సింగపూర్, గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు
శుక్రవారం స్వదేశానికి తిరిగి చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో వారికి పరీక్షలు
చేశారు.
రాయిటర్స్ వివరాల
ప్రకారం ప్రభుత్వ విమాన సంస్థ ఎయిర్ ఇండియా విమానాల ద్వారా అమెరికా, బ్రిటన్,
ఈశాన్య ఆసియా నుంచి సుమారు 4 లక్షల మంది భారతీయులను తిరిగి దేశానికి తీసుకురావాలని
భావిస్తున్నారు.
వీటితోపాటు భారత
నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ జలాశ్వ మాల్దీవుల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి
తీసుకొస్తోంది.
స్థానిక టీవీ చానళ్లలో
ఎయిర్ ఇండియా విమానాల పైలెట్లను చూపించారు. వారందరూ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్
వేసుకుని కనిపించారు.
విదేశాల్లో
చిక్కుకుపోయిన భారతీయులు
లాక్డౌన్ నిర్ణయం వల్ల
ఆర్థికవ్యవస్థకు నష్టం కలుగుతున్నా, దేశంలో కరోనా కేసులు పెద్దగా తగ్గుతున్నట్లు
కనిపించడం లేదు.
విదేశాల్లో ఉంటున్న చాలా మంది భారతీయులను తిరిగి దేశానికి రావాలని
అనుకుంటున్నారు. కానీ ప్రయాణాలపై ఆంక్షల వల్ల వారు రాలేకపోతున్నారు.
విదేశాల్లో ఉన్నవారిలో చాలామంది
ఒత్తిడికి గురవుతున్నారు. రకరకాల సమస్యలు ఎదుర్కుంటున్నారు.
కొందరు అనారోగ్యంతో
ఉన్న కుటుంబ సభ్యుల కోసం దేశానికి వస్తుంటే, కొందరి కుటుంబ సభ్యులు చనిపోయారు. కొంతమందికి
ఉద్యోగాలు పోవడం, కొంతమంది చేతిలో డబ్బు లేకపోవడంతో స్వదేశానికి తిరిగి
వస్తున్నారు.
మొదటి దశలో మే 15 నాటికి విదేశాల్లో ఉన్న 2 లక్షల మందిని తిరిగి స్వస్థలాలకు చేర్చాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం
చెప్పింది.
జూన్ 15 నాటికి మూడున్నర నుంచి నాలుగు లక్షల మందిని భారత్ తీసుకురావాలని
భావిస్తున్నారు.
దిల్లీలో సింగపూర్
నుంచి వచ్చిన 250 మందికి కోవిడ్-19 పరీక్షలు చేశారు.
ప్రయాణికుల్లో ఎవరిలో
అయినా లక్షణాలు కనిపిస్తే వారిని ఆస్పత్రికి తీసుకెళ్తామని, మిగతావారిని 14 రోజుల
వరకూ ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచుతామని భారత హోం శాఖ జాయింట్
సెక్రటరీ చెప్పారు.
విదేశాల నుంచి
భారతీయులను భారీగా తీసుకురావడం వల్ల దేశంలో కరోనా కేసులు పెరుగుతాయనే ఆందోళనలు
కూడా వ్యక్తం అవుతున్నాయి.
హెల్త్ వర్కర్స్ నిఘాలో
ఉండేందుకు వీలుగా, విదేశాల నుంచి తీసుకొస్తున్న వారి కోసం ఆయా రాష్ట్రాల్లో హోటల్,
కాలేజ్ హాస్టళ్లు, ఖాళీగా ఉన్న ఇళ్లను క్వారంటైన్ సెంటర్లుగా మార్చాలని
చెప్పామని విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగ్రవాల్ చెప్పారు.