You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

భారత్‌లో 60వేలకు చేరువలో పాజిటివ్ కేసులు, 2వేలకు దగ్గరలో మరణాలు; ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది బాధితులు

భారత్‌లో కరోనావైరస్ కేసులు 60వేలకు చేరువలో ఉన్నాయి. మరణాల సంఖ్య 2వేలను సమీపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 40 లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటివరకూ 2.75 లక్షల మంది మరణించారు. అమెరికాలో 13 లక్షలకు చేరువలో బాధితుల సంఖ్య ఉంది. ఈ ఒక్క దేశంలోనే 77వేలకుపైగా రోగులు మరణించారు.

లైవ్ కవరేజీ

  1. స్లొవేనియాలో లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ సైకిలిస్టులు నిరసన

    స్లొవేనియాలో మార్చి మధ్య కాలం నుంచి కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ రాజధాని యుబ్లియానాలో శుక్రవారం నాడు వేలాది మంది సైకిలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

    దేశంలో రెండు వారాల కిందట కొన్ని ఆంక్షలను సడలించారు. కానీ.. ప్రజల స్వాతంత్ర్యాలను కత్తిరించటానికి ప్రధానమంత్రి యానెజా యాన్సా కరోనా మహమ్మారిని సాకుగా వాడుకుంటున్నారని నిరసనకారులు ఆరోపించారు.

    స్లొవేనియాలో ఇప్పటివరకూ 1,450 నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. దాదాపు 100 మంది చనిపోయారు.

  2. పాకిస్తాన్‌లో కేసులు పెరుగుతున్నా ఆంక్షల సడలింపు

    పాకిస్తాన్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా ఆర్థిక దిగ్బంధనాన్ని సడలిస్తోంది.

    ఆంక్షలకు దశల వారీ సడలింపుల్లో భాగంగా రాజధాని ఇస్లామాబాద్‌లో షాపులు, వ్యాపారాలు మళ్లీ తెరుచుకుకోవటం మొదలైంది.

    మొదట వ్యాపారాలు ప్రారంభించిన వాటిలో దుస్తులు, షూల దుకాణాలు, చిన్న మార్కెట్లు ఉన్నాయి. కానీ షాపింగ్ సెంటర్ల మూసివేత ఇంకా కొనసాగుతోంది.

    దేశంలో శుక్రవారం నాడు 2,000కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 27,000 దాటింది. ఇప్పటివరకూ దాదాపు 600 మరణాలు సంభవించాయి.

    ఆంక్షల సడలింపులనుపాకిస్తాన్ వ్యాపార సంఘాలు ఆహ్వానించాయి. దేశం ఎక్కువ కాలం దిగ్బంధనంలో కొనసాగజాలదని.. సడలింపుల వల్ల లక్షలాది ఉద్యోగాలు పోకుండా ఉంటాయని పేర్కొన్నాయి.

    విదేశాల నుంచి వచ్చే ఆదాయాలు, ఎగుమతులు పడిపోతుండటంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కష్టాల్లో పడింది.

    ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గత వారం ఆంక్షల సడలింపు చర్యలను ప్రకటిస్తూ.. ప్రజలు లాక్‌డౌన్‌లో జీవించగలిగే పరిస్థితి లేదని, ఇప్పుడు సామాజిక దూరం నిబంధనలను ప్రజలు పాటించాలని పేర్కొన్నారు.

  3. రష్యాలో రోజుకు 10,000 పైగా కేసుల చొప్పున పెరుగుదల

    రష్యాలో గత 24 గంటల్లో 10,817 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసులు 1,98,676కు చేరుకున్నాయి.

    గత రాత్రి 104 మంది చనిపోయారని, మొత్తం మరణాల సంఖ్య 1,827కు పెరిగిందని రష్యా కరోనావైరస్ టాస్క్‌ఫోర్స్ చెప్పింది.

    దేశంలో కేసుల సంఖ్య గత ఆదివారం నుంచి రోజుకు 10,000 కన్నా ఎక్కువగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్యలో రష్యా ఐదో పెద్ద దేశంగా ఉంది.

    ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలో 12 లక్షల కోట్ల కేసులు ఉన్నాయి.

  4. గుజరాత్: సూరత్‌లో వలస కార్మికుల ఆందోళన

    గుజరాత్‌లోని సూరత్‌లో హజీరా పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు కొంతమంది వలస కార్మికులు గుమిగూడారు.

    తమను స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ వారంతా ఆందోళనలు చేశారని ఏఎన్ఐ చెప్పింది.

    ఉదయం 8 గంటలకు 500 నుంచి 1000 మంది గుమిగూడారని, సొంత రాష్ట్రాలకు పంపించాలని డిమాండ్ చేశారని, కానీ బలగాలతో వారిని అడ్డుకుని 55 నుంచి 60 మందిని అరెస్టు చేశామని మరో 60 మందిని అదుపులోకి తీసుకున్నామని సూరత్ పోలీసు అధికారులు తెలిపారు.

  5. కొత్తగా 13 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా

    గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 13 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా సోకింది.

    వీరితో కలిపి సీఆర్పీఎఫ్‌లో మొత్తం రోనా కేసుల సంఖ్య 19కి చేరిందని సీఐఎస్ఎఫ్ అధికారులు ఏఎన్ఐకు చెప్పారు.

  6. ఒలింపిక్ క్రీడల తేదీ పొడిగింపు ఉండదు-ఐఓసీ

    టోక్యో ఒలింపిక్‌ క్రీడల తేదీని మరోసారి వాయిదా వేసే ఆలోచన లేదని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

    కొత్త షెడ్యూల్ ప్రకారం టోక్యో ఒలింపిక్ క్రీడలు వచ్చే ఏడాది జూన్ 23 నుంచి ఆగస్టు వరకు నిర్వహిస్తామన్నారు.

    కోవిడ్-19 మహమ్మారి వల్ల టోక్యో 2020 ఒలింపిక్ క్రీడలను ఏడాది వాయిదా వేశారు.

    ఈసారీ ఒలింపిక్ క్రీడలు చారిత్రకంగా నిలుస్తాయని ఐఓసీకి చెందిన జాన్ కోఎట్స్ చెప్పారు.

    ఆయన దానికి 20వ శతాబ్దంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ఒలింపిక్ క్రీడలను ఉదాహరణగా చెప్పారు.

    ఒలింపిక్ నిర్వహణ కమిటీ చీఫ్ యోషిరో మోరీ కూడా టోక్యో 2020 తేదీల్లో ఇక ఎలాంటి మార్పులు జరగవని చెప్పారు.

    "ఒలింపిక్ క్రీడల తేదీని పొడిగించడానికి ఇప్పుడు మా దగ్గర వేరే ప్రణాళిక లేదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మేం ముందుకు వెళ్తున్నాం" అని జాన్ కోఎట్స్ అన్నారు.

  7. కరోనాను ఎదుర్కోడానికి ఉత్తర కొరియాకు చైనా సాయం

    కరోనావైరస్ నుంచి బయటపడడానికి ఉత్తరకొరియాకు సాయం చేస్తామని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆ దేశ నేత కిమ్ జాంగ్ ఉన్‌కు చెప్పారని చైనా ప్రభుత్వ మీడియా చెప్పింది.

    ఉత్తర కొరియాలో పరిస్థితి, అక్కడి ప్రజల ఆరోగ్యం గురించి ఆయన చాలా ఆందోళన వ్యక్తం చేశారని చెప్పాయి.

    ఈ వైరస్‌ను అదుపుచేయడంలో చైనా విధానం చాలా సానుకూల ఫలితాలను ఇచ్చిందని ప్రభుత్వ టీవీ చానళ్లు తెలిపాయి.

  8. చైనా జర్నలిస్టులకు అమెరికా వీసా నిబంధనలు కఠినతరం

    చైనా నుంచి వచ్చే జర్నలిస్టులకు అమెరికా కొత్త వీసా నిబంధనలు జారీ చేసింది. చైనా వెళ్లిన అమెరికా జర్నలిస్టుల పట్ల వారి తీరుకు బదులుగానే ఈ చర్యలు తీసుకున్నామని అమెరికా చెప్పింది.

    ఇటీవల అమెరికా, చైనా పరస్పరం తమ దేశాలకు వచ్చే జర్నలిస్టులపై చాలా ప్రతీకార చర్యలకు పాల్పడ్డాయి. మార్చిలో చైనా కొంతమంది అమెరికా జర్నలిస్టులను దేశం వదిలి వెళ్లాలని కోరింది. వారు అమెరికా పత్రికల కోసం పనిచేసేవారు.

    నెల తర్వాత అమెరికా తమ దేశంలో పనిచేస్తున్న చైనా ప్రభుత్వ నియంత్రణలోని ఐదు పెద్ద మీడియా సంస్థలకు తాము విదేశీ రాయబార కార్యాలయం హోదాను ఇస్తామని చెప్పింది. ఒక రోజు తర్వాత చైనా వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు సంబంధించిన ముగ్గురు జర్నలిస్టులను బహిష్కరించింది.

    వారిలో ఇద్దరు అమెరికన్లు, ఒక ఆస్ట్రేలియన్ ఉన్నారు. చైనా ఈ నిర్ణయాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురించిన ఒక ఆర్టికల్‌కు ముడిపెట్టి చూశారు. చైనా ఈ కథనాన్ని జాత్యహంకారంగా చెప్పింది.

    శుక్రవారం కొత్త నిబంధనలు జారీ చేసిన అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ డిపార్టుమెంట్ చైనాలో స్వతంత్ర జర్నలిజాన్ని అణచివేస్తున్నారని చెప్పింది. కొత్త నిబంధనలు సోమవారం నుంచి అమలవుతాయి.

    దీని ప్రకారం చైనా నుంచి వచ్చే జర్నలిస్టులకు 90రోజులు ఉండడానికి మాత్రమే అనుమతి లభిస్తుంది. అయితే వీసా గడువు పొడిగించే ప్రత్యామ్నాయం కూడా ఇచ్చారు.

  9. కరోనావైరస్: విద్యార్థుల చదువుల్ని సంక్షోభంలో పడేస్తోందా? ఆన్‌లైన్ తరగతుల ప్రభావం వారిపై ఎలా ఉంటోంది?

    సీబీఎస్ఈ చదువులు ప్రారంభమై నెల రోజులు దాటిపోయింది. దాదాపు అన్ని పాఠశాలలు జూమ్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలా ఏదో ఒక వీడియో కాలింగ్ ప్లాట్ ఫాం ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నాయి.

    ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాకపోయినా... తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం మరో 2 నెలలు ఆలస్యం కావచ్చని ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో చెప్పారు.

    పదో తరగతి విద్యార్థుల పరీక్షలు ఇంకా పూర్తి కాని నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి.

    ఏపీలో సప్తగిరి ఛానెల్ ద్వారా రోజూ రెండు గంటలు, అలాగే రేడియో, రెయిన్ బో ఎఫ్ఎం ఛానెళ్ల ద్వారా పాఠాలను బోధిస్తూ విద్యార్థులను ఏదో విధంగా పరీక్షలకు సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తోంది విద్యా శాఖ.

    ఇక కార్పొరేట్ పాఠశాలల విషయానికొస్తే... దాదాపు నెల రోజులుగా అన్ని పాఠాశాలలు పిల్లలకు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి.

    పదో తరగతి మినహా ప్రైమరీ, హైస్కూల్ విద్యార్థుల విషయానికొచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో ఇంకా వారికి చదువులు ప్రారంభం కాలేదు. కానీ జాతీయ స్థాయిలో ముఖ్యంగా సీబీఎస్ఈ స్కూళ్లలో మాత్రం చదువులు ప్రారంభమయ్యాయి.

    ఏపీ ప్రభుత్వం చెబుతున్న ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విద్యా సంవత్సరం ప్రారంభమైతే.. అక్కడ కూడా జూన్ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకు ఇదే పరిస్థితి తప్పకపోవచ్చు.

  10. కర్ణాటకలో 36 కొత్త కేసులు నమోదు

    కర్ణాటకలో శుక్రవారం సాయంత్రం 5 నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 వరకూ మరో 36 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 789కి చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది

    ఇప్పటివరకూ 379 మంది డిశ్చార్జ్ కాగా, 30 మంది కోవిడ్ రోగులు చనిపోయారు.

  11. ఏపీలో 24 గంటల్లో 43 కొత్త కరోనా కేసులు, ముగ్గురు మృతి

    ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 43 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1930కి చేరుకుంది.

    వీటిలో యాక్టివ్ కేసులు 999 కాగా, 887 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

    గత 24 గంటల్లో ముగ్గురు కోవిడ్-19 రోగులు మృతిచెందారు.

    కృష్ణా జిల్లాలో ఇద్దరు, కర్నూలులో ఒకరు చనిపోయారు. వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 44కు చేరింది.

    గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో 16, చిత్తూరు జిల్లాలో 11, కర్నూలులో 6, విశాఖపట్టణంలో 5, అనంతపురంలో 3, గుంటూరులో 2 కరోనా కేసులు నమోదయ్యాయి.

    మొత్తం కేసుల్లో గుజరాత్‌కు చెందిన ఆరుగురు, కర్ణాటకకు చెందిన ఒకరు ఉన్నారు.

  12. దేశంలో మరణాల రేటు 3.3 శాతం-మంత్రి హర్షవర్ధన్

    "అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ఉన్నంత ఘోరమైన పరిస్థితి భారత్‌లో లేదు.అయినా, ఎంత ఘోరమైన పరిస్థితినైనా ఎదుర్కునేందుకు దేశమంతా సిద్ధంగా ఉంది".అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పిన్లు ఏఎన్ఐ తెలిపింది.

    దేశంలో మరణాల రేటు దాదాపు 3.3 ఉందని, కోలుకుంటున్నవారి రేటు 29.9కి పెరిగిందని ఇది చాలా మంచి సంకేతమని ఆయన చెప్పారు.

    గత 3 రోజులుగా డబ్లింగ్ రేటు 11 రోజులు ఉందని, గత 7 రోజులుగా అది 9.9గా ఉందని మంత్రి తెలిపారు.

  13. జర్మనీలో గత 24 గంటల్లో 147 మరణాలు

    జర్మనీలో గత 24 గంటల్లో 1251 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    వీటితో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,68,551కు చేరింది.

    జర్మనీలో కొత్తగా 147 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 7.369కి పెరిగింది.

  14. మహారాష్ట్రలో 714 మంది పోలీసులకు కరోనా

    కరోనా పరీక్షల్లో మహారాష్ట్ర పోలీసు శాఖలోని 714 మంది పోలీసులకు పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర పోలీస్ శాఖ ఏఎన్ఐకు చెప్పింది.

    వీటిలో 648 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 61 మంది కోలుకోగా, ఐదుగురు పోలీసులు మరణించారు.

    లాక్‌డౌన్ సమయంలో పోలీసులపై 194 దాడులు జరిగాయని, దీనికి సంబంధించి 689 మందిని అరెస్టు చేశామని మహారాష్ట్ర పోలీసులు చెప్పారు.

  15. చైనాను అమెరికా బెదిరించడంపై ఐఎంఎఫ్ హెచ్చరిక

    ప్రపంచ ఆర్థికవ్యవస్థకు సంబంధించి అంచనాలు తగ్గించుకోవాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) సంకేతాలు ఇచ్చింది.

    మరోసారి ట్రేడ్ వార్‌లో చిక్కుకోవద్దని అమెరికా, చైనాలను హెచ్చరించిన ఐఎంఎఫ్, అది కోవిడ్-19 మహమ్మారికి గురైన ఆర్థికవ్యవస్థలను కాపాడే ప్రయత్నాలను బలహీనపరుస్తాయని చెప్పింది.

    రాయిటర్స్ వివరాల ప్రకారం ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీనా జార్జీవా యూరోపియన్ యూనివర్సిటీ ఆన్‌లైన్ ఈవెంట్‌లో దీనిపై మాట్లాడారు.

    2020లో ప్రపంచ ఆర్థికవ్యవస్థలో 3 శాతం పతనం ఉంటుందని ఆమె అంచనా వేశారు. కానీ, చాలా దేశాల ఆర్థిక గణాంకాల్లో కూడా తగ్గుదల కనిపించింది.

    తక్షణ వైద్య చికిత్సలు అందకపోవడం వల్ల కొన్ని ఆర్థికవ్యవస్థలకు కరోనాను ఎదుర్కోవడం సమస్య కావచ్చని ఆమె తెలిపారు.

    కరోనా వైరస్ గురించి పక్కాగా ఏదీ చెప్పలేకపోతున్నామని, అందుకే ఆర్థిక అంచనాలపై దాని ప్రభావం పడుతోందన్నారు..

    కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కునే విధానం గురించి మాట్లాడిన అధ్యక్షుడు ట్రంప్, కొత్త పన్నులు విధించి శిక్షిస్తామని చైనాను బెదిరించారు.

    అమెరికా-చైనా ట్రేడ్ డీల్ మొదటి దశకు తాను ముగింపు పలకగలనని ట్రంప్ శుక్రవారం సంకేతాలు ఇచ్చారు.

    అదే రోజు మాట్లాడిన క్రిస్టినా జార్జీవా ఈ సున్నిత సమయంలో సంరక్షణ విధానాన్ని అవలంబించడం వల్ల ప్రపంచంలో సంస్కరణల అవకాశాలకు విఘాతం కలగవచ్చని చెప్పారు.

    ప్రపంచవ్యాప్తంగా దేశాల ఆర్థికవ్యవస్థలకు తీవ్రంగా నష్టం జరుగుతోంది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థికవ్యవస్థలో 3 శాతం పతనం నమోదవుతుందని అంతకు ముందు అంతర్జాతీయ ద్రవ్యనిధి చెప్పింది.

    ఐఎంఎఫ్ దీనిని 1930లో ‘మహామాంద్యం’ తర్వాత దశకాల్లో అత్యంత దారుణమైన ప్రపంచ పతనం అని, కరోనావైరస్ ప్రపంచాన్ని ‘చారిత్రక సంక్షోభం’లో పడేసిందని చెప్పింది.

    కోవిడ్-19 మహమ్మారి సుదీర్ఘకాలం పాటు ఇలాగే కొనసాగితే, ఆ సంక్షోభాన్ని ఎదుర్కోవడం ప్రభుత్వాలకు, ప్రభుత్వ బ్యాంకుల సామర్థ్యానికి అసలుపరీక్ష అవుతుందని కూడా ఐఎంఎఫ్ తెలిపింది.

  16. స్వదేశానికి రానున్న 4 లక్షల మందిని భారతీయులు

    సింగపూర్, గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు శుక్రవారం స్వదేశానికి తిరిగి చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో వారికి పరీక్షలు చేశారు.

    రాయిటర్స్ వివరాల ప్రకారం ప్రభుత్వ విమాన సంస్థ ఎయిర్ ఇండియా విమానాల ద్వారా అమెరికా, బ్రిటన్, ఈశాన్య ఆసియా నుంచి సుమారు 4 లక్షల మంది భారతీయులను తిరిగి దేశానికి తీసుకురావాలని భావిస్తున్నారు.

    వీటితోపాటు భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ జలాశ్వ మాల్దీవుల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకొస్తోంది.

    స్థానిక టీవీ చానళ్లలో ఎయిర్ ఇండియా విమానాల పైలెట్లను చూపించారు. వారందరూ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ వేసుకుని కనిపించారు.

    విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు

    లాక్‌డౌన్ నిర్ణయం వల్ల ఆర్థికవ్యవస్థకు నష్టం కలుగుతున్నా, దేశంలో కరోనా కేసులు పెద్దగా తగ్గుతున్నట్లు కనిపించడం లేదు.

    విదేశాల్లో ఉంటున్న చాలా మంది భారతీయులను తిరిగి దేశానికి రావాలని అనుకుంటున్నారు. కానీ ప్రయాణాలపై ఆంక్షల వల్ల వారు రాలేకపోతున్నారు.

    విదేశాల్లో ఉన్నవారిలో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. రకరకాల సమస్యలు ఎదుర్కుంటున్నారు.

    కొందరు అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుల కోసం దేశానికి వస్తుంటే, కొందరి కుటుంబ సభ్యులు చనిపోయారు. కొంతమందికి ఉద్యోగాలు పోవడం, కొంతమంది చేతిలో డబ్బు లేకపోవడంతో స్వదేశానికి తిరిగి వస్తున్నారు.

    ప్రభుత్వ ప్రణాళిక ఏంటి?

    మొదటి దశలో మే 15 నాటికి విదేశాల్లో ఉన్న 2 లక్షల మందిని తిరిగి స్వస్థలాలకు చేర్చాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది.

    జూన్ 15 నాటికి మూడున్నర నుంచి నాలుగు లక్షల మందిని భారత్ తీసుకురావాలని భావిస్తున్నారు.

    దిల్లీలో సింగపూర్ నుంచి వచ్చిన 250 మందికి కోవిడ్-19 పరీక్షలు చేశారు.

    ప్రయాణికుల్లో ఎవరిలో అయినా లక్షణాలు కనిపిస్తే వారిని ఆస్పత్రికి తీసుకెళ్తామని, మిగతావారిని 14 రోజుల వరకూ ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచుతామని భారత హోం శాఖ జాయింట్ సెక్రటరీ చెప్పారు.

    విదేశాల నుంచి భారతీయులను భారీగా తీసుకురావడం వల్ల దేశంలో కరోనా కేసులు పెరుగుతాయనే ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

    హెల్త్ వర్కర్స్ నిఘాలో ఉండేందుకు వీలుగా, విదేశాల నుంచి తీసుకొస్తున్న వారి కోసం ఆయా రాష్ట్రాల్లో హోటల్, కాలేజ్ హాస్టళ్లు, ఖాళీగా ఉన్న ఇళ్లను క్వారంటైన్ సెంటర్లుగా మార్చాలని చెప్పామని విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగ్రవాల్ చెప్పారు.

  17. కోవిడ్ రోగుల డిశ్చార్జి పాలసీలో సవరణ

    భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సవరించిన కోవిడ్-19 రోగుల డిశ్చార్జ్ పాలసీని విడుదల చేసినట్లు ఏఎన్ఐ చెప్పింది.

    కోవిడ్-19 డిశ్చార్జ్ పాలసీలో సవరణలు

    1. స్వల్ప అనారోగ్యం, లక్షణాలు కనిపించే ముందు

    • లక్షణాలు తగ్గిన పది రోజుల తర్వాత, 3 రోజులు జ్వరం రాకపోతే డిశ్చార్జ్ చేస్తారు.
    • వీరికి RT-PCR పరీక్ష చేయాల్సిన అవసరం ఉండదు

    2. మధ్యరకం కేసులు

    • 3 రోజుల్లో జ్వరం తగ్గితే, సపోర్ట్ లేకుండా శ్వాస తీసుకోగలుగుతుంటే...
    • లక్షణాలు తగ్గిన పది రోజుల తర్వాత, మందులు తీసుకోకుండానే జ్వరం తగ్గితే, ఆక్సిజన్ అవసరం లేకుండా శ్వాస తీసుకోగలిగితే డిశ్చార్జ్ చేస్తారు.
    • వీరికి RT-PCR పరీక్ష చేయాల్సిన అవసరం ఉండదు.

    ఒకవేళ లక్షణాలు తగ్గకుండా, ఆక్సిజన్ థెరపీ కొనసాగుతుంటే...

    • రోగుల్లో వైద్యపరమైన క్లినికల్ లక్షణాలు కనిపించకపోయినా, వరసగా 3 రోజులపాటు తగినంత ఆక్సిజన్ పీల్చుకోగలుగుతుంటే డిశ్చార్జ్ చేస్తారు.
    • వీరికి కూడా RT-PCR పరీక్ష అవసరం ఉండదు.

    3. తీవ్రంగా ఉన్న కేసులు

    వైద్యపరంగా పూర్తిగా కోలుకున్నప్పుడు, లక్షణాలు తగ్గిన తర్వాత చేసిన RT-PCR పరీక్షలో నెగటివ్ వచ్చాక మాత్రమే డిశ్చార్జ్ చేస్తారు.

  18. భారత్‌లో 60 వేలకు చేరువలో కరోనా కేసులు

    భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 60 వేలకు చేరువగా ఉంది.

    భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,662కు చేరుకుంది.

    మృతుల సంఖ్య 1981కి పెరిగింది.

    వీటిలో 39,834 యాక్టివ్ కేసులు ఉండగా, 17,846 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

    • దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 19,063 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 731 మంది చనిపోయారు.
    • గుజరాత్‌లో 7,402 కేసులు నమోదవగా, ఇప్పటివరకూ 449 మంది చనిపోయారు.
    • దిల్లీలో కోవిడ్-19 కేసుల సంఖ్య 6,318కి పెరిగింది. ఇక్కడ 68 మంది కోవిడ్ రోగులు చనిపోయారు.
    • తమిళనాడులో మొత్తం 6,009 కేసులు నమోదవగా, 40 మంది మృతిచెందారు.

    మధ్యప్రదేశ్‌లో 200, రాజస్థాన్‌లో 101 మంది మృతులు

    • మధ్యప్రదేశ్‌లో కరోనా మృతుల సంఖ్య 200కు చేరింది. రాష్ట్రంలో 3,341 కరోనా కేసులు నమోదయ్యాయి.
    • రాజస్థాన్‌లో కరోనా మృతుల సంఖ్య వంద దాటింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 57 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3636కు, మృతుల సంఖ్య 103కు పెరిగింది.
  19. స్పెయిన్: మాడ్రిడ్, బార్సిలోనాలో కొనసాగనున్న లాక్‌డౌన్

    స్పెయిన్‌లో లాక్‌డౌన్ దశలవారీగా సడలిస్తున్నారు.

    కానీ మాడ్రిడ్, బార్సిలోనా లాంటి నగరాల్లో ప్రస్తుతానికి దీన్ని ఎత్తివేయడం లేదు.

    కొత్త నియమాల ప్రకారం బార్లు, రెస్టారెంట్లు, చర్చిల్లో పరిమితంగా జనాలను అనుమతించాలి.

    బార్సిలోనా, మాడ్రిడ్‌లో ఈ నిబంధనలను పాటించకపోవడంతో, అక్కడ లాక్‌డౌన్ కొనసాగిస్తున్నారు.

    స్పెయిన్‌లో నాలుగు దశల్లో లాక్‌డౌన్ ఎత్తేయాలని నిర్ణయించారు. కానీ కరోనా కేసులు ఎంత తగ్గాయి అనే దానిని బట్టి ఆయా ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వనున్నారు.

    స్పెయిన్‌లో దాదాపు సగం కరోనా కేసులు కెటలోనియా(బార్సిలోనా ఈ ప్రాంతం రాజధాని), మాడ్రిడ్‌లోనే బయటపడ్డాయి.

  20. టీకా లేకుండానే కరోనా పోతుంది: అమెరికా అధ్యక్షుడు ట్రంప్

    వ్యాక్సిన్ లేకుండానే కరోనావైరస్ పోతుందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

    వచ్చే ఏడాది కరోనా కేసులు మళ్లీ పెరగవచ్చని కూడా ఆయన హెచ్చరించారు.

    శుక్రవారం కాంగ్రెస్ సభ్యులతో మాట్లాడిన ఆయన తన అంచనాలను సమర్థించే ఎలాంటి శాస్త్రీయ ఆధారాల గురించి చెప్పలేదు.