిన్ సైనికుల బ్యాండ్

    యుక్రెయిన్ సైనికులు తమ బ్యాండ్‌తో ఒక కచేరీ నిర్వహించి కీయెవ్ నివాసులను ఆశ్చర్యంలో ముంచారు.

    నగరం నడిబొడ్డున నిర్వహించిన ఈ కచేరీలో యుక్రెయిన్ జాతీయ గీతంతో పాటు కొన్ని క్లాసిక్ పాప్ మ్యూజిక్ గీతాలను కూడా వినిపించారు.

    యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి అన్ని రకాల వినోద సాధానాలు మూసివేయబడ్డాయి. లైవ్ మ్యూజిక్ అరుదైన ముచ్చట అయిపోయింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. 'బైడెన్‌కు సందేశం పంపడం కోసమే ఎల్వివ్‌పై దాడులు' - నగర మేయర్

    ఎల్వివ్, యుక్రెయిన్

    ఫొటో సోర్స్, EPA

    శనివారం ఎల్వివ్ నగరంపై భారీ రాకెట్ దాడులు జరిగాయి. యుక్రెయిన్ తూర్పుభాగం పైనే ఎక్కువగా దృష్టి సారిస్తామని రష్యా చెబుతున్నప్పటికీ, పశ్చిమం వైపు లక్ష్యాలుగా చేసుకున్న నగరాల్లో ఎల్వివ్ కూడా ఒకటి.

    ఇప్పటివరకు ఎల్వివ్ నగరం ప్రశాంతంగానే ఉంది. యుద్ధం నుంచి తప్పించుకునేవారికి ఎల్వివ్ నగరం సురక్షితంగా నిలిచింది.

    అమెరికా అధ్యక్షుడు జో బైడన్ పోలండ్‌ను సందర్శిస్తున్న సందర్భంలోనే ఎల్వివ్‌పై దాడి జరిగిందని, ఇది బైడెన్‌కు ఇస్తున్న సందేశమని ఆ నగర మేయర్ ఆండ్రియ్ సాడోవీ అన్నారు.

    "ఎల్వివ్‌పై దాడుల ద్వారా పోలండ్‌లో పర్యటిస్తున్న బైడెన్‌కు హలో చెప్పడమే రష్యా ఉద్దేశం. ఈ నగరం పోలండ్ సరిహద్దుకు కేవలం 70 కిమీ దూరంలో ఉంది. ఈ ముప్పు చాలా చాలా తీవ్రమైనదని ప్రపంచం అర్థం చేసుకోవాలి" అని ఆయన అన్నారు.

  4. ఖెర్సాన్‌ దాడిలో రష్యన్ జనరల్ ప్రాణాలు కోల్పోయారు

    రష్యా

    ఫొటో సోర్స్, DENIS NASIK/WIKIMEDIACOMMONS

    యుక్రెయిన్ దక్షిణ నగరం ఖెర్సాన్ సమీపంలో జరిగిన దాడిలో రష్యన్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ రెజాంట్సేవ్ మరణించారని యుక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది.

    రెజాంట్సేవ్, రష్యా 49వ సంయుక్త సైన్యానికి కమాండర్.

    యుక్రెయిన్ యుద్ధంలో మరణించిన రష్యన్ అత్యున్నత స్థాయి అధికారుల్లో రెజాంట్సేవ్ ఏడవ జనరల్, రెండవ లెఫ్టినెంట్ జనరల్ అని పశ్చిమ దేశాలకు చెందిన అధికారి ఒకరు తెలిపారు.

  5. యుక్రెయిన్-రష్యా యుద్ధం: తాజా పరిణామాలు

    యుక్రెయిన్-రష్యా యుద్ధంలో తాజా పరిణామాలివి..

    బైడెన్ ప్రసంగం: పోలండ్ రాజధాని వార్సాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగిస్తూ, "దేవుడి సాక్షిగా, ఈ వ్యక్తి ఇక అధికారంలో కొనసాగకూడదు" అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ గురించి వ్యాఖ్యానించారు.

    అయితే, బైడన్, రష్యా ప్రభుత్వంలో మార్పు కోసం పిలుపునివ్వలేదని, పొరుగు దేశాలపై పుతిన్ అధికారం చెలాయించేందుకు అనుమతించకూడదని మాత్రమే అన్నారని ఆ తరువాత వైట్ హౌస్ సంజాయిషీ ఇచ్చింది.

    బైడెన్ వ్యాఖ్యలకు క్రెమ్లిన్ స్పందిస్తూ, రష్యాను ఎవరు పాలించాలో నిర్ణయించేది బైడెన్ కాదని పేర్కొంది.

    ఎల్వివ్‌లో రాకెట్ కాల్పులు: శనివారం ఎల్వివ్‌లో భారీ పేలుళ్లు వినిపించాయి. నగర శివార్లలో దట్టంగా నల్లటి పొగలు కమ్ముకున్నాయి. యుక్రెయిన్‌కు పశ్చిమాన ఉన్న ఎల్వివ్ నగరం పోలండ్ సరిహద్దులకు సమీపంలో ఉంది.

    బైడెన్ పోలండ్‌ను సందర్శిస్తున్న సందర్భంగా, ఆయనకు సందేశం పంపడం కోసమే రష్యా భారీ రాకెట్ కాల్పులు జరిపిందని ఎల్వివ్ నగర మేయర్ అన్నారు.

    ఇప్పటివరకు, యుద్ధం నుంచి తప్పించుకునేందుకు యుక్రెయినియన్లకు ఎల్వివ్ నగరం సురక్షిత ప్రాంతంగా నిలిచింది.

    జెలియెన్‌స్కీ ప్రసంగం: యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ మాట్లాడుతూ, పశ్చిమ దేశాలు తమ దేశానికి అందించే సైనిక సామాగ్రిని పెంచాలని డిమాండ్ చేశారు. యుక్రెయిన్ మాత్రమే ప్రమాదంలో పడలేదని ఆయన అన్నారు.

    రష్యాతో పోరాడడానికి నాటో ట్యాంకులు, విమానాల్లో కేవలం 1 శాతం తమ బలగాలకు అందిస్తే చాలని అన్నారు.

    చెర్నోబిల్‌పై ఆందోళనలు: చెర్నోబిల్ పవర్ ప్లాంట్‌లో దాదాపు వారం రోజులుగా సిబ్బంది రొటేషన్ జరగకపోవడంతో అక్కడి సిబ్బంది సంక్షేమంపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి.

    రష్యా స్వాధీనం చేసుకున్న అణు కేంద్రాల వద్ద యుక్రెయిన్ సిబ్బంది ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల గురించి తాము ఆందోళన చెందుతున్నామని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) తెలిపింది.

  6. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై రష్యా ఘాటుగా స్పందించింది. రష్యా అధ్యక్షుడిగా ఎవరు ఉండాలో చెప్పాల్సింది బైడెన్ కాదు, రష్యన్ ప్రజలని క్రెమ్లిన్ ఓ ప్రకటన చేసింది.

    యుక్రెయిన్-రష్యా యుద్ధ వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ క్లిక్ చేయండి.