మాస్కో జనంలో దిగ్భ్రాంతి, భయం, ఆశ్చర్యం, సెర్గీ గొరియాషికో, బీబీసీ రష్యన్, మాస్కో
యుక్రెయిన్ మీద రష్యా సైనిక దాడి ప్రారంభించటంతో.. రష్యా రాజధాని మాస్కోలోనూ జనంలో దిగ్భ్రాంతి, భయం, ఆశ్చర్యం కనిపిస్తున్నాయి.
యుక్రెయిన్ మీద సైనిక దాడి వార్తలు రాగానే.. తాము ఏం చేయాలంటూ మాస్కో నివాసులు ఒకరికొకరు సందేశాలు పంపించుకుంటున్నారు.
ఆహారం కొని పెట్టుకోవాలా? లేదంటే అమెరికా డాలర్లు తెచ్చి పెట్టుకోవాలా? అన్నది వారికి సంశయంగా మారింది.
మాస్కో స్టాక్ ఎక్సేంజ్ ట్రేడింగ్ నిలిపివేయటంతో రష్యా కరెన్సీ రూబుల్ పరిస్థితి ఏమవుతుందని కూడా కొందరు వాకబు చేస్తున్నారు.
బ్యాంకులు, కరెన్సీ మార్పిడి కేంద్రాల దగ్గర పెద్ద సంఖ్యలో జనం క్యూకట్టారు. వీధుల్లో పోలీసుల సంఖ్య కూడా పెరిగింది.
ఇక యుక్రెయిన్ మీద యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న వారు గురువారం సాయంత్రం మాస్కోలో ప్రదర్శన నిర్వహించే అవకాశం గురించి చర్చిస్తున్నారు.
అయితే అటువంటి ప్రదర్శనకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపించటం లేదు. గత కొద్ది రోజులుగా ఒంటరిగా నిరసన తెలుపుతున్న వ్యక్తులను పోలీసులు తక్షణమే నిర్బంధించారు.
సైనిక చర్య మొదలుకావటానికి ముందు నిర్వహించిన అభిప్రాయ సర్వేలో.. యుక్రెయిన్తో యుద్ధం సాధ్యం కాదని దాదాపు సగం మంది రష్యన్లు నమ్మారు.
వారిలో అత్యధిక శాతం మంది జనం.. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు ముదిరిపోవటానికి కారణం పశ్చిమ దేశాలు, నాటోనేనని తప్పుపట్టారు.