You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రష్యా ఆయిల్‌, గ్యాస్‌పై నిషేధం విధించిన అమెరికా, బ్రిటన్.. యుక్రెయిన్‌లో పుతిన్ ఎన్నటికీ విజయం సాధించలేరన్న బైడెన్

రష్యా చమురు దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ నిర్ణయానికి అమెరికా కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అయితే, ఇది స్వేచ్ఛను రక్షించేందుకు చెల్లిస్తున్న ధర అని అభివర్ణించారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. నో-ఫ్లై జోన్ అంటే ఏమిటి? జెలియెన్‌స్కీ అభ్యర్థనను నాటో దేశాలు ఎందుకు పట్టించుకోవడం లేదు

    యుక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని జెలియెన్‌స్కీ ఎందుకు పదేపదే కోరుతున్నారు?

    యుక్రెయిన్‌కు అన్ని రకాలుగా సాయం చేస్తామంటున్న పాశ్చాత్య దేశాలు, అమెరికా ఈ ‘నో - ఫ్లై జోన్’ విషయంలో మాత్రం యుక్రెయిన్‌ విజ్ఞప్తిని తోసిపుచ్చుతున్నాయి.

    అసలు నో-ఫ్లై జోన్ అంటే ఏమిటి?

    పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి

  2. నెమ్మదించిన రష్యన్ సేనల కదలికలు

    యుక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ కొనసాగుతోందని, అయితే, రష్యా సేనల కదలికలు మాత్రం నెమ్మదించాయని యుక్రెయిన్ మిలిటరీ చెబుతోంది.

    మార్చి 8 ఉదయం 6 గంటల సమయానికి యుక్రెయిన్ దక్షిణ, ఉత్తర, తూర్పు భూభాగాన్ని సంరక్షించుకునేందుకు యుక్రెయిన్ సేనలు పోరాడుతున్నట్లు యుక్రెయిన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రతినిధి తెలిపారు.

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌తో పాటు చెర్నిహియెవ్ యుక్రెయిన్ అధీనంలోనే ఉన్నట్లు చెప్పారు.

    రష్యా చేస్తున్న వైమానిక, క్షిపణి దాడులను యుక్రెయిన్ వాయుసేనలు విజయవంతంగా తిప్పి కొడుతున్నట్లు తెలిపింది.

    ‘ఆక్రమణదారులు నైతిక బలాన్ని కోల్పోయి దోపిడీలకు పాల్పడుతూ సైనిక పోరాటాల సమయంలో వర్తించే ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు".

    రష్యా ఆక్రమణలోనున్న భూభాగాల్లో స్థానికులను ప్రభావితం చేసేందుకు ప్రచారాలను నిర్వహిస్తూ రష్యా మానసికంగా పైచేయి సాధించాలని చూస్తోందని యుక్రెయిన్ మిలిటరీ ఆరోపిస్తోంది.

    అయితే, యుక్రెయిన్ చేస్తున్న వాదనలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

  3. ‘ఆప్తుల కోసం మీరు పడుతున్న ఆందోళన నాకు తెలుసు’ - మహిళలకు పుతిన్ సందేశం

    అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక వీడియో విడుదల చేశారు.

    ఆ వీడియోలో ఆయన... రష్యా సైన్యంలోని రిజర్వ్ బలగాలు, నిర్బంధ సైనికులను యుక్రెయిన్‌ యుద్ధ రంగంలో దించడం లేదని స్పష్టం చేశారు.

    "సైన్యంలో సేవలందిస్తున్నవారంతా ఈ పోరాటంలో పాల్గొనరు.కేవలం శిక్షణ తీసుకున్న సైనిక సిబ్బందే ఈ యుద్ధంలో పాల్గొంటారు" అని పుతిన్ అన్నారు.

    ఇందుకు విరుద్ధంగా యుక్రెయిన్‌లో మాత్రం అనేక మంది సాధారణ పౌరులు సైనిక చర్యల్లో పాల్గొంటున్నారు.

    యుద్ధంలో పాల్గొంటున్న రష్యా సైనికుల తల్లులు, భార్యలు, అక్క చెల్లెళ్లు, కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు, ప్రేమికురాళ్ల ఆందోళన తగ్గించేలా మహిళలనుద్దేశించి పుతిన్ సందేశమిచ్చారు.

    "మీ ఆప్తుల కోసం మీరెంత ఆందోళన చెందుతున్నారో నేను అర్థం చేసుకోగలను" అని అన్నారు.

    మహిళలంటే వెన్నంటి నిలిచి మద్దతిచ్చేవారని, విశ్వసనీయమైనవారని పుతిన్ తన ప్రసంగంలో చెప్పారు.

    "నా ప్రియమైన మహిళల్లారా! మీరీ ప్రపంచాన్ని మరింత మెరుగ్గా చేస్తారు. మీకున్న సున్నితత్వానికి, దయాగుణానికి, ఔదార్యానికి ధన్యవాదాలు. మీరు ఆకర్షణీయమైన మృదు స్వభావంతో పాటు అద్భుతమైన అంతర్గత సౌందర్యం కలిగి ఉంటారు’’ అన్నారు పుతిన్.

  4. ప్రపంచంలోనే అత్యధికంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా

    ప్రపంచంలోనే అత్యధికంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా రికార్డులకెక్కింది.

    సిరియా, ఇరాన్‌ల కంటే ఎక్కువగా రష్యా ఇప్పుడు ఆంక్షలను ఎదుర్కొంటోందని ఆంక్షలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంచే Castellum.ai అనే సంస్థ వెబ్‌సైట్ వెల్లడించింది.

    ఫిబ్రవరి 22 నాటికి రష్యాపై మొత్తం 2,754 రకాల ఆంక్షలను విధించినట్లు ఈ సంస్థ పేర్కొంది.

    యుక్రెయిన్ పై ఆక్రమణ మొదలుపెట్టినప్పటి నుంచి మరో 2,778 ఆంక్షలను విధించారు.

    దీంతో, రష్యా పై ఆంక్షలు 5,532కు చేరాయి. ఇరాన్ పై 3,616 ఆంక్షలు అమలులో ఉండగా, రష్యా దీనిని మించిపోయింది.

    ఇందులో అత్యధికంగా 21 శాతం ఆంక్షలు అమెరికా విధించినవే ఉన్నాయి. యూకే, యూరోపియన్ యూనియన్ కలిపి విధించిన ఆంక్షల శాతం 18గా ఉంది.

    యుక్రెయిన్‌పై చేస్తున్న దాడులను ఆపేలా ఒత్తిడి తెచ్చేందుకు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి వివిధ దేశాలు.

  5. ‘మానవతా కారిడార్లను ఏర్పాటు చేయనున్న రష్యా’

    కీయెవ్, చెర్నిహియెవ్, సుమీ, ఖార్కియేవ్, మరియుపూల్ నగరాల నుంచి పౌరలును సురక్షితంగా తరలించేందుకు మానవతా కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు రష్యా డిఫెన్స్ అధికారులు ప్రకటించారు. మాస్కో కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి ఈ కారిడార్లు మొదలవుతాయని రష్యన్ మీడియా చెబుతోంది.

    అయితే, ఇందులో చాలా మార్గాలు రష్యా వైపు వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేయడాన్ని కీయెవ్ ఆమోదించలేదు.

    రష్యా తీసుకోబోయే చర్యలపై యుక్రెయిన్ ఇప్పటి వరకు బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

    రెండు పక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో, గతంలో పౌరులను తరలించేందుకు చేసిన చాలా ప్రయత్నాలు విఫలమయ్యాయి.

  6. రష్యా వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు - యుక్రెయిన్

    రష్యా సోమవారం సుమీ నగరంపై జరిపిన దాడుల్లో చిన్నారులు బలయ్యారని స్థానిక యుక్రెయిన్ సైనికాధికారి తెలిపారు.

    సుమీ నగర ఈశాన్య ప్రాంతంలో రష్యా వైమానిక దాడులు చేసినట్లు సుమీ ప్రాంతీయ సైనిక నిర్వహణకు నేతృత్వం వహిస్తున్న మిట్రో జిట్స్కీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో తెలిపారు.

    "ఇప్పటివరకు ఈ దాడుల్లో 10 మందికి పైగా మరణించినట్లు చెప్పిన మిట్రో.. ఈ దాడుల్లో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు" అని చెప్పారు.

    అయితే, ఈ వాదనలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

  7. యూఎస్ ఫైటర్ జెట్‌లను పోలండ్‌ పంపేందుకు ఒత్తిడి

    పోలిష్ యుద్ధ విమానాలను కీయెవ్‌కు పంపినట్లైతే, వాటికి అదనంగా అమెరికా కూడా తన ఫైటర్ జెట్‌లను పంపించాలని అమెరికా చట్టసభల సభ్యులు బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.

    తూర్పు యూరప్ మిత్ర దేశాల్లో ఒకటైన పోలండ్ దగ్గర రష్యా వాడి వదిలేసిన విమానాలు ఉన్నాయి.

    యుక్రెయిన్ పైలట్లకు ఈ విమానాలను నడిపే సామర్థ్యం ఉంది. ఈ విమానాలను తమ దేశానికి తరలించమని యుక్రెయిన్ అధ్యక్షుడు కోరారు.

    అయితే, కీయెవ్‌కు విమానాలను పంపించే విషయంలో వార్సా ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది పూర్తిగా పోలండ్ ప్రభుత్వ నిర్ణయమని అమెరికా పేర్కొంది.

    విమానాలను తరలించడం అంత సులభమైన విషయమేమి కాదని వైట్‌హౌస్ తెలిపింది.

    పోలిష్ విమానాలకు అదనంగా అమెరికా నుంచి అధునాతనమైన విమానాలను పంపాల్సిన అవసరముందని సెనేటర్లు కోరుతున్నారు.

    "యుక్రెయిన్ రక్షణ కోసం మిత్ర దేశాలు పంపించే విమానాలకు అదనంగా అమెరికా చేపట్టే చర్యలను సెనేట్‌లో పూర్తిగా సమర్థిస్తాను" అని సెనేట్‌లో కీలక సభ్యుడు బాబ్ మెనెందెజ్ అన్నారు.

  8. రష్యాలో కార్యకలాపాలు నిలిపివేస్తామంటున్న ఐబీఎం

    ఐటీ సేవల దిగ్గజం ఐబీఎం రష్యాలో తమ సంస్థ కార్యకలాపాలను తగ్గిస్తామని ప్రకటించింది.

    రష్యా సైనిక సంస్థలతో సంస్థ చేసే వ్యాపారాన్ని ఆపివేయడంతో పాటు రష్యాకు తమ సాంకేతికతను అమ్మడాన్ని ఆపేస్తామని ఐబీఎం తెలిపింది. ఈ మేరకు ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరవింద్ కృష్ణ ప్రకటన విడుదల చేశారు.

    యుక్రెయిన్‌లో అంతర్జాతీయ రెడ్ క్రాస్ సహాయక చర్యలకు మద్దతిచ్చేందుకు తమ సంస్థ ఉద్యోగుల నుంచి సేకరించిన విరాళాలనుఅందచేస్తామని తెలిపారు.

    రష్యాలో కొత్త పెట్టుబడులన్నిటినీ నిలిపివేస్తామని వినియోగ ఉత్పత్తుల సంస్థ ప్రాక్టర్ & గాంబిల్ కూడా సోమవారం ప్రకటించింది.

    రష్యాలో తమ సంస్థ మీడియా ద్వారా చేసే ప్రకటనలు, ప్రచారాన్ని కూడా నిలిపివేస్తామని ప్రకటించింది.

    రష్యా ప్రజలకు అవసరమైన ఆరోగ్యపరమైన, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై మాత్రమే దృష్టి పెట్టి మిగిలిన ఉత్పత్తుల అమ్మకాలను క్రమంగా నిలిపేస్తామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాన్ ముల్లర్ తెలిపారు.

    హోమ్ ఇంప్రూవ్‌మెంట్ రంగంలో ఉన్న జర్మన్ సంస్థ ఓబీఐ కూడా రష్యాలో తమ సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తామని తెలిపింది. ఈ సంస్థకు రష్యాలో 27 బ్రాంచీలు, 5000 మంది సిబ్బంది ఉన్నారు.

    ఇప్పటికే పశ్చిమ దేశాలకు చెందిన 230 సంస్థలు రష్యా నుంచి వైదొలిగినట్లు యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విశ్లేషణ చెబుతోంది. ప్రస్తుతానికి రష్యాలో వ్యాపారం కొనసాగిస్తున్న కోకో-కోలా, మెక్ డోనల్డ్, పెప్సీ, స్టార్ బక్స్ లాంటి సంస్థలు కూడా తమ కార్యకలాపాలను తగ్గించే అవకాశముందని యేల్ విశ్లేషణ పేర్కొంది.

  9. దక్షిణ రేవు పట్టణం ఒడెస్సాలో భారీ పేలుళ్లు, పాల్ కెన్యన్, బీబీసీ పనోరమ, ఒడెస్సా

    ఒడెస్సా రేవు పట్టణంలో మూడు నుంచి నాలుగు భారీ పేలుళ్లు జరిగిన శబ్దం వినిపించింది. ఈ శబ్ధాలు నగరానికి పశ్చిమ దిక్కు నుంచి వినిపించాయి.

    ఒడెస్సా తీరంలో ఉన్న యుద్ధ నౌకల నుంచి ప్రయోగిస్తున్న రష్యన్ క్షిపణులను యుక్రెయిన్ రక్షణ వ్యవస్థ తిప్పి కొడుతున్నట్లు తెలిసింది.

    రష్యాకు వ్యూహాత్మక లక్ష్యంగా ఉన్న ఒడెస్సాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

    యుక్రెయిన్ సేనలు ఆదివారం రష్యా దళాలను దెబ్బ తీయడంతో తీవ్ర నష్టం జరిగినట్లు చెబుతున్నారు.

    ఈ చర్య పట్ల యుక్రెయిన్ సేనలు సంబరం జరుపుకుంటున్నట్లుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి.

    నగరంలో ప్రతి రోజు రాత్రి 7 గంటల నుంచి కర్ఫ్యూ మొదలవుతోంది.

    సోమవారం వైమానిక దాడి సైరెన్లు ఒక గంట వరకు వినిపించాయి.

    రష్యా దాడి చేసేందుకు సన్నద్ధమవుతూ తమ నౌకల స్థావరాలను మార్చుకుంటోందని హెచ్చరికలు కూడా జారీ చేశారు.

  10. రష్యాపై గెలిచేవరకు కీయెవ్‌లోనే ఉంటాను - జెలియెన్‌స్కీ

    యుద్ధంలో గెలిచే వరకూ కీయెవ్ లోనే ఉంటానని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ స్పష్టం చేశారు.

    "నేను దాక్కోవటం లేదు. నేను ఎవరికీ భయపడటం లేదు. ఈ యుద్ధంలో గెలిచేవరకూ నేనిక్కడే ఉంటాను" అని సందేశమిస్తూ వీడియో విడుదల చేశారు.

    ఈ సందేశాన్ని సోమవారం సాయంత్రం రికార్డు చేసినట్లు నిరూపించేందుకు జెలియెన్‌స్కీ కార్యాలయం నుంచి కనిపిస్తున్న రాత్రి పూట నగర దృశ్యాలను చూపించారు. ఆయన కార్యాలయం యుక్రెయిన్ రాజధాని కీయెవ్ నడిబొడ్డున ఉంది.

  11. రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై బీబీసీ లైవ్ పేజీకి స్వాగతం

    యుక్రెయిన్‌, రష్యా సంక్షోభం 13వ రోజుకు చేరుకుంది.

    యుక్రెయిన్, రష్యా ప్రతినిధుల మధ్య మూడో విడత చర్చలు జరుగుతున్నాయి.

    యుక్రెయిన్ నగరాల నుంచి ఆ దేశ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటానికి రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ, మానవతా కారిడార్ల ఏర్పాటు ప్రణాళికను ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదన అనైతికమని యుక్రెయిన్ విమర్శించింది.

    రష్యా బలగాల ముట్టడిలో ఉన్న మరియపూల్, సుమీ నగరాల నుంచి తరలిపోయే వారిని యుక్రెయిన్‌లోని ఇతర నగరాలకు, రష్యా నగరాలకు తరలిస్తారు.

    ఈ యుద్ధానికి సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ లైవ్ పేజీ చూస్తూ ఉండండి.